౨౫
౧ సిద్కియా పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో పదో నెల, పదో రోజు బబులోను రాజు నెబుకద్నెజరు, అతని సైన్యం, యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా శిబిరాల్లో నివాసం చేసి, దాని చుట్టూ ముట్టడి దిబ్బలు కట్టారు. ౨ ఈ విధంగా సిద్కియా రాజు పరిపాలనలో 11 వ సంవత్సరం వరకూ పట్టణం ముట్టడిలో ఉన్నప్పుడు, ౩ నాలుగో నెల తొమ్మిదో రోజున పట్టణంలో ఘోరమైన కరువు వచ్చింది. దేశ ప్రజలకు ఆహారం లేదు.
౪ కల్దీయులు పట్టణ ప్రాకారాన్ని పడగొట్టినప్పుడు, సైనికులు రాత్రిపూట రాజు తోట దగ్గర రెండు గోడల మధ్యలో ఉన్న ద్వారం మార్గంలో పారిపోయారు. ౫ అయితే కల్దీయులు పట్టణం చుట్టూ ఉన్నారు. రాజు మైదానానికి వెళ్ళే మార్గంలో వెళ్లిపోయాడు. కల్దీయుల సైన్యం రాజును తరిమి, అతని సైన్యం అతనికి దూరంగా చెదరిపోయిన కారణంగా యెరికో మైదానంలో అతన్ని పట్టుకున్నారు.
౬ వారు రాజును పట్టుకుని రిబ్లా పట్టణంలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తీసుకుపోయారు. రాజు అతనికి శిక్ష విధించాడు. ౭ సిద్కియా చూస్తూ ఉండగానే వారు అతని కొడుకులను చంపి, సిద్కియా కళ్ళు పీకి, ఇత్తడి సంకెళ్లతో అతన్ని బంధించి బబులోను పట్టణానికి తీసుకుపోయారు.
౮ ఇంకా బబులోను రాజు నెబుకద్నెజరు పరిపాలనలో 19 వ సంవత్సరంలో ఐదో నెల ఏడో రోజున రాజ దేహసంరక్షకుల అధిపతీ, బబులోనురాజు సేవకుడూ అయిన నెబూజరదాను యెరూషలేముకు వచ్చి ౯ యెహోవా మందిరాన్నీ, రాజనగరునూ, యెరూషలేములో ఉన్న ఇళ్ళన్నీ, గొప్పవాళ్ళ ఇళ్ళన్నీ అగ్నితో తగల బెట్టించాడు. ౧౦ ఇంకా నెబూజరదాను దగ్గరున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలు పడగొట్టారు.
౧౧ పట్టణంలో మిగిలి ఉన్న వాళ్ళనూ, బబులోనురాజు పక్షం చేరిన వాళ్ళనూ, సామాన్య ప్రజల్లో మిగిలిన వాళ్ళనూ నెబూజరదాను బందీలుగా తీసుకెళ్ళాడు గాని, ౧౨ పొలాల్లో, ద్రాక్షతోటల్లో పనిచెయ్యడానికి అందరికన్నా పేదవాళ్లను అక్కడే ఉంచాడు.
౧౩ ఇంకా యెహోవా మందిరంలో ఉన్న ఇత్తడి స్తంభాలను, పీటలను, యెహోవా మందిరంలో ఉన్న ఇత్తడి సరస్సును, కల్దీయులు ముక్కలుగా కొట్టి, ఆ ఇత్తడిని బబులోను పట్టణానికి తీసుకెళ్ళిపోయారు. ౧౪ సేవ కోసం ఉంచిన పాత్రలు, పారలు, గరిటెలు, దీపాలు ఆర్పే వస్తువులు, ఇతర ఇత్తడి ఉపకారణాలన్నీ వారు తీసుకుపోయారు. ౧౫ అగ్నిపాత్రలు, గిన్నెలు, మొదలైన వెండి వస్తువులనూ, బంగారు వస్తువులనూ నెబూజరదాను తీసుకెళ్ళిపోయారు.
౧౬ ఇంకా అతడు యెహోవా మందిరానికి సొలొమోను చేయించిన రెండు స్తంభాలనూ, సముద్రాన్నీ, పీటలనూ తీసుకెళ్లిపోయాడు. ఈ ఇత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించి ఉంది. ౧౭ ఒక్కొక స్తంభం ఎత్తు 18 మూరలు. దాని పైపీట ఇత్తడిది, పైపీట ఎత్తు మూడు మూరలు. ఇంకా ఆ పైపీట చుట్టూ ఉన్న అల్లికలూ, దానిమ్మ పళ్ళూ ఇత్తడివి. రెండో స్తంభం కూడా మొదటి దాని లాంటిదే.
౧౮ నెబూజరదాను ప్రధానయాజకుడు శెరాయానూ, రెండో యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు ద్వార పాలకులనూ పట్టుకున్నాడు. ౧౯ ఇంకా, సైన్యం మీద అధికారిగా ఉన్న వాణ్ణి, పట్టణంలో ఇంకా ఉంటూ రాజుకు సలహాలు ఇచ్చే ఐదుగురినీ, అతడు పట్టుకున్నాడు. రాజు అధికారుల్లో సైన్యాన్ని నియమించే అధికారినీ, ఆ పట్టణంలో ఉన్న ప్రముఖులైన 60 మందినీ బందీలుగా పట్టుకున్నాడు.
౨౦ నెబూజరదాను వీళ్ళను రిబ్లా పట్టణంలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తెచ్చాడు. ౨౧ బబులోను రాజు హమాతు దేశంలో ఉన్న రిబ్లా పట్టణంలో వాళ్ళను చంపించాడు. ఈ విధంగా శత్రువులు యూదా వాళ్ళను వారి దేశంలోనుంచి తీసుకెళ్ళిపోయారు.
౨౨ బబులోను రాజు నెబుకద్నెజరు యూదాదేశంలో ఉండనిచ్చిన వాళ్ళమీద అతడు షాఫానుకు పుట్టిన అహీకాము కొడుకు గెదల్యాను అధిపతిగా నిర్ణయించాడు. ౨౩ యూదావాళ్ళ సైన్యాధిపతులందరూ, వాళ్ళ ప్రజలందరూ బబులోనురాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విన్నారు. మిస్పా పట్టణంలో ఉన్న గెదల్యా దగ్గరికి నెతన్యా కొడుకు ఇష్మాయేలు, కారేహ కొడుకు యోహానాను, నెటోపాతీయుడు తన్హుమెతు కొడుకు శెరాయా, ఒక మాయకాతీయునికి పుట్టిన యజన్యా అందరూ కలిసి వచ్చారు.
౨౪ గెదల్యా వాళ్ళతో, వాళ్ళ ప్రజలతో ప్రమాణం చేసి “కల్దీయులకు మనం దాసులం అయ్యామని భయపడొద్దు. దేశంలో నివాసం ఉండి, బబులోను రాజును మీరు సేవిస్తే, మీకు మేలు కలుగుతుంది” అని చెప్పాడు.
౨౫ అయితే ఏడో నెలలో రాజ కుటుంబానికి చెందిన ఎలీషామాకు పుట్టిన నెతన్యా కొడుకు ఇష్మాయేలు పదిమంది మనుషులను పిలుచుకొచ్చి గెదల్యా మీద దాడి చేసినప్పుడు అతడు చనిపోయాడు. ఇంకా మిస్పాలో అతని దగ్గరున్న యూదులనూ, కల్దీయులనూ, అతడు హతం చేశాడు. ౨౬ అప్పుడు చిన్నవాళ్ళూ, గొప్పవాళ్ళూ, ప్రజలందరూ, సైన్యాధిపతులూ లేచి కల్దీయుల భయం చేత ఐగుప్తు దేశానికి పారిపోయారు.
౨౭ యూదారాజు యెహోయాకీను బందీగా ఉన్న 37 వ సంవత్సరంలో 12 వ నెల 27 వ రోజున బబులోను రాజు ఎవీల్మెరోదకు తాను పరిపాలన ఆరంభించిన సంవత్సరంలో, చెరసాలలో నుంచి యూదా రాజు యెహోయాకీనును బయటకు తెప్పించాడు.
౨౮ అతనితో దయగా మాట్లాడి, అతని పీఠాన్ని బబులోనులో తన దగ్గరున్న రాజుల పీఠాలకన్నా ఎత్తు చేశాడు. ౨౯ అతడు తన చెరసాల బట్టలు తీసేసి వేరే వస్త్రాలు వేసుకుని తాను బ్రతికిన రోజులన్నీ రాజు బల్ల మీద రాజుతో భోజనం చేస్తూ వచ్చాడు. ౩౦ ఇంకా అతడు బ్రతికినంత కాలం, క్రమం తప్పకుండా అతని భోజన భత్యం అతనికి అందుతూ ఉంది.