34
 1 అప్పుడు ఎలీహు మాట్లాడటం కొన సాగించాడు: 
 2 “జ్ఞానంగల మనుష్యులారా, నేను చెప్పే విషయాలు వినండి. 
తెలివిగల మనుష్యులారా నా మాటలు గమనించండి. 
 3 చెవి తను వినే సంగతులను పరీక్షిస్తుంది. 
అదే విధంగా నాలుక, తన తాకే వాటిని రుచి చూస్తుంది. 
 4 అందుచేత మనం ఈ పరిస్థితిని పరిశీలించాలి. ఏది సరైనదో మనమే నిర్ణయించాలి. 
ఏది మంచిది అనేది కూడా మనం అంతా ఏకంగా నేర్చు కొంటాం. 
 5 యోబు అంటున్నాడు, ‘యోబు అనే నేను నిర్దోషిని. 
కానీ దేవుడు నాకు న్యాయం చేయలేదు. 
 6 నాది సరిగ్గా ఉంది, కానీ ప్రజలు నాది తప్పు అనుకొంటారు. 
నేను అబద్దీకుణ్ణి అని వాళ్లు అనుకొంటారు. నేను నిర్దోషిని అయినప్పటికి నా గాయం మానదు.’ 
 7 “యోబులాంటి వ్యక్తి మరొకడు లేడు. 
మీరు యోబును అవమానించినప్పటికి అతడు లెక్క చేయడు. 
 8 చెడ్డ వాళ్లతో యోబు స్నేహంగా ఉన్నాడు. 
దుర్మార్గులతో కలిసి సహవాసం యోబుకు యిష్టం. 
 9 ‘ఎందుకంటే, ఒకడు దేవునికి విధేయత చూపించేందుకు ప్రయత్నిస్తే 
దానివల్ల అతనికి ప్రయోజనం ఏమీ కలుగదు’ అని యోబు చెబుతున్నాడు. 
 10 “కనుక గ్రహించగలిగిన ఓ మనుష్యులారా, నా మాటవినండి. 
దేవుడు ఎన్నటికీ చెడు చేయడు. 
సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ తప్పు చేయడు. 
 11 ఒకడు చేసిన విషయాలనే తిరిగి దేవుడు అతనికి చెల్లిస్తాడు. 
మనుష్యలకు రావలసిందే దేవుడు వారికి ఇస్తాడు. 
 12 ఇది సత్యం. దేవుడు తప్పు చేయడు. 
సర్వశక్తి మంతుడైన దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగానే ఉంటాడు. 
 13 భూమికి పర్యవేక్షకునిగా ఉండేందుకు దేవుణ్ణి ఎవరు నియమించారు? 
భూభారాన్ని దేవునికి ఎవరు అప్పగించారు? (దేవుడు అన్నింటినీ పుట్టించాడు మరియు అన్నీ ఆయన అధీనంలో ఉంటాయి.) 
 14 దేవుడు తన ఆత్మను, 
తన ప్రాణవాయువును మనుష్యుల్లోనుండి తీసివేయాలని ఒకవేళ అనుకొంటే 
 15 అప్పుడు భూమి మీద మనుష్యులు అందరూ చని పోతారు. 
అప్పుడు మనుష్యులు మరల మట్టి అయిపోతారు. 
 16 “మీరు జ్ఞానంగల వారైతే, 
నేను చెప్పేది వినండి. 
 17 న్యాయంగా ఉండటం యిష్టంలేని మనిషి పరిపాలకునిగా ఉండజాలడు. 
యోబూ, బలమైన మంచి దేవుణ్ణి నీవు దోషిగా తీర్చగలవని నీవు తలుస్తున్నావా? 
 18 ‘మీరు పనికిమాలిన వాళ్లు’ అని రాజులతో చెప్పేవాడు దేవుడు. 
‘మీరు దుర్మార్గులు’ అని నాయకులతో దేవుడు చెబుతాడు. 
 19 దేవుడు నాయకులను మనుష్యులకంటె ఎక్కువేమీ ప్రేమించడు. 
దేవుడు ధనికులను దరిద్రుల కంటే ఎక్కువేమీ ప్రేమించడు. 
ఎందుకంటే, ప్రతి మనిషినీ దేవుడే చేశాడు గనుక. 
 20 ఒక వ్యక్తి రాత్రిపూట అకస్మాత్తుగా మరణించ వచ్చును. 
మనుష్యులను దేవుడు రోగులుగా చేస్తాడు. 
వారు మరణిస్తారు. 
ఏ కారణం లేకుండానే శక్తిగల మనుష్యులు మరణిస్తారు. 
 21 “మనుష్యులు ఏమి చేస్తున్నదీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. 
ఒక వ్యక్తి నడిచే ప్రతి నడత దేవునికి తెలుసు. 
 22 దుర్మార్గుడు దేవునికి కనబడకుండా దాగుకొనేందుకు చీకటి చోటు ఏమీ లేదు. 
ఏ చోటైన చీకటిగా ఉండదు. 
 23 మనుష్యులను మరింత పరీక్షించేందుకు దేవునికి ఒక నిర్ణీత సమయం అవసరం లేదు. 
మనుష్యులకు తీర్పు తీర్చేందుకు దేవుడు వారిని తన ఎదుటికి తీసుకొని రానవసరం లేదు. 
 24 దేవుడు ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. 
కానీ దేవుడు శక్తివంతమైన వారిని నాశనం చేసి ఇతరులను వారి స్థానంలో ఉంచుతాడు. 
 25 కనుక మనుష్యులు ఏమి చేస్తారో దేవునికి తెలుసు. 
అందుకే దేవుడు దుర్మార్గులను రాత్రిపూట ఓడించి, వారిని నాశనం చేస్తాడు. 
 26 చెడ్డవాళ్లు చేయు దుర్మార్గపు పనులను బట్టి దేవుడు వారిని నాశనం చేస్తాడు. 
ఆ చెడ్డవారిని అందరూ చేసేలా ఆయన శిక్షిస్తాడు 
 27 ఎందుకంటే ఆ చెడ్డవాళ్లు దేవునికి విధేయత కావటం మానివేశారు గనుక. 
మరియు ఆయన కొరిన వాటిని చేయటం ఆ చెడ్డవాళ్లు లక్ష్య పెట్టలేదు గనుక. 
 28 పేద ప్రజలను బాధించి, వారు సహాయం కోసం దేవునికి మొర పెట్టేలాగా ఆ చెడ్డవాళ్లు చేశారు. 
మరియు పేదవారు సహాయం కోసం మొరపెట్టి నప్పుడు ఆయన వింటాడు. 
 29 కానీ ఒకవేళ పేద ప్రజలకు సహాయం చేయ కూడదని 
కనుక దేవుడు నిర్ణయంచేస్తే ఎవరూ ఆయనను దోషిగా నిర్ణయించలేరు 
ఒకవేళ దేవుడు ప్రజలకు తన ముఖం మరుగు చేసికొంటే వారికి సహాయం చేయగలవాడు ఎవడూ ఉండడు. 
అయితే ఆయన వ్యక్తులను, రాజ్యాలను పాలిస్తాడు. 
 30 తర్వాత దేవునికి విరోధంగా ఉండి మనుష్యులను మోసగించే వ్యక్తిని 
దేవుడు పాలకునిగా ఉండనివ్వడు. 
 31 “ఒకవేళ ఒక వ్యక్తి దేవునితో అనవచ్చును: 
‘నేను దోషిని, నేను ఇంకెంత మాత్రం పాపం చేయను. 
 32 దేవా, నాకు తెలియని విషయాలు నాకు నేర్పించు. 
నేను తప్పు చేసి ఉంటే ఇకమీదట ఎన్నటికి మరల దానిని చేయను.’ 
 33 కానీ యోబూ, నీవు మారటానికి తిరస్కరిస్తూ ఉండగా, 
నీవు ఏ విధంగా ప్రతిఫలం కావాలని కోరుకొంటావో అలా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలా? 
యోబూ, ఇది నీ తీర్మానం, నాది కాదు. 
నీవు ఏమి అనుకొంటున్నావో నాకు చెప్పు. 
 34 జ్ఞానం గలిగి, గ్రహింపు ఉన్న ఏ మనిషిగాని నాతో ఏకిభవిస్తాడు. 
నా మాటలు వినే జ్ఞానం గల మనిషి ఎవరైనా సరే అని అంటారు, 
 35 ‘యోబు తెలియనివానిలా మాట్లాడతాడు. 
యోబు చెప్పే మాటలకు అర్థం లేదు.’ 
 36 యోబును పరీక్షించేందుకు అతనికి ఇంకా ఎక్కువ కష్టాలు వస్తే బాగుండునని, నా ఆశ. 
ఎందుకంటే ఒక దుర్మార్గుడు జవాబిచ్చినట్టుగా యోబు మనకు జవాబు ఇస్తున్నాడు గనుక. 
 37 యోబు తన పాపం అంతటికి తిరుగుబాటుతనం అదనంగా కలిపాడు. 
యోబు మనలను అవమానించి, మన ఎదుట దేవుణ్ణి హేళన చేస్తున్నాడు.”