౧౨
౧ రెహబాముకు పట్టాభిషేకం చేయడానికి ఇశ్రాయేలీయులంతా షెకెముకు రాగా రెహబాము షెకెము వెళ్ళాడు. ౨ నెబాతు కొడుకు యరొబాము, సొలొమోను రాజు దగ్గర నుండి పారిపోయి ఐగుప్తులో నివసిస్తున్నాడు. యరొబాము ఐగుప్తులోనే ఉండి రెహబాము పట్టాభిషేకం సంగతి విన్నాడు. ౩ ప్రజలు అతనికి కబురంపి పిలిపించారు. యరొబాము, ఇశ్రాయేలీయుల సమాజమంతా వచ్చి రెహబాముతో ఇలా మనవి చేశారు. ౪  “మీ నాన్న బరువైన కాడిని మా మీద ఉంచాడు. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యాన్ని, మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు తేలిక చేస్తే మేము నీకు సేవ చేస్తాం.”
౫ అందుకు రాజు “మీరు వెళ్లి మూడు రోజులైన తరువాత నా దగ్గరికి మళ్ళీ రండి” అని చెప్పగా ప్రజలు వెళ్లిపోయారు. ౬ అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను బతికి ఉన్నప్పుడు అతని దగ్గర సేవ చేసిన పెద్దలను సంప్రదించి “ఈ ప్రజలకు ఏం జవాబు చెప్పాలి?” అని వారిని అడిగాడు. ౭ వారు “ఈ దినాన నీవు ఈ ప్రజలకు సేవచేయ గోరితే వారికి మృదువైన మాటలతో వారికి జవాబిస్తే వాళ్ళు ఎప్పటికీ నీకు సేవకులుగా ఉంటారు” అన్నారు.
౮ అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన సలహా పక్కనబెట్టి, తనతో కూడ పెరిగిన తన పరివారంలోని యువకులను పిలిచి సలహా అడిగాడు. అతడు వారిని ౯  “మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని తేలిక చేయమని నాతో చెప్పుకున్న ఈ ప్రజలకు ఏమని జవాబు చెప్పాలి? మీరిచ్చే సలహా ఏంటి?” అని ప్రశ్నించాడు. ౧౦ అప్పుడు అతనితో బాటు పెరిగిన ఆ యువకులు అతనితో అన్నారు. “నీ తండ్రి మా కాడిని భారం చేసాడు గాని నీవు దాన్ని తేలిక చేయాలని నీతో చెప్పుకున్న ఈ ప్రజలకు ఇలా చెప్పు. మా నాన్న నడుం కంటే నా చిటికెన వేలు పెద్దది. ౧౧ మా నాన్న భారమైన కాడిని పెట్టాడు కానీ నేను ఆ కాడిని ఇంకా భారం చేస్తాను. మా నాన్న చెర్నాకోలలతో మిమ్మల్ని శిక్షించాడు కానీ నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను.”
౧౨  “మూడో రోజు నా దగ్గరికి రండి” అని రాజు చెప్పినట్టు యరొబాము, ప్రజలంతా మూడో రోజు రెహబాము దగ్గరికి వచ్చారు. ౧౩ అప్పుడు రాజు పెద్దలు చెప్పిన సలహా పక్కనబెట్టి, యువకులు చెప్పిన సలహా ప్రకారం వారికి కఠినంగా జవాబిచ్చి ఇలా ఆజ్ఞాపించాడు. ౧౪  “మా నాన్న మీ కాడిని భారం చేశాడు గాని నేను మీ దాన్ని మరింత భారంగా చేస్తాను. మా నాన్న చెర్నాకోలలతో మిమ్మల్ని శిక్షించాడు కానీ నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను.”
౧౫ ప్రజలు చేసిన మనవిని రాజు వినిపించుకోలేదు. షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కొడుకు యరొబాముతో తాను పలికించిన మాట నెరవేరాలని యెహోవా ఇలా జరిగించాడు. ౧౬ కాబట్టి ఇశ్రాయేలు వారంతా రాజు తమ విన్నపం వినలేదని తెలుసుకుని రాజుకిలా బదులిచ్చారు:
“దావీదు వంశంతో మాకేం సంబంధం?
యెష్షయి కొడుకుతో మాకు వారసత్వం ఏముంది?
ఇశ్రాయేలు ప్రజలారా, మీ మీ గుడారాలకు వెళ్ళండి.
దావీదు వంశమా, నీ వంశం సంగతి నువ్వే చూసుకో.”
ఇలా చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారాలకు వెళ్లిపోయారు. ౧౭ అయితే యూదా పట్ణణాల్లో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబాము పాలించాడు.
౧౮ తరువాత రెహబాము రాజు వెట్టిపనివారి మీద అధికారి అదోరామును ఇశ్రాయేలు వారి దగ్గరికి పంపాడు. ఇశ్రాయేలు వారంతా అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. రెహబాము రాజు తన రథం మీద వెంటనే యెరూషలేము పారిపోయాడు. ౧౯ ఈ విధంగా ఇశ్రాయేలువారు ఇప్పటికీ దావీదు వంశం మీద తిరగబడుతూనే ఉన్నారు.
౨౦ యరొబాము తిరిగి వచ్చాడని ఇశ్రాయేలు వారంతా విని, సమాజంగా కూడి, అతన్ని పిలిపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేశారు. యూదా గోత్రం వాళ్ళు తప్ప దావీదు సంతానాన్ని వెంబడించిన వారెవరూ లేకపోయారు. ౨౧ రెహబాము యెరూషలేము చేరుకున్న తరువాత ఇశ్రాయేలు వారితో యుద్ధం చేశాడు. రాజ్యం సొలొమోను కొడుకు రెహబాము అనే తనకు మళ్ళీ వచ్చేలా చేయడానికి అతడు యూదా వారందరిలో నుండి, బెన్యామీను గోత్రికుల్లోనుండి యుద్ధ ప్రవీణులైన 1,80,000 మందిని సమకూర్చాడు.
౨౨ కానీ దేవుడు షెమయా ప్రవక్తతో ఇలా చెప్పాడు. ౨౩  “నీవు సొలొమోను కొడుకు, యూదా రాజు అయిన రెహబాముతో, యూదా గోత్రం వారితో బెన్యామీనీయులందరితో, మిగిలిన ప్రజలందరితో ఇలా చెప్పు, ౨౪ యెహోవా చెప్పేదేమిటంటే, జరిగినది నేనే జరిగించాను. మీరు ఇశ్రాయేలు ప్రజలైన మీ సోదరులతో యుద్ధం చేయడానికి వెళ్లకుండా అందరూ మీ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపొండి.” కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి, యుద్ధానికి వెళ్ళకుండా ఆగిపోయారు.
౨౫ తరువాత యరొబాము ఎఫ్రాయిము కొండప్రాంతంలో షెకెము అనే పట్టణాన్ని కట్టించుకుని అక్కడ నివసించాడు. అక్కడ నుంచి వెళ్లి పెనూయేలును కట్టించాడు. ౨౬ యరొబాము ఇలా అనుకున్నాడు. “ఈ ప్రజలు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరంలో బలులు అర్పించడానికి ఎక్కి వెళ్తే వారి హృదయం యూదారాజు రెహబాము అనే తమ యజమాని వైపుకు తిరుగుతుంది. ౨౭ అప్పుడు వారు నన్ను చంపి మళ్ళీ యూదా రాజు రెహబాము పక్షం చేరతారు. రాజ్యం మళ్ళీ దావీదు సంతానం వారిది అవుతుంది” ౨౮ యరొబాము తన హృదయంలో ఇలా ఆలోచన చేసి రెండు బంగారు దూడలు చేయించాడు. అతడు ప్రజలను పిలిచి “యెరూషలేము వెళ్ళడం మీకు చాలా కష్టం. ౨౯ ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తు దేశంలోనుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుళ్ళు ఇవే” అని చెప్పి, ఆ దూడల్లో ఒకటి బేతేలులో, మరొకటి దానులో ఉంచాడు. ౩౦ కాబట్టి ఈ పని దోషం అయింది. ఈ రెంటిలో ఒకదాన్ని పూజించడానికి ప్రజలు దాను వరకూ వెళ్ళసాగారు. ౩౧ అతడు ఉన్నత స్థలాల్లో మందిరాలను ఏర్పరచాడు. లేవీయులు కాని సాధారణమైన వారు కొందరిని యాజకులుగా నియమించాడు.
౩౨ యరొబాము యూదా దేశంలో జరిగే మహోత్సవం లాంటి ఉత్సవాన్ని ఎనిమిదవ నెల పదిహేనవ రోజున జరపడానికి నిర్ణయించి, బలిపీఠం మీద బలులు అర్పిస్తూ వచ్చాడు. ఈ విధంగా బేతేలులో కూడా తాను చేయించిన దూడలకు బలులు అర్పిస్తూ వచ్చాడు. తాను చేయించిన ఉన్నత స్థలాలకు యాజకులను బేతేలులో ఉంచాడు. ౩౩ ఈ విధంగా తన మనస్సులో అనుకున్న దాన్ని బట్టి అతడు ఎనిమిదవ నెల, పదిహేనవ రోజు బేతేలులో తాను చేయించిన బలిపీఠం సమీపించాడు. ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవాన్ని నిర్ణయించి, ధూపం వేయడానికి తానే బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు.