౩౦
౧ యెహోవా నాకీ విషయం తెలియచేశాడు. ౨  “నరపుత్రుడా, ప్రవచిస్తూ ఇలా చెప్పు, యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, ‘అయ్యో! రాబోతున్న ఆ రోజు ఎంత భయంకరం.’ ౩ ఆ రోజు వచ్చేసింది! యెహోవా కోసం ఆ రోజు వచ్చింది! అది మబ్బులు కమ్మే రోజు. రాజ్యాలు పతనమయ్యే రోజు!
౪ అప్పుడు ఐగుప్తు దేశం మీద కత్తి పడుతుంది. ఐగుప్తులో చనిపోయిన వాళ్ళు కూలిపోతుంటే కూషు దేశస్థులు వేదన పడతారు.
శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకుని దేశపు పునాదులను పడగొడతారు!
౫ కూషీయులు, పూతీయులు, లూదీయులు, విదేశీయులు నిబంధన ప్రజలంతా కత్తితో కూలుతారు!
౬ యెహోవా తెలియజేసేది ఏమిటంటే,
ఐగుప్తుకు అండగా ఉండే వాళ్ళు కూలుతారు. గర్వంతో కూడిన దాని బలం అణగిపోతుంది.
మిగ్దోలు నుండి సెవేనే వరకూ ప్రజలు కత్తితో కూలుతారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
౭ పాడైపోయిన దేశాల మధ్య వాళ్ళు దిక్కులేని వాళ్ళుగా ఉంటారు. శిథిలాల పట్టణాల మధ్య వారి పట్టణాలుంటాయి.
౮ ఐగుప్తు దేశంలో అగ్ని రగిలించి నేను దానికి సహాయకులు లేకుండా చేస్తే అప్పుడు నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు. ౯ ఆ రోజు వార్తాహరులు నా దగ్గర నుంచి ఓడల్లో బయలుదేరి సురక్షితంగా ఉన్న కూషును భయపెడతారు. ఐగుప్తు పతనమయ్యే రోజున వారికి భయభ్రాంతులు పుడతాయి. అదిగో! అది వస్తూ ఉంది.
౧౦ యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “బబులోను రాజు నెబుకద్నెజరు వలన ఐగుప్తులో ఇక ఏ మాత్రం జనాభా ఉండరు. ౧౧ ఆ దేశాన్ని నాశనం చేయడానికి, అతడు తన సైన్యాన్ని తోడుకుని వస్తాడు. అతనికి రాజ్యాలన్నీ భయపడిపోతాయి. ఐగుప్తీయులను చంపడానికి వారు తమ కత్తులు దూసి చచ్చిన వాళ్ళతో దేశాన్ని నింపుతారు.
౧౨ నదులను ఎండగొట్టి ఆ నేను ఆ దేశాన్ని దుర్మార్గులకు అమ్మి వేస్తాను. విదేశీయులతో నేను ఆ దేశాన్ని, దానిలో ఉన్నదంతా పాడు చేయిస్తాను. ఇదే యెహోవా ప్రభువు సందేశం.”
౧౩ యెహోవా ఇలా చెబుతున్నాడు. “విగ్రహాలను నేను నాశనం చేస్తాను. మెంఫిస్ పట్టణపు పనికిరాని విగ్రహాలను లేకుండా చేస్తాను. ఇక ఐగుప్తు దేశంలో రాజు ఉండడు. దేశమంతటా నేను భయం పుట్టిస్తాను. ౧౪ పత్రోసును పాడు చేస్తాను. సోయనులో నిప్పు పెడతాను. తేబేస్ మీదికి శిక్ష పంపిస్తాను.
౧౫ ఐగుప్తుకు కోటగా ఉన్న పెలుసియం మీద నా కోపాగ్ని కుమ్మరిస్తాను. తేబేస్ లోని అనేకమందిని నిర్మూలం చేస్తాను. ౧౬ ఆ తరువాత ఐగుప్తును కాల్చివేస్తాను. పెలుసియం వాళ్ళు వేదనతో అల్లాడిపోతారు. తేబిస్ చిన్నాభిన్నమవుతుంది. ప్రతిరోజూ మెంఫిస్ పై శత్రువులు దాడి చేస్తారు.
౧౭ హీలియోపోలిస్, బుబాస్తిస్ పట్టణాల్లోని యువకులు కత్తితో కూలుతారు. ఆ పట్టణ ప్రజలు బందీలుగా పోతారు. ౧౮ ఐగుప్తు మోపిన కాడిని నేను తహపనేసులో విరిచే రోజున చీకటి కమ్ముకుంటుంది. గర్వంతో కూడిన ఐగుప్తీయుల బలం అక్కడ అంతమవుతుంది. దాన్ని మబ్బు కమ్ముకుంటుంది. దాని కూతుర్లు బందీలుగా పోతారు. ౧౯ నేను ఐగుప్తీయులకు శిక్ష విధిస్తే నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.
౨౦ పదకొండవ ఏడు మొదటి నెల ఏడవ రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు. ౨౧ నరపుత్రుడా, నేను ఐగుప్తు రాజు ఫరో చేతిని విరగ గొట్టాను. అది బాగుపడేలా ఎవరూ దానికి కట్టు కట్టరు. కత్తి పట్టుకునే బలం దానికి లేదు.”
౨౨ కాబట్టి యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “నేను ఐగుప్తురాజు ఫరో చేతులను విరిచేస్తాను. అతని బలమైన చేతినీ, విరిగిన చేతినీ విరగ గొట్టి, అతని చేతిలోనుంచి కత్తి జారిపోయేలా చేస్తాను. ౨౩ అప్పుడు ఐగుప్తీయులను ఇతర రాజ్యాల్లోకి చెదరగొడతాను. వివిధ దేశాలకు వారిని వెళ్లగొడతాను. ౨౪ ఫరో చేతులను నేను విరగ గొట్టడానికి, బబులోను రాజు చేతులను బలపరచి నా కత్తి అతని చేతికిస్తాను. బబులోను రాజు చూస్తూ ఉండగా ఫరో చావు దెబ్బతిన్న వాడి లాగా మూలుగుతాడు.
౨౫ బబులోను రాజు చేతులను నేను బలపరుస్తాను. ఫరో చేతులు పడిపోతాయి. ఐగుప్తు దేశం మీద చాపడానికి నేను నా కత్తిని బబులోను రాజు చేతికిస్తే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు. ౨౬ నేను యెహోవానని వాళ్ళు తెలుసుకునేలా నేను ఐగుప్తును రాజ్యాల్లో చెదర గొట్టి వివిధ దేశాలకు వారిని వెళ్లగొడతాను.”