హోషేయ 
గ్రంథకర్త 
హోషేయ గ్రంథంలోని అనేక సందేశాలను పలికినది హోషేయ ప్రవక్త. వాటిని అతడే స్వయంగా రాశాడో లేదో తేలియదు. హోషేయ దేవుని పక్షంగా మాట్లాడాడని నమ్మిన అతని అనుచరులు బహుశా అతని ప్రవచనాలను గ్రంథస్దం చేసి ఉండవచ్చు. ఈ ప్రవక్త పేరుకు అర్ధం “రక్షణ.” మరి ఏ ఇతర ప్రవక్త కంటే కూడా హోషేయ తన ప్రవచనాలను తన వ్యక్తిగత జీవితంతో అను సంధానించాడు. తనకు నమ్మక ద్రోహం చేస్తుందని ముందుగానే ఎరిగి, అతడు ఒక స్త్రీని పెళ్ళి చేయసుకోవడం ద్వారా, ఇశ్రాయేలు మీద తీర్పులు వినిపించే పేర్లు తన పిల్లలకు పెట్టడం ద్వారా అతని ప్రవచన పరిచర్య అతని కుటుంబం లో నుంచే బయలు వెళ్ళింది. 
రచనా కాలం, ప్రదేశం 
సుమారు క్రీ. పూ. 755 - 725 
యెషయా సందేశాలను సేకరించి, ఎడిట్ చేసి, ప్రతులు ఎత్తిరాశారు. ఈ తతంగమంతా ఎప్పటికి పూర్తి అయిందో మనకు తెలియదు. అయితే యెరుషలేము వినాశానానికి ముందు ఇది పూర్తి అయిందన్నది మాత్రం స్పష్టం. 
స్వీకర్త 
హోషేయ మౌఖిక సందేశాత్మక హెచ్చరికలు, పశ్చాతాపానికి పిలుపుగా, పూర్వ క్షేమస్ధితి కలుగుతుందనే వాగ్దానంగా రాసి పెట్టడం జరిగింది. 
ప్రయోజనం 
దేవుడు నమ్మకత్వాన్ని కోరుతున్నాడని ఇశ్రాయేలీయిలకు, మనకు కూడా గుర్తు చేయడానికి హోషేయ ఈ గ్రంథం రాశాడు. యోహోవాయే ఏకైక నిజ దేవుడు. నిర్ద్వంద్వమైన స్వామిభక్తి ఆయన కోరుతున్నాడుట. పాపం తీర్పును కొనితెస్తుంది. అలా కాకుంటే బాధాకరమైన పరిణామాలు, శత్రుదాడి, బానిసత్వం తప్పవు. నమ్మకంగా ఉంటామని శుష్కప్రియాలు పలికి, ఆ మాటలు మీరుతూ ఉండే మనుషుల్లాంటివాడు కాదు దేవుడు. ఇశ్రాయేలు నమ్మక ద్రోహం చేసినప్పటికీ దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉంటాడు. వారికి పూర్వక్షేమస్ధితి కలిగే మార్గం ఎర్పరుస్తూ ఉంటాడు. హోషేయ, గోమెరుల సంకేతరూపకమైన వివాహాల ద్వారా ఇశ్రాయేలు వంటి విగ్రహరాధక జాతి పట్ల దేవుని ప్రేమ, పాపం పట్ల తీర్పు, క్షమించే ప్రేమలను కనుపరిచే చక్కని ఉపమాలంకారంగా ఈ పుస్తకంలో రాసి ఉంది. 
ముఖ్యాంశం 
నమ్మకద్రోహం 
విభాగాలు 
1. హోషేయ కులట అయిన భార్య — 1:1-11 
2. ఇశ్రాయేలు పట్ల దేవుని తీర్పులు, కక్షలు — 2:1-23 
3. దేవుడు తన ప్రజలను విమోచిస్తాడు — 3:1-5 
4. ఇశ్రాయేలు నమ్మకద్రోహం, శిక్ష — 4:1-10:15 
5. దేవుని ప్రేమ, ఇశ్రాయేలుకు పూర్వక్షేమస్ధితి కలిగించడం — 11:1-14:9  
 1
 1 ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజులు, యెహోయాషు కుమారుడైన ఇశ్రాయేలు రాజు యరొబాము పరిపాలించిన దినాల్లో బెయేరి కుమారుడు హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. 
హోషేయ భార్యబిడ్డలు 
 2 యెహోవా హోషేయతో మొదట మాట్లాడినప్పుడు ఇలా ఆజ్ఞాపించాడు. 
“వెళ్ళి ఒక వేశ్యను నీకు భార్యగా తెచ్చుకో. 
ఆమె వ్యభిచారం ఫలితంగా పుట్టిన సంతానాన్ని స్వీకరించు. 
ఎందుకంటే దేశం నన్ను విడిచిపెట్టి నీచమైన వ్యభిచార కార్యాలు చేసింది.” 
 3 కాబట్టి హోషేయ వెళ్ళి దిబ్లయీము కూతురు గోమెరును పెళ్ళాడాడు. 
ఆమె గర్భం ధరించి అతనికొక కొడుకుని కన్నది. 
 4 యెహోవా అతనికి ఇలా ఆజ్ఞాపించాడు. 
“వీడికి ‘యెజ్రెయేల్* 1:4 యెజ్రెయేల్ దేవుడు చెదరకొట్టి వేస్తాడు’ అని పేరు పెట్టు. 
యెజ్రెయేలులో యెహూ వంశం వారు రక్తపాతం చేశారు. 
దాన్ని బట్టి ఇక కొంతకాలానికి నేను వారిని శిక్షిస్తాను. 
ఇశ్రాయేలువారికి రాజ్యం ఉండకుండాా తీసేస్తాను. 
 5 ఆ రోజుల్లో జరిగేది ఏమిటంటే, 
నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరిచేస్తాను.” 
 6 గోమెరు మళ్లీ గర్భం ధరించి ఆడపిల్లను కన్నది. 
యెహోవా అతనికి ఇలా చెప్పాడు. 
“దీనికి ‘లో రూహామా† 1:6 లో రూహామా దయ పొందనిది’ అని పేరు పెట్టు. 
ఎందుకంటే ఇకపై నేను ఇశ్రాయేలును క్షమించడం కోసం వారిపై జాలి పడను. 
 7 అయితే యూదావారిపై జాలి చూపుతాను. 
వారి దేవుడైన యెహోవా అనే నేనే వారిని రక్షిస్తాను. 
విల్లు, ఖడ్గం, సమరం, గుర్రాలు, రౌతులు అనే వాటి వల్ల కాదు.” 
 8 లో రూహామా పాలు మానిన తరువాత ఆమె తల్లి గర్భం ధరించి మరొక కొడుకును కన్నది. 
 9 యెహోవా ఇలా చెప్పాడు. 
“వీడికి ‘లో అమ్మీ‡ 1:9 లో అమ్మీ నా జనం కానిది’ అని పేరు పెట్టు. 
ఎందుకంటే మీరు నా ప్రజలు కారు, 
నేను మీకు దేవుణ్ణి కాను. 
 10 అయినప్పటికీ ఇశ్రాయేలీయుల జనసంఖ్య సముద్రతీరంలో ఇసుకంత విస్తారం అవుతుంది. 
దాన్ని కొలవలేము, లెక్కబెట్టలేము. 
ఎక్కడ ‘మీరు నా ప్రజలు కారు’ అని వారితో చెప్పానో, 
అక్కడే ‘మీరు సజీవుడైన దేవుని ప్రజలు’ అని వారికి చెబుతారు. 
 11 యూదా, ఇశ్రాయేలు ఒక్క చోట సమకూడుతారు. 
తమపై ఒకే నాయకుణ్ణి నియమించుకుంటారు. 
ఆ దేశంలో నుండి బయలు దేరుతారు. 
ఆ యెజ్రెయేలు దినం§ 1:11 యెజ్రెయేలు దినం దేవుడు ఒకప్పుడు తన ప్రజల్ని శిక్షిస్తాడు మహా ప్రభావ దినం.”