౩౧
౧ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను ఎదుర్కోలేక పారిపోయారు. ఫిలిష్తీయులు వారిని గిల్బోవ కొండ వరకూ వెంటాడి హతం చేస్తూ, ౨ సౌలును అతని కొడుకులనూ తరిమి యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అనే సౌలు ముగ్గురు కొడుకులను చంపేశారు.
౩ యుద్ధంలో సౌలు ఓడిపోతున్నప్పుడు విలుకాళ్ళు గురి చూసి బాణాలతో అతణ్ణి కొట్టారు. అతడు భయపడి, ౪  “సున్నతి లేని వీరు వచ్చి నన్ను చంపి ఎగతాళి చేయకుండా నీ కత్తితో నన్ను పొడువు” అని తన ఆయుధాలు మోసేవాడితో చెబితే, అతడు భయపడి అలా చేయడానికి వెనుకాడాడు. సౌలు తన కత్తి నిలబెట్టి దానిమీద బలంగా ఒరిగాడు. ౫ సౌలు చనిపోయాడని అతని ఆయుధాలు మోసేవాడు కూడా తన కత్తిమీద పడి సౌలుతోపాటు చనిపోయాడు.
౬ ఈ విధంగా సౌలు, అతని ముగ్గురు కొడుకులు, సౌలు ఆయుధాలు మోసేవాడు, సౌలు మనుషులంతా ఒకే రోజున చనిపోయారు.
౭ లోయ అవతల ఉన్న ఇశ్రాయేలీయులు, యొర్దాను అవతల ఉన్నవారు, ఇశ్రాయేలీయులు పారిపోవడం, సౌలు, అతని కొడుకులు చనిపోయి ఉండడం చూసి తాము కాపురం ఉంటున్న ఊళ్ళు విడిచిపెట్టి పారిపోయారు. ఫిలిష్తీయులు వచ్చి వాటిలో నివసించారు.
౮ తరువాతి రోజు ఫిలిష్తీయులు చనిపోయిన వారిని దోచుకోవడానికి వచ్చి గిల్బోవ కొండమీద పడిఉన్న సౌలును, అతని ముగ్గురు కొడుకులను చూసి, ౯ అతని తల నరికి అతని ఆయుధాలు తీసుకు తమ విగ్రహాల గుళ్లలో, ప్రజల్లో ఈ విజయ వార్త తెలియజేయడానికి ఫిలిష్తీయ దేశంలో నాలుగు దిక్కులకూ మనుషులను పంపారు.
౧౦ వారు సౌలు ఆయుధాలను అష్తారోతు దేవి గుడిలో ఉంచారు. అతని శవాన్ని బేత్షాను పట్టణపు గోడకు తగిలించారు.
౧౧ ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త విన్న యాబేష్గిలాదులోని ౧౨ బలిష్టులందరు రాత్రి అంతా నడిచి సౌలు మృతదేహాన్ని, అతని కొడుకుల మృతదేహాలను బేత్షాను పట్టణం గోడ మీద నుంచి దించి యాబేషుకు తీసుకువచ్చి దహనం చేశారు. ౧౩ ఎముకలను వేరుచేసి యాబేషులోని కర్పూర తైల వృక్షంకింద పాతిపెట్టి ఏడు రోజులపాటు ఉపవాసం ఉన్నారు.