౧ తరువాత సొలొమోను వివాహం ద్వారా ఐగుప్తు రాజు ఫరోతో సంధి కుదుర్చుకున్నాడు. అతడు తన అంతఃపురాన్నీ యెహోవా మందిరాన్నీ యెరూషలేము చుట్టూ ప్రాకారాన్నీ కట్టించడం అయ్యే దాకా ఫరో కూతురిని దావీదు పురంలో ఉంచాడు. ౨ అప్పటి వరకూ యెహోవా పేరట కట్టిన మందిరం లేనందువలన ప్రజలు ఉన్నత స్థలాల్లో మాత్రమే బలులు అర్పిస్తూ వచ్చారు. ౩ సొలొమోను తన తండ్రి దావీదు నియమించిన శాసనాలు అనుసరిస్తూ యెహోవా దేవుణ్ణి ప్రేమించాడు గాని ఉన్నత స్థలాల్లో మాత్రం ఇంకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూనే ఉన్నాడు. ౪ ఉన్నత స్థలాల్లో గిబియోను ముఖ్యమైనది కాబట్టి రాజు అక్కడికి వెళ్ళి ఆ బలిపీఠం మీద వెయ్యి దహనబలులు అర్పించాడు.
౫ గిబియోనులో యెహోవా రాత్రి కలలో సొలొమోనుకు ప్రత్యక్షమై “నేను నీకు ఏమి ఇవ్వాలి?” అని అడిగాడు. ౬ సొలొమోను ఈ విధంగా వేడుకున్నాడు “నీ దాసుడు, నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యాన్ని, నీతిని అనుసరించి యథార్థమైన మనసు కలిగి ప్రవర్తించాడు. కాబట్టి నీవు అతని మీద పరిపూర్ణ కటాక్షం చూపించి, ఈ రోజు ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చోబెట్టి అతని పై గొప్ప అనుగ్రహం చూపించావు.
౭ నా దేవా, యెహోవా, నీవు నా తండ్రి దావీదుకు బదులుగా నీ సేవకుడైన నన్ను రాజుగా నియమించావు. అయితే నేను బాలుణ్ణి. రాజ్య వ్యవహారాలు జరిపించడానికి నాకు తెలివి చాలదు. ౮ నీ దాసుడినైన నేను నీవు ఎన్నుకొన్న ప్రజల మధ్య ఉన్నాను. వారు గొప్ప జనాంగం కాబట్టి వారిని లెక్క పెట్టడం, ఈ విశాలమైన దేశాన్ని అజమాయిషీ చేయడం నాకు అసాధ్యం. ౯ నీ ఈ గొప్ప జనాంగానికి ఎవరు న్యాయం తీర్చగలరు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ ప్రజలకు న్యాయం తీర్చగలిగేలా నీ దాసుడినైన నాకు వివేకం గల హృదయం ఇవ్వు.”
౧౦ సొలొమోను చేసిన ఈ మనవి దేవునికి ఇష్టమైంది. ౧౧ కాబట్టి దేవుడు అతనితో “దీర్ఘాయువునూ ఐశ్వర్యాన్నీ, నీ శత్రువుల ప్రాణాలనూ అడగకుండా, న్యాయాన్ని గ్రహించడానికి వివేకం ఇమ్మని నీవు అడిగావు. ౧౨ నీవు ఈ విధంగా అడిగినందువల్ల నీ మనవి ఆలకించాను. జ్ఞాన వివేకాలు గల హృదయం నీకిస్తున్నాను. పూర్వికుల్లో నీవంటివాడు ఒక్కడూ లేడు, ఇక మీదట ఉండడు. ౧౩ ఇంకో విషయం, నీవు ఐశ్వర్యాన్ని, ఘనతను ఇమ్మని అడక్కపోయినా నేను వాటిని కూడా నీకిస్తున్నాను. కాబట్టి నీ జీవిత కాలం అంతటిలో రాజుల్లో నీలాంటివాడు ఒక్కడైనా ఉండడు. ౧౪ నీ తండ్రి దావీదు నా మార్గాల్లో నడిచి, నా కట్టడలనూ నా ఆజ్ఞలనూ నెరవేర్చినట్టు నీవు కూడా నడుచుకుంటే నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను” అన్నాడు.
౧౫ అంతలో సొలొమోను మేలుకుని అది కల అని గ్రహించాడు. తరవాత అతడు యెరూషలేముకు వచ్చి యెహోవా నిబంధన ఉన్న మందసం ఎదుట నిలబడి దహనబలులూ సమాధానబలులూ అర్పించి తన సేవకులందరికి విందు చేయించాడు.
౧౬ ఆ తరవాత ఇద్దరు వేశ్యలు రాజు దగ్గరకి వచ్చి అతని ఎదుట నిలబడ్డారు. ౧౭ వారిలో ఒక స్త్రీ ఇలా వేడుకుంది “నా యజమానీ, నేనూ ఈమె ఒకే ఇంట్లో నివసిస్తున్నాం. ఆమెతో బాటు అదే ఇంట్లో నేనొక కొడుకుని కన్నాను. ౧౮ నేను కనిన తరవాత మూడో రోజు ఈమె కూడా ఒక కొడుకుని కన్నది. మేమిద్దరమూ కలిసే ఉన్నాం. మేము తప్ప ఇంట్లో ఇంకెవరూ లేరు. ౧౯ అయితే రాత్రి ఈమె పడకలో తన పిల్లవాడి మీద పడడం వలన ఆమె కొడుకు చనిపోయాడు. ౨౦ కాబట్టి మధ్య రాత్రిలో ఈమె లేచి నీ దాసినైన నేను నిద్రపోతుండగా నా పక్కలో నుండి నా కొడుకుని తీసుకుని తన పక్కలో పెట్టుకుని, చచ్చిన తన పిల్లవాణ్ణి నా పక్కలో ఉంచింది. ౨౧ ఉదయం నేను లేచి నా పిల్లవాడికి పాలివ్వడానికి చూస్తే వాడు చనిపోయి ఉన్నాడు. తరవాత నేను వాడిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే వాడు నా కడుపున పుట్టినవాడు కాడని గ్రహించాను.”
౨౨ అంతలో రెండో స్త్రీ “అలా కాదు, బతికి ఉన్నవాడు నా కొడుకు. చచ్చినవాడు ఆమె కొడుకు” అని చెప్పింది. అప్పుడా మొదటి స్త్రీ “కాదు, చచ్చిన వాడే నీ కొడుకు, బతికి ఉన్నవాడు నా కొడుకు” అంది. ఈ విధంగా వారు రాజు ఎదుట వాదించుకున్నారు.
౨౩ అప్పుడు రాజు “బతికి ఉన్నవాడు నా కొడుకు, చనిపోయిన వాడు నీ కొడుకు అని ఒకామె, కాదు, కాదు చనిపోయిన వాడు నీ కొడుకు, బతికి ఉన్నవాడు నా కొడుకు అని రెండవ ఆమె చెబుతున్నది. ౨౪ కాబట్టి ఒక కత్తి తీసుకు రండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. వారు రాజు దగ్గరికి ఒక కత్తి తెచ్చారు. ౨౫ రాజు “బతికి ఉన్న పిల్లవాణ్ణి రెండు ముక్కలు చేసి సగం ఈమెకూ, సగం ఆమెకూ ఇయ్యండి” అని ఆజ్ఞాపించాడు. ౨౬ ఆ మాటలకు ఆ పిల్లవాడి తల్లి తన బిడ్డ విషయం పేగులు తరుక్కుపోయి, రాజుతో “రాజా, పిల్లవాణ్ణి ఎంతమాత్రం చంపవద్దు, వాణ్ణి ఆమెకే ఇప్పించండి” అని వేడుకుంది. ఆ రెండవ స్త్రీ “ఆ పిల్లవాడు నాకైనా ఆమెకైనా కాకుండా చెరి సగం చేయండి” అంది. ౨౭ అందుకు రాజు “బతికి ఉన్న ఆ బిడ్డను చంపవద్దు. వాడిని ఆ మొదటి స్త్రీకి ఇవ్వండి. ఆమే వాడి తల్లి” అని తీర్పు చెప్పాడు. ౨౮ అప్పుడు ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయం విచారించడంలో రాజు దైవజ్ఞానం పొందిన వాడని గ్రహించి అతనికి భయపడ్డారు.