23
బిలాము మొదటి ప్రవచనం 
 1 బిలాము “ఇక్కడ ఏడు బలిపీఠాలు కట్టండి. నాకోసం ఏడు ఎద్దులు, ఏడు పొట్టేళ్లు సిద్ధంచేయండి” అని చెప్పాడు.  2 బిలాము అడిగినట్టే బాలాకు దీన్ని చేసాడు. అప్పుడు బాలాకు, బిలాము ఒక్కో బలిపీఠం మీద ఒక్కో పొట్టేలును, ఒక్కో ఎద్దును వధించారు. 
 3 అప్పుడు బిలాము, “ఈ బలిపీఠం దగ్గరగా ఉండు. నేను ఇంకో చోటికి వెళ్తాను. అప్పుడు యెహోవా నా దగ్గరకు వచ్చి నేను చెప్పాల్సింది ఏమిటో నాకు చెబుతాడు” అని బాలాకుతో చెప్పాడు. అప్పుడు బిలాము మరో ఉన్నత స్థలానికి వెళ్లిపోయాడు. 
 4 అక్కడ దేవుడు బిలాము దగ్గరకు వచ్చాడు. “ఏడు బలిపీఠాలు నేను సిద్ధం చేసాను. ఒక్కో బలిపీఠంమీద ఒక్కో ఎద్దును ఒక్కోపొట్టేలును బలిగా నేను వధించాను” అన్నాడు బిలాము. 
 5 అప్పుడు బిలాము ఏమి చెప్పాల్సిందీ యెహోవా అతనికి చెప్పాడు. అప్పుడు, “తిరిగి వెళ్లి, చెప్పమని నేను నీకు చెప్పిన విషయాలు బాలాకుతో చెప్పు” అన్నాడు యెహోవా. 
 6 కనుక బిలాము తిరిగి బాలాకు దగ్గరకు వెళ్లాడు. బాలాకు ఇంకా బలిపీఠం దగ్గరే నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులంతా వారితో నిలిచి ఉన్నారు.  7 అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు: 
“తూర్పు కొండల్లో నుండి ఆరాము నుండి మోయాబు 
రాజైన బాలాకు నన్ను ఇక్కడకు తీసుకుచ్చాడు. 
వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించు! 
‘వచ్చి నా పక్షంగా యాకోబును శపించు, 
వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించు!’ అన్నాడు నాతో బాలాకు. 
 8 దేవుడు ఆ ప్రజలకు వ్యతిరేకంగా లేడు 
అందుచేత నేనుకూడ వారిని శపించలేను. 
ఆ ప్రజల విషయమై యెహోవా చెడ్డ విషయాలను చెప్పలేదు 
అందుచేత నేను అలా చేయలేను. 
 9 కొండమీద నుండి నేను ఆ ప్రజలను చూస్తున్నాను. 
ఎత్తయిన కొండల నుండి నేను చూస్తున్నాను. 
ఒంటరిగా బతుకుతున్న ప్రజలను నేను చూస్తున్నాను, 
వాళ్లు మరో జనములో భాగంకారు యాకోబు ప్రజలను ఎవరు లెక్కించగలరు. 
 10 ఇసుక రేణవులకంటె ఎక్కువ ఉన్నారు యాకోబు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల్లో నాలుగోవంతు మనుష్యుల్ని కూడ ఎవరూ లెక్కించలేరు. ఒక మంచి మనిషిగా నన్ను చావనివ్వండి ఆ మనుష్యులు మరణించినంత సంతోషంగా నన్ను మరణించనివ్వండి!” 
 11 బాలాకు బిలాముతో, “ఏమిటి నీవు నాకు చేసింది? నా శత్రువుల్ని శపించమని నేను నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను. కానీ నీవు మాత్రం వాళ్లను ఆశీర్వదించావు” అన్నాడు. 
 12 కానీ బిలాము, “నేను చెప్పాల్సింది దేవుడు నాకు చెప్పిన విషయాలు మాత్రమే” అని జవాబిచ్చాడు. 
 13 అప్పుడు, “అలాగైతే, నాతో మరో చోటికి రా. అక్కడకూడ నీవు మనుష్యుల్ని చూడగలవు. అయితే అందర్నీ కాదుగాని కొందర్ని మాత్రం చూడగలవు. అక్కడనుండి నీవు నా కోసం వాళ్లను శపించవచ్చు” అని అతనితో చెప్పాడు బాలాకు.  14 కనుక బాలాకు యోఫీం పొలంలోకి బిలామును తీసుకుని వెళ్లాడు. ఇది పిస్గా కొండ శిఖరం మీద ఉంది. ఆ స్థలంలో బాలాకు ఏడు బలిపీఠాలు కట్టించాడు. అప్పుడు బాలాకు ఒక్కో బలిపీఠం మీద ఒక్కో ఎద్దును, ఒక్కో పొట్టేలును బలిగా వధించాడు. 
 15 కనుక బిలాము, “ఈ బలిపీఠం దగ్గర ఉండు. నేను వెళ్లి అక్కడ దేవుడ్ని కలుసుకొంటాను” అని బాలాకుతో చెప్పాడు. 
 16 కనుక యెహోవా బిలాము దగ్గరకు వచ్చి, అతడు ఏమి చెప్పాల్సిందీ అతనికి తెలియజేసాడు. అప్పుడు యెహోవా, బిలామును వెళ్లి ఆ సంగతులు బాలాకుతో చెప్పమన్నాడు.  17 కనుక బిలాము బాలాకు దగ్గరకు వెళ్లాడు. బాలాకు ఇంకా బలిపీఠం దగ్గరే నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులు వారితోబాటు ఉన్నారు. అతడు రావటం చూచి, “ఏమి చెప్పాడు యెహోవా?” అన్నాడు బాలాకు. 
బిలాము రెండో ప్రవచనం 
 18 అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు: 
“బాలాకూ లేచి నా మాట విను. 
సిప్పోరు కుమారుడా, బాలాకూ, నా మాట విను. 
 19 దేవుడు మనిషికాడు, 
ఆయన అబద్ధం చెప్పడు. 
దేవుడు మానవ కుమారుడు కాడు, 
ఆయన నిర్ణయాలు మారవు. 
ఏదైనా చేస్తానని యెహోవా చెబితే 
ఆయన అలా చేస్తాడు. 
యెహోవా ఒక వాగ్దానం చేస్తే, 
ఆయన తన వాగ్దానం ప్రకారం చేస్తాడు. 
 20 ఆ ప్రజలను ఆశీర్వదించమని యెహోవా నాకు ఆజ్ఞాపించాడు. 
యెహోవా వారిని ఆశీర్వదించాడు కనుక నేను దాన్ని మార్చలేను. 
 21 దేవునికి యాకోబు ప్రజల్లో తప్పేమీ కనబడలేదు. 
ఇశ్రాయేలు ప్రజల్లో ఏ పాపమూ దేవునికి కనబడలేదు. 
యెహోవా వారి దేవుడు, 
ఆయన వారితో ఉన్నాడు. 
మహారాజు వారితో ఉన్నాడు. 
 22 దేవుడు వారిని ఈజిప్టు నుండి బయటకు తీసుకొచ్చాడు. 
అడవి ఎద్దుల్లా వారు బలంగా ఉన్నారు. 
 23 యాకోబు ప్రజలను ఓడించగల శక్తి ఏదీ లేదు. 
ఇశ్రాయేలు ప్రజలకు ఎదురు వెళ్లగల మంత్రమూ ఏదీ లేదు. 
‘దేవుడు చేసిన మహా కార్యాలను చూడండి’ అని యాకోబును గూర్చి, 
ఇశ్రాయేలు ప్రజలను గూర్చి మనుష్యులు అంటారు. 
 24 ఆ ప్రజలు బలమైన సింహంలా ఉంటారు. 
సింహంలా వారు పోరాడతారు. 
ఆ సింహం తన శత్రువును తినివేసేంత వరకు విశ్రాంతి తీసుకోదు. 
తనకు వ్యతిరేకంగా ఉండేవారి రక్తం తాగేంతవరకు ఆ సింహం ఊరుకోదు.” 
 25 అప్పుడు బాలాకు, “ఆ ప్రజలకు మేలు జరగాలని నీవు అడుగలేదు గాని కీడు జరగాలని కూడ నీవు అడుగలేదు” అన్నాడు బిలాముతో. 
 26 బిలాము, “యెహోవా నాకు చెప్పిన విషయాలు మాత్రమే చెబుతానని నేను నీకు ముందే చెప్పాను” అని జవాబిచ్చాడు. 
 27 అప్పుడు బాలాకు, “అలాగైతే నాతో మరో బలిపీఠం దగ్గరకు రా. ఒకవేళ అక్కడ దేవుడు సంతోషించి, అక్కడనుండి ఆ ప్రజలను శపించనిస్తాడేమో” అని బిలాముతో చెప్పాడు.  28 కనుక బాలాకు పీయోరు కొండకు బిలామును తీసుకుని వెళ్లాడు. ఈ కొండ నుండి అరణ్యాన్ని చూడవచ్చు. 
 29 “ఇక్కడ ఏడు బలిపీఠాలు నిర్మించు. తర్వాత బలికోసం ఏడు ఎద్దుల్ని, ఏడు పొట్టేళ్లను సిద్ధం చేయి” అన్నాడు బిలాము.  30 బిలాము అడిగినట్టు బాలాకు చేసాడు. ప్రతి బలిపీఠం మీద ఒక్కో ఎద్దును, ఒక్కో పొట్టేలును బాలాకు బలిగా వధించాడు.