౧౫
౧ నెబాతు కొడుకు యరొబాము రాజు పరిపాలన 18 వ సంవత్సరంలో అబీయా యూదాను పాలించడం మొదలెట్టాడు. ౨ అతడు యెరూషలేములో మూడేళ్ళు రాజుగా ఉన్నాడు. అతని తల్లి పేరు మయకా. ఆమె అబీషాలోము కూతురు. ౩ అతడు గతంలో తన తండ్రి చేసిన దుర్మార్గాలన్నిటినీ చేశాడు. తన పూర్వీకుడైన దావీదు హృదయం తన దేవుడు యెహోవా పట్ల యథార్ధంగా ఉన్నట్టుగా అతని హృదయం యథార్ధంగా లేదు.
౪ దావీదు హిత్తీయుడైన ఊరియా విషయంలో తప్ప తన జీవితమంతా యెహోవా దృష్టికి యథార్ధంగా నడుచుకొంటూ యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో ఏ విషయంలోనూ తప్పిపోలేదు. ౫ అందుకే దావీదు కోసం అతని తరువాత అతని సంతానం వాణ్ణి నిలపడానికీ యెరూషలేమును స్థిరపరచడానికీ అతని దేవుడు యెహోవా యెరూషలేములో ఒక దీపంగా అతనిని ఉంచాడు. ౬ రెహబాము బతికిన రోజులన్నీ అతనికీ యరొబాముకూ యుద్ధం జరుగుతూ ఉండేది. ౭ అబీయా యరొబాముల మధ్య కూడా యుద్ధం జరుగుతూ ఉండేది. అబీయా గురించిన మిగతా విషయాలు, అతడు చేసిన వాటన్నిటిని గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. ౮ అబీయా చనిపోగా తన పూర్వీకులతో పాటు దావీదు పట్టణంలో అతన్ని సమాధిచేశారు. అతని కొడుకు ఆసా అతనికి బదులు రాజయ్యాడు.
౯ ఇశ్రాయేలు రాజు యరొబాము పాలన 25 వ సంవత్సరంలో ఆసా యూదా వారిని పరిపాలించడం మొదలెట్టాడు. ౧౦ అతడు 40 ఏళ్ళు యెరూషలేములో పాలించాడు. అతని అవ్వ పేరు మయకా, ఈమె అబీషాలోము కూతురు. ౧౧ ఆసా తన పూర్వీకుడైన దావీదులాగా యెహోవా దృష్టికి యథార్ధంగా నడుచుకుని ౧౨ మగ వ్యభిచారులను దేశంలోనుండి వెళ్లగొట్టి తన పూర్వీకులు చేయించిన విగ్రహాలన్నిటినీ పడగొట్టాడు. ౧౩ తన అవ్వ మయకా అసహ్యమైన ఒక అషేరా దేవతాస్తంభాన్ని చేయిస్తే ఆసా ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేసి, కిద్రోను లోయ పక్కన దాన్ని కాల్చివేశాడు. పట్టపు రాణి పదవి నుండి ఆమెను తొలగించాడు.
౧౪ ఆసా తన జీవితమంతా హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించాడు గాని ఉన్నత స్థలాలను తీసి వేయలేదు. ౧౫ అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులనూ తాను ప్రతిష్ఠించిన వస్తువులనూ వెండి బంగారాన్నీ యెహోవా మందిరంలోకి తెప్పించాడు. ౧౬ ఆసాకు, ఇశ్రాయేలు రాజు బయెషాకు వారు బతికిన రోజులన్నీ యుద్ధం జరుగుతూ ఉండేది.
౧౭ ఇశ్రాయేలు రాజు బయెషా యూదా వారికి విరోధిగా ఉండి, యూదా రాజు ఆసా దగ్గరనుండి ఎవరూ రాకుండా అతని దగ్గరికి ఎవరూ పోకుండా రమా పట్టణాన్ని కట్టించాడు. ౧౮ కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోనూ రాజభవనపు ఖజానాలోనూ మిగిలిన వెండి బంగారమంతా తీసి తన సేవకులకు ఇచ్చి, దమస్కులో నివసిస్తున్న సిరియా రాజు బెన్హదదుకు పంపించాడు. బెన్హదదు హెజ్యోనుకు పుట్టిన టబ్రిమ్మోను కొడుకు. ఆసా ఇలా మనవి చేశాడు. ౧౯  “మీ నాన్నకూ మా నాన్నకూ ఒప్పందం ఉన్నట్టుగా నీకూ నాకూ ఒప్పందం ఉండాలి. వెండి బంగారాలను నీకు కానుకగా పంపిస్తున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజు బయెషా నా దగ్గర నుండి వెళ్ళిపోయేలా అతనితో నీకున్న పొత్తు రద్దు చేసుకో.”
౨౦ కాబట్టి బెన్హదదు ఆసా రాజు చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపి, ఈయోను, దాను, ఆబేల్బేత్మయకా, కిన్నెరెతు ప్రాంతాలనూ నఫ్తాలి దేశాన్నీ కొల్లగొట్టాడు. ౨౧ బయెషాకు అది తెలిసి, రమా పట్టణం కట్టడం మాని తిర్సాకు వెళ్లి అక్కడే నివసించాడు. ౨౨ అప్పుడు ఆసా రాజు ఎవరినీ మినహాయించకుండా యూదా దేశం వారంతా రావాలని ప్రకటన చేశాడు. వారు సమకూడి వచ్చి బయెషా కట్టిస్తున్న రమా పట్టణం రాళ్లనూ కర్రలనూ ప్రజలు తీసుకొచ్చేశారు. ఆసా రాజు వాటిని బెన్యామీను ప్రాంతంలో గెబ, మిస్పా కట్టించడానికి ఉపయోగించాడు.
౨౩ ఆసా గురించిన మిగతా విషయాలు, అతని బలప్రభావాలూ అతడు చేసినదంతా అతడు కట్టించిన పట్టణాలను గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి వుంది. ముసలితనంలో అతని పాదాలకు జబ్బు చేసింది. ౨౪ అప్పుడు ఆసా చనిపోయాడు. అతనిని దావీదు పట్టణంలో తన పూర్వీకుల సమాధిలో పాతిపెట్టారు. అతనికి బదులు అతని కొడుకు యెహోషాపాతు రాజయ్యాడు.
౨౫ యూదారాజు ఆసా పరిపాలన రెండో ఏట యరొబాము కొడుకు నాదాబు పరిపాలించడం మొదలుపెట్టి ఇశ్రాయేలు వారిని రెండేళ్ళు పాలించాడు. ౨౬ అతడు యెహోవా దృష్టికి కీడుచేసి తన తండ్రి నడిచిన దారిలో నడిచి, తన తండ్రి దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమయ్యాడో ఆ పాపాన్ని అనుసరించి ప్రవర్తించాడు.
౨౭ ఇశ్శాఖారు గోత్రీకుడూ అహీయా కొడుకు బయెషా నాదాబుపై కుట్ర చేశాడు. నాదాబు, ఇశ్రాయేలు వారంతా ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోనును ముట్టడిస్తూ ఉన్న సమయంలో గిబ్బెతోనులో బయెషా అతన్ని చంపాడు. ౨౮ రాజైన ఆసా పాలన మూడో ఏట బయెషా అతన్ని చంపి అతనికి బదులు రాజయ్యాడు. ౨౯ తాను రాజు కాగానే అతడు యరొబాము వంశం వారందరినీ చంపేశాడు. యరొబాము వంశంలో ప్రాణంతో ఉన్న ఎవర్నీ వదిలి పెట్టకుండా అందరినీ చంపేశాడు. తన సేవకుడు షిలోనీయుడైన అహీయా ద్వారా యెహోవా చెప్పినట్టు ఇది జరిగింది. ౩౦ యరొబాము చేసిన పాపాలను బట్టి, ఇశ్రాయేలువారు పాపం చేయడానికి అతడు కారణమైనందుకు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కోపం రేపినందుకు ఇలా జరిగింది.
౩౧ నాదాబు గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి. ౩౨ వారు బతికినంత కాలం, ఆసాకూ ఇశ్రాయేలు రాజు బయెషాకూ మధ్య యుద్ధం జరుగుతూ ఉండేది. ౩౩ యూదారాజు ఆసా పాలన మూడో ఏట అహీయా కొడుకు బయెషా తిర్సా పట్టణంలో ఇశ్రాయేలు వారందరినీ పాలించడం మొదలుపెట్టి 24 ఏళ్ళు పాలించాడు. ౩౪ ఇతడు కూడాయెహోవా దృష్టికి చెడుగా నడుచుకుని యరొబాము ఎలా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమయ్యాడో దానంతటినీ అనుసరించి ప్రవర్తించాడు.