౧౧
౧ వసంత కాలంలో యుద్ధాలు జరిగే సమయంలో అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణాన్ని ఆక్రమించుకోడానికి దావీదు యోవాబునీ తన సేవకులనూ ఇశ్రాయేలు సైన్యమంతటినీ పంపించాడు. దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు.
౨ ఒకరోజు సాయంత్రం సమయంలో దావీదు పడక మీద నుండి లేచి రాజభవనం డాబా మీద నడుస్తున్నాడు. డాబాపై నుండి కిందికి చూస్తున్నప్పుడు స్నానం చేస్తూ ఉన్న ఒక స్త్రీ కనిపించింది. ౩ ఆమె ఎంతో అందంగా ఉంది. ఆమె గురించి వివరాలు తెలుసుకు రమ్మని దావీదు ఒకణ్ణి పంపించాడు. అతడు వచ్చి “ఆమె పేరు బత్షెబ. హిత్తీయుడైన ఊరియా భార్య, ఏలీయాము కూతురు” అని చెప్పాడు. ౪ దావీదు తన మనుషులను పంపి ఆమెను తన దగ్గరికి పిలిపించాడు. ఆమె అతని దగ్గర కు వచ్చినప్పుడు ఆమెతో శయనించాడు. ఆమె తనకు కలిగిన మలినం పోగొట్టుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళింది.
౫ కొన్ని రోజులకు ఆమె గర్భం ధరించింది. “నేను గర్భవతి నయ్యాను” అని ఆమె దావీదుకు కబురు పంపింది. ౬ దావీదు “హిత్తీయుడైన ఊరియాని నా దగ్గరికి పంపించు” అని ఒక వ్యక్తి ద్వారా యోవాబుకు కబురు చేశాడు. ౭ యోవాబు ఊరియాని దావీదు దగ్గరికి పంపించాడు. జరుగుతున్న యుద్ధ విశేషాలనూ యోవాబు, ఇతర సైనికుల క్షేమ సమాచారాలనూ దావీదు అతణ్ణి అడిగి తెలుసుకున్నాడు. ౮ తరువాత దావీదు “నువ్వు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకో” అని ఊరియాకు అనుమతి ఇచ్చాడు. ఊరియా రాజు నగరం నుండి బయలుదేరాడు. రాజు అతని వెనకాలే అతనికి ఒక బహుమానం పంపించాడు. ౯ అయితే ఊరియా తన ఇంటికి వెళ్ళకుండా రాజు సేవకులతో కలసి రాజనగర గుమ్మం దగ్గర నిద్రపోయాడు.
౧౦ ఊరియా అతని ఇంటికి వెళ్ళలేదన్న సంగతి దావీదుకు తెలిసింది. అప్పుడు దావీదు ఊరియాను పిలిపించి “నువ్వు ప్రయాణం చేసి అలసిపోయావు కదా, ఇంటికి ఎందుకు వెళ్ళలేదు?” అని అడిగాడు. ౧౧ అందుకు ఊరియా “మందసమూ, ఇశ్రాయేలువారూ యూదావారూ గుడారాల్లో ఉంటున్నారు. నా అధికారి యోవాబూ, మా రాజువైన నీ సేవకులూ బాహ్య ప్రదేశంలో ఉండగా నేను తింటూ, తాగుతూ నా భార్యతో గడపడానికి ఇంటికి వెళ్ళాలా? నీ మీద, నీ ప్రాణం మీద ఒట్టు, నేను అలా ఎంత మాత్రం చేయలేను” అని దావీదుతో అన్నాడు.
౧౨ అప్పుడు దావీదు “ఈరోజు కూడా నువ్వు ఇక్కడే ఉండు. రేపు నిన్ను పంపిస్తాను” అని ఊరియాతో చెప్పాడు. ఊరియా ఆ రోజు, తరువాతి రోజు యెరూషలేములో ఉండిపోయాడు. ౧౩ ఈలోగా దావీదు ఊరియాను భోజనానికి పిలిపించాడు. దావీదు అతడు బాగా తిని, తాగి మత్తుడయ్యేలా చేశాడు. సాయంత్రమయ్యాక అతడు బయలుదేరి వెళ్లి మళ్ళీ తన ఇంటికి వెళ్ళకుండా రాజు సేవకుల మధ్య నిద్రపోయాడు.
౧౪ తెల్లవారిన తరువాత దావీదు “యుద్ధం భీకరంగా జరుగుతున్న చోట ఊరియాను ముందు వరుసలో నిలబెట్టి అతడు చనిపోయేలా చేసి అక్కడి నుండి వెళ్ళిపో” అని ౧౫ యోవాబుకు ఉత్తరం రాయించి దాన్ని ఊరియా చేత పంపించాడు. ౧౬ యోవాబు అమ్మోనీయుల పట్టాణాన్ని ఆక్రమించే సమయంలో యుద్ధం భీకరంగా జరిగే స్థలాన్ని గుర్తించి ఆ స్థలానికి ఊరియాను పంపాడు. ౧౭ ఆ పట్టణం వారు బయటికీ వచ్చి యోవాబుతో యుద్ధం చేసినప్పుడు కొందరు దావీదు సేవకులతో పాటు హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు.
౧౮ యోవాబు ఈ యుద్ధ సమాచారాన్ని ఒక సైనికుడి ద్వారా దావీదుకు తెలియజేశాడు. ౧౯ యోవాబు ఆ సైనికుడితో “యుద్ధ సమాచారం రాజుకు చెప్పిన తరువాత రాజు కోపం తెచ్చుకుని ‘మీరు యుద్ధం తీవ్రంగా జరుగుతున్న పట్టణానికి దగ్గరగా ఎందుకు వెళ్లారు? ౨౦ గోడపైకి ఎక్కి వాళ్ళు బాణాలు వేస్తారని మీకు తెలియదా? ౨౧ ఎరుబ్బెషెతు కొడుకు అబీమెలెకు ఎలా చనిపోయాడు? తేబేసు దగ్గర ఒక స్త్రీ తిరగలి రాయిని గోడపై నుండి అతని మీద వేయడం వల్లనే గదా అతడు చనిపోయింది? ప్రాకారం దగ్గరికి మీరెందుకు వెళ్ళారు?’ అని అడిగితే, నువ్వు, ‘తమ సేవకుడైన ఊరియా కూడా చనిపోయాడు’ అని చెప్పు” అని చెప్పి ఆ సైనికుణ్ణి పంపాడు.
౨౨ యోవాబు పంపిన సైనికుడు వచ్చి దావీదుకు విషయమంతా చెప్పాడు. ౨౩ ఎలాగంటే “వారి సైనికులు మమ్మల్ని తరుముతూ యుద్ధభూమిలో మాకు ఎదురు పడినప్పుడు మేము వారిని సరిహద్దుల వరకూ తరిమి గెలిచాము. ౨౪ అప్పుడు గోడలపై నుండి విలుకాళ్ళు తమ సైనికులపై బాణాలు కురిపించారు. రాజు సేవకుల్లో కొందరితో సహా తమరి సేవకుడు, హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు.” ౨౫ అప్పుడు దావీదు “నువ్వు యోవాబుతో ఈ మాట చెప్పు. ‘జరిగినదాన్ని బట్టి నువ్వు బాధపడవద్దు. కత్తి ఒకసారి ఒకరిని, మరోసారి మరొకరిని చంపుతుంది. పట్టణం మీద యుద్ధం మరింత తీవ్రతరం చేసి దాన్ని ఓడించు’ అని యోవాబుకు ధైర్యం చెప్పు” అని ఆ సైనికునికి చెప్పి పంపించాడు.
౨౬ ఊరియా భార్య బత్షెబ తన భర్త చనిపోయిన సంగతి విని విలపించింది. ౨౭ విలాప సమయం ముగిసిన తరువాత దావీదు తన మనుషులను పంపి ఆమెను తన భవనానికి రప్పించుకున్నాడు. ఆమె దావీదుకు భార్యగా ఉండి ఒక కొడుకును కన్నది. అయితే దావీదు చేసిన ఈ పని యెహోవా దృష్టిలో పాపంగా నిలిచిపోయింది.