౧ నేను మళ్ళీ తలెత్తి చూసినప్పుడు ఎగిరిపోతూ ఉన్న ఒక గ్రంథం నాకు కనిపించింది. ౨  “నీకు ఏమి కనబడుతుంది?” అని అతడు నన్ను అడిగాడు. అందుకు నేను “20 మూరల పొడవు, 10 మూరల వెడల్పు ఉండి ఎగిరిపోతూ ఉన్న ఒక గ్రంథం కనబడుతుంది” అని చెప్పాను. ౩ అప్పుడు అతడు నాతో “ఇది భూమి అంతటి మీదికీ బయలుదేరి వెళ్తున్న శాపం. దానికి ఒక వైపు రాసి ఉన్న ప్రకారం దొంగతనం చేసేవాళ్ళు నాశనం అవుతారు, రెండవ వైపు రాసి ఉన్న ప్రకారం అబద్ద సాక్ష్యాలు పలికేవాళ్ళంతా నాశనం అవుతారు” అని చెప్పాడు.
౪ ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. నేనే ఆ గ్రంథాన్ని పంపుతున్నాను. అది దొంగల ఇళ్ళలో, నా నామాన్ని బట్టి అబద్ధ ప్రమాణం చేసేవారి ఇళ్ళలో ప్రవేశించి వాళ్ళ ఇళ్ళలో ఉండి ఇళ్ళను, వాటి గుమ్మాలను, గోడలను నాశనం చేస్తుంది. ౫ అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత వచ్చి “నువ్వు బయలుదేరి వెళ్లి నీ కన్నులెత్తి చూసి ఇవతలకు వస్తున్నదేమిటో కనిపెట్టు” అని నాతో చెప్పాడు. ౬ నేను “ఇది ఏమిటి?” అని అడిగినప్పుడు అతడు “ఇది కొలత గంప. ఇది దేశమంతటిలో ఉన్న ప్రజలను సూచిస్తుంది” అని చెప్పాడు.
౭ గంపకు ఉన్న సీసపు మూత తీసినప్పుడు గంపలో కూర్చుని ఉన్న ఒక స్త్రీ కనబడింది. ౮ అప్పుడతడు “ఇది దోషంతో నిండి ఉంది” అని నాతో చెప్పి గంపలో ఆ స్త్రీని పడవేసి సీసపు మూతను గంపపై ఉంచాడు. ౯ నేను మళ్ళీ చూసినప్పుడు ఇద్దరు స్త్రీలు బయలుదేరారు. సంకుబుడి కొంగ రెక్కలవంటి రెక్కలు వాళ్లకు ఉన్నాయి. గాలికి వాళ్ళ రెక్కలు ఆడుతున్నాయి. వాళ్ళు వచ్చి గంపను మోసుకుంటూ భూమి ఆకాశాల మధ్యకు దాన్ని ఎత్తారు. ౧౦ నేను నాతో మాట్లాడుతున్న దూతతో “వీళ్ళు ఈ గంపను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు?” అని అడిగాను. ౧౧ అందుకతడు “షీనారు దేశంలో దాని కోసం ఒక గృహం నిర్మించడానికి వాళ్ళు వెళ్తున్నారు. గృహం సిద్ధమైనప్పుడు అక్కడ దాన్ని నియమిత స్థలంలో ఉంచుతారు” అని జవాబిచ్చాడు.