4
ఎలీఫజు మాట్లాడుతున్నాడు 
 1-2 అప్పుడు తేమానువాడైన ఎలీఫజు జవాబు ఇచ్చాడు: 
“నీతో ఎవరైనా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అది నిన్ను కలవర పెడుతుందా? 
నేను మాట్లాడాల్సి ఉంది! 
 3 యోబూ, ఎంతో మంది మనుష్యులకు నీవు ఉపదేశాన్ని చేసావు. 
బలహీన హస్తాలకు నీవు బలం ఇచ్చావు. 
 4 తొట్రిల్లిన మనుష్యులకు నీ మాటలు ఆదరణ కలిగించాయి. 
బలహీనమైన మోకాళ్లను నీవు బలపరిచావు. 
 5 కాని ఇప్పుడు నీకు కష్టం వస్తే నీవు అధైర్య పడుతున్నావు. 
కష్టం నిన్ను దెబ్బతీస్తే నీవు తల్లడిల్లి పోయావు! 
 6 నీవు దేవున్ని ఆరాధిస్తూ 
ఆయన పట్ల నమ్మకంగా ఉన్నావు. 
కనుక నీవు నీ విశ్వాస్యతను నమ్ముకోవాలి. 
నీవు నిర్దోషివి కనుక అదే నీకు నిరీక్షణగా ఉండును గాక. 
 7 యోబూ, ఇప్పుడు దీనిని గూర్చి ఆలోచించు నిర్దోషియైన మనిషి ఎవ్వరూ, ఎన్నడూ నాశనం చేయబడలేదు. 
మంచి మనుష్యులు ఎన్నడూ నాశనం చేయబడలేదు. 
 8 కీడు, కష్టం ప్రారంభించే మనుష్యులను నేను గమనించాను. 
వారికి కూడా అవే సంభవిస్తాయి. 
 9 దేవుని శ్వాస ఆ మనుష్యులను చంపేస్తుంది. 
దేవుని కోపం వారిని నాశనం చేస్తుంది. 
 10 దుర్మార్గులు సింహాలవలె గర్జించి గుర్రు పెడతారు. 
కాని దేవుడు దుర్మార్దులను నోరు మూయిస్తాడు. 
మరియు దేవుడు వారి పళ్లు విరుగగొడతాడు. 
 11 దుర్మార్గులు తినుటకు ఏమి లేని సింహాలవలె ఉంటారు. 
వారు చస్తారు, వారి పిల్లలు చెదరి పోతారు. 
 12 “రహస్యంగా నాకు ఒక సందేశం అందించబడింది. 
ఆ గుసగుసలు నా చెవులు విన్నాయి. 
 13 రాత్రివేళ వచ్చే ఒక చెడ్డ కలలా 
అది నా నిద్రను భంగం చేసింది. 
 14 నేను భయపడి వణకిపోయాను. 
నా ఎముకలన్నీ వణకిపోయాయి! 
ఎలీఫజు మాట్లాడుతున్నాడు 
 15 ఒక ఆత్మ నా ముఖాన్ని దాటిపోగా 
నా శరీరం మీది వెంట్రుకలు వేగంగా చలించాయి! 
 16 ఆత్మ ఇంకా నిలిచి ఉంది. 
కాని అదేమిటో నేను చూడలేకపోయాను. 
ఒక ఆకారం నా కళ్ల ఎదుట నిలిచింది. 
నిశ్శబ్దంగా ఉంది. 
అప్పుడు నేను ఒక మెల్లని స్వరం చెప్పడం విన్నాను. 
 17 ‘ఒక మనిషి దేవుని కంటే ఎక్కువ (నీతిమంతుడు)గా ఉండలేడు. 
మనిషి తనను చేసిన వానికంటే ఎక్కువ పరిశుద్ధంగా ఉండలేడు. 
 18 దేవుడు తన పరలోకపు సేవకులను కూడా నమ్మలేడు. 
తన దేవదూతల విషయంలో కూడా దేవుడు తప్పులు పట్టుకోగలడు 
 19 కనుక దేవుడు మనుష్యుల విషయంలో మరి ఎక్కవ తప్పులు పట్టుకోగలడు. 
మనుష్యులు మట్టి ఇండ్లలో* మట్టి ఇండ్లు మానవ శరీరం. నివసిస్తారు. 
ఈ మట్టి ఇండ్లవునాదులు మట్టిలో ఉన్నాయి. 
వారు చిమ్మెట కంటే తేలికగా చాపగొట్టబడతారు. 
 20 సూర్వోదయం, సూర్యాస్తమయం మధ్య ఈ మనుష్యులు మరణిస్త్తారు, వారిని ఎవ్వరూ గుర్తించరు. 
వారు శాశ్వతంగా నశించిపోతారు. 
 21 వారి గుడారాల తాళ్లు లాగివేయబడతాయి, 
ఈ మనుష్యులు బుద్ధిలేకుండా చస్తారు.’ ”