౧ సొలొమోను 13 సంవత్సరాల పాటు తన రాజ గృహాన్ని కూడా కట్టించి పూర్తి చేశాడు. ౨ అతడు లెబానోను అరణ్య రాజగృహాన్ని కట్టించాడు. దీని పొడవు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. దాన్ని నాలుగు వరసల దేవదారు స్తంభాలతో కట్టారు. ఆ స్తంభాలపై మీద దేవదారు దూలాలు వేశారు.
౩ పక్కగదులు 45 స్తంభాలతో కట్టి పైన దేవదారు కలపతో కప్పారు. ఆ స్తంభాలు ఒక్కో వరసకి 15 చొప్పున మూడు వరుసలు ఉన్నాయి. ౪ మూడు వరుసల కిటికీలు ఉన్నాయి. మూడు వరుసల్లో కిటికీలు ఒక దానికొకటి ఎదురుగా ఉన్నాయి. ౫ తలుపుల, కిటికీల గుమ్మాలు చతురస్రాకారంగా ఉన్నాయి. మూడు వరసల్లో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి.
౬ అతడు స్తంభాలు ఉన్న ఒక మంటపాన్ని కట్టించాడు. దాని పొడవు 50 మూరలు, వెడల్పు 30 మూరలు. వాటి ఎదుట ఒక స్తంభాల ఆధారంగా ఉన్న మంటపం ఉంది. స్తంభాలు, మందమైన దూలాలు వాటి ఎదుట ఉన్నాయి.
౭ తరువాత అతడు తాను న్యాయ విచారణ చేయడానికి ఒక అధికార మంటపాన్ని కట్టించాడు. దాన్ని అడుగు నుండి పైకప్పు వరకూ దేవదారు కర్రతో కప్పారు. ౮ సొలొమోను లోపలి ఆవరణలో తన రాజప్రాసాదాన్ని ఆ విధంగానే కట్టించాడు. తన భార్య అయిన ఫరో కుమార్తెకు ఇదే నమూనాలో మరొక అంతఃపురం కట్టించాడు.
౯ ఈ కట్టడాలన్నీ పునాది నుండి పైకప్పు వరకూ లోపలా బయటా వాటి పరిమాణం ప్రకారం తొలిచి రంపాలతో కోసి చదును చేసిన బహు విలువైన రాళ్లతో నిర్మితమైనాయి. ఈ విధంగానే విశాలమైన ఆవరణం బయటి వైపున కూడా ఉన్నాయి. ౧౦ దాని పునాది పదేసి, ఎనిమిదేసి మూరలు ఉన్న బహు విలువైన, పెద్ద రాళ్లతో కట్టి ఉంది. ౧౧ పై భాగంలో పరిమాణం ప్రకారం చెక్కిన బహు విలువైన రాళ్లు, దేవదారు కర్రలు ఉన్నాయి.
౧౨ ఆవరణానికి చుట్టూ మూడు వరుసల చెక్కిన రాళ్లు, ఒక వరుస దేవదారు దూలాలు ఉన్నాయి. యెహోవా మందిరంలోని ఆవరణం కట్టిన విధంగానే ఆ మందిరం మంటపం కూడా కట్టారు.
౧౩ సొలొమోను రాజు తూరు పట్టణం నుండి హీరామును పిలిపించాడు. ౧౪ ఇతడు నఫ్తాలి గోత్రానికి చెందిన విధవరాలి కొడుకు. ఇతని తండ్రి తూరు పట్టణానికి చెందిన ఇత్తడి పనివాడు. ఈ హీరాము గొప్ప నైపుణ్యం, జ్ఞానం గలవాడు, ఇత్తడితో చేసే పనులన్నిటిలో బాగా ఆరితేరిన వాడు, అనుభవజ్ఞుడు. అతడు సొలొమోను దగ్గరికి వచ్చి అతని పని అంతా చేశాడు.
౧౫ ఎలాగంటే, అతడు రెండు ఇత్తడి స్తంభాలు పోత పోశాడు. ఒక్కొక్క స్తంభం 18 మూరల పొడవు, 12 మూరల చుట్టుకొలత ఉంది. ౧౬ స్తంభాల మీద ఉంచడానికి ఇత్తడితో రెండు పీటలు పోత పోశాడు. ఒక్కొక్క పీట ఎత్తు 5 మూరలు. ౧౭ స్తంభాల మీద ఉన్న పీటలకి అల్లిన గొలుసులతో వలల వంటి వాటిని చేసారు. గొలుసు పని దండలు పోత పోసి ఉంది. అవి ఒక్కో పీటకి ఏడేసి ఉన్నాయి.
౧౮ ఈ విధంగా అతడు స్తంభాలు చేసి వాటి పైని పీటలను కప్పడానికి చుట్టూ అల్లిక పని రెండు వరసలు దానిమ్మ పండ్లతో చేశాడు. రెండు పీటలకీ అతడు అదే విధంగా చేశాడు. ౧౯ స్తంభాల మీది పీటలపై 4 మూరల వరకూ తామర పూవుల్లాంటి ఆకృతులు ఉన్నాయి. ౨౦ ఆ రెండు స్తంభాల మీద ఉన్న పీటలమీది అల్లిక పని దగ్గర ఉన్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లు ఉన్నాయి. రెండు వందల దానిమ్మ పండ్లు ఆ పీట చుట్టూ వరుసలుగా ఉన్నాయి.
౨౧ ఈ స్తంభాలను అతడు పరిశుద్ధ స్థలం మంటపంలో నిలబెట్టాడు. కుడి పక్కన ఉన్న స్తంభానికి “యాకీను” అని పేరు పెట్టాడు. ఎడమ పక్కన ఉన్న స్తంభానికి “బోయజు” అని పేరు పెట్టాడు. ౨౨ ఈ స్తంభాల మీద తామర పూవుల్లాంటి చెక్కడం పని ఉంది. ఈ విధంగా స్తంభాల పని పూర్తి అయ్యింది.
౨౩ హీరాము పోత పనితో ఒక గుండ్రని సరస్సు తొట్టిని చేశాడు. అది ఈ చివరి పై అంచు నుండి ఆ చివరి పై అంచు దాకా 10 మూరలు. దాని ఎత్తు 5 మూరలు, చుట్టుకొలత 30 మూరలు. ౨౪ దాని పై అంచుకు కింద, చుట్టూ గుబ్బలున్నాయి. మూరకు 10 గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సరస్సు చుట్టూ ఆవరించి ఉన్నాయి. ఆ సరస్సును పోత పోసినప్పుడు ఆ గుబ్బలను రెండు వరసలుగా పోత పోశారు.
౨౫ ఆ సరస్సు 12 ఎద్దుల ఆకారాల మీద నిలబడి ఉంది. వీటిలో మూడు ఉత్తర దిక్కుకూ మూడు పడమర దిక్కుకూ మూడు దక్షిణ దిక్కుకూ మూడు తూర్పు దిక్కుకూ చూస్తున్నాయి. వీటి మీద ఆ సరస్సు నిలబెట్టి ఉంది. ఎద్దుల వెనక భాగాలన్నీ లోపలి వైపుకు ఉన్నాయి. ౨౬ సరస్సు మందం బెత్తెడు. దాని పై అంచుకు పాత్రకు పై అంచులాగా తామర పూవుల్లాంటి పోత పని ఉంది. అందులో సుమారు 44 కిలో లీటర్లు నీరు పడుతుంది.
౨౭ హీరాము 10 ఇత్తడి స్తంభాలు చేశాడు. ఒక్కొక్క స్తంభం 4 మూరల పొడవు, 4 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు ఉన్నాయి. ౨౮ ఈ స్తంభాలు ఏ విధంగా చేశారంటే, వాటికి పార్శ్వాల్లో పలకలు ఉన్నాయి. ఆ పక్క పలకలు చట్రాల మధ్య అమర్చారు. ౨౯ చట్రాల మధ్యలో ఉన్న పక్క పలకల మీదా చట్రాల మీదా సింహాల, ఎద్దుల, కెరూబుల రూపాలు ఉన్నాయి. సింహాల కిందా ఎద్దుల కిందా వేలాడుతున్న పూదండలు ఉన్నాయి.
౩౦ ప్రతి స్తంభానికీ నాలుగేసి ఇత్తడి చక్రాలు, ఇత్తడి ఇరుసులు ఉన్నాయి. ప్రతిపీఠం నాలుగు మూలల్లో దిమ్మలు ఉన్నాయి. ఈ దిమ్మలను తొట్టి కింద అతికిన ప్రతి స్థలం దగ్గరా పోత పోశారు. ౩౧ పీఠం పైన దాని మూతి ఉంది. దాని వెడల్పు మూరెడు. అయితే మూతి కింద స్తంభం గుండ్రంగా ఉండి మూరన్నర వెడల్పు ఉంది. ఆ మూతి మీద పక్కలు గల చెక్కిన పనులు ఉన్నాయి. ఇవి గుండ్రంగా గాక చదరంగా ఉన్నాయి. ౩౨ పక్క పలకల కింద 4 చక్రాలు ఉన్నాయి. చక్రాల ఇరుసులు స్తంభాలతో అతికించి ఉన్నాయి. ఒక్కొక్క చక్రం మూరన్నర వెడల్పు ఉన్నాయి.
౩౩ ఈ చక్రాల పని రథ చక్రాల పనిలాగా ఉంది. వాటి ఇరుసులూ అంచులూ అడ్డకర్రలూ నడిమి భాగాలూ పోత పనితో చేశారు. ౩౪ ప్రతి స్తంభం నాలుగు మూలల్లో నాలుగు దిమ్మలు ఉన్నాయి. ఈ దిమ్మలూ స్తంభమూ కలిపే పోత పోశారు. ౩౫ పీఠం పైన చుట్టూ జానెడు ఎత్తు ఉన్న గుండ్రని బొద్దు ఉంది. పీఠం పైన ఉన్న మోతలూ పక్క పలకలూ దానితో కలిసిపోయి ఉన్నాయి. ౩౬ దాని మోతల పలకల మీదా దాని పక్క పలకల మీదా, హీరాము కెరూబులనూ సింహాలనూ తమాల వృక్షాలనూ ఒక్కొక్కదాని చోటును బట్టి చుట్టూ దండలతో వాటిని చెక్కాడు. ౩౭ ఈ విధంగా అతడు పదింటిని చేశాడు. అన్నిటి పోత, పరిమాణం, రూపం ఒకేలా ఉన్నాయి.
౩౮ తరువాత అతడు 10 ఇత్తడి తొట్టెలు చేశాడు. ప్రతి తొట్టి 880 లీటర్లు నీరు పడుతుంది. ఒక్కొక్క తొట్టి వైశాల్యం 4 మూరలు. ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క తొట్టి ఉంచాడు. ౩౯ మందిరం కుడి పక్కన 5 స్తంభాలు, ఎడమ పక్కన 5 స్థంభాలు ఉంచాడు. సరస్సు దేవాలయానికి కుడి వైపు ఆగ్నేయ దిశగా మందిరం కుడి పక్కన ఉంచాడు. ౪౦ హీరాము తొట్లనూ చేటలనూ గిన్నెలనూ చేశాడు. ఈ విధంగా హీరాము సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం యెహోవా మందిరం పని అంతా పూర్తి చేశాడు.
౪౧ రెండు స్తంభాలు, ఆ రెండు స్తంభాల మీద ఉన్న పైపీటల పళ్ళేలు, వాటిని కప్పిన రెండు అల్లికలు ఉన్నాయి. ౪౨ ఆ స్తంభాల మీద ఉన్న పై పీటల రెండు పళ్ళాలను, కప్పిన అల్లిక ఒకదానికి రెండు వరసలతో రెండు అల్లికలకు 400 దానిమ్మపండ్లనూ ౪౩ 10 స్తంభాలనూ స్తంభాల మీద 10 తొట్లనూ ౪౪ ఒక సరస్సును, సరస్సు కింద 12 ఎద్దులూ, ౪౫ బిందెలూ, చేటలూ, గిన్నెలూ వీటినన్నిటినీ సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం హీరాము యెహోవా మందిరానికి చేశాడు. ఈ వస్తువులన్నీ మెరుగు పెట్టిన ఇత్తడితో చేసారు.
౪౬ యొర్దాను మైదానంలో సుక్కోతు, సారెతానుల మధ్య ఉన్న బంక మట్టి నేలలో రాజు వాటిని పోత పోయించాడు. ౪౭ అయితే ఈ వస్తువులు చాలా ఎక్కువగా ఉండడం వలన సొలొమోను వాటి బరువు తూయడం మానేశాడు. ఇత్తడి బరువు ఎంతో తెలుసుకోడానికి వీల్లేకుండా పోయింది.
౪౮ సొలొమోను యెహోవా మందిరానికి చెందిన ఇతర సామగ్రిని కూడా చేయించాడు. అవేవంటే, బంగారు బలిపీఠం, సముఖపు రొట్టెలను ఉంచే బంగారు బల్లలు, ౪౯ గర్భాలయం ఎదుట కుడి పక్కన 5, ఎడమ పక్కన 5, మొత్తం పది బంగారు దీపస్తంభాలు, బంగారు పుష్పాలు, ప్రమిదెలు, పట్టుకారులు. ౫౦ అలాగే మేలిమి బంగారు పాత్రలు, కత్తెరలు, గిన్నెలు, ధూపకలశాలు, లోపలి మందిరం అనే అతి పరిశుద్ధ స్థలం తలుపులు, ఆలయం హాలు తలుపులు, వాటి బంగారు బందులు, వీటన్నిటినీ చేయించాడు.
౫౧ ఈ విధంగా సొలొమోను రాజు యెహోవా మందిరానికి చేసిన పని అంతా పూర్తి అయ్యింది. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారాన్ని, సామగ్రిని తెప్పించి యెహోవా మందిరం ఖజానాలో ఉంచాడు.