27
సెలోపెహాదు కుమార్తెలు 
 1 హెసెరు కుమారుడు సెలోపెహాదు. హెసెరుగిలాదు కుమారుడు. గిలాదు మాకీరు కుమారుడు. మాకీరు మనష్షే కుమారుడు. మనష్షే యోసేపు కుమారుడు. సెలోపెహాదుకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా.  2 సన్నిధి గుడారం దగ్గర సమావేశం అవుతోన్న మోషే, యాజకుడైన ఎలీయాజరు, పెద్దలు, ప్రజలు అందరి ముందరకు ఈ అయిదుగురు స్త్రీలూ వెళ్లి సన్నిధి గుడారం ఎదుట నిలబడ్డారు. 
ఈ ఐదుగురు కూతుళ్లు ఈ విధంగా చెప్పారు:  3 “మనం అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడే మా తండ్రి చనిపోయాడు. అతడు కోరహు గుంపులో చేరినవాడు కాడు. (కోరహు యెహోవానుంచి తొలగి ఎదురు తిరిగినవాడు.) మా తండ్రిది సహజ మరణం. కానీ మా తండ్రికి కుమారులు లేరు.  4 అంటే మా తండ్రి పేరు కొనసాగదు. మా తండ్రి పేరు కొనసాగక పోవటం సక్రమం కాదు. ఆయనకు కుమారులు లేరు గనుక ఆయన పేరు అంతం అవుతుంది. అందుచేత మా తండ్రి సోదరులకు వచ్చే భూమిలో మాకు కొంత ఇవ్వవలసినదిగా మేము మీకు మనవి చేస్తున్నాము.” 
 5 కనుక ఏమి చేయాలని యెహోవాను మోషే అడిగాడు.  6 అతనిలో యెహోవా ఇలా అన్నాడు,  7 “సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది సరియైనదే. వాళ్లు వారి తండ్రి సోదరులతో పాటు భూమిని పంచుకోవలసినదే. కనుక నీవు వారి తండ్రికిచ్చిన భూమిని వారికి ఉవ్వవలెను. 
 8 “కనుక ఇశ్రాయేలు ప్రజలకు, ఇలా చట్టం తయారు చేయి. ‘ఒకనికి కుమారులు లేకుండానే అతడు చనిపోతే, అతని ఆస్తి అంతా అతని కుమార్తెకు ఇవ్వవలెను.  9 అతనికి కుమార్తె లేకపోతే, అతని ఆస్తి అంతా అతని సోదరులకు ఇవ్వవలెను.  10 అతనికి సోదరులు లేకపోతే అతని ఆస్తి అంతా అతని తండ్రి సోదరులకు ఇవ్వవలెను.  11 అతని తండ్రికి సోదరులు లేకపోతే, అతని ఆస్తి అంతా, అతని కుటుంబంలో దగ్గర బంధువులకు ఇవ్వాలి. ఇశ్రాయేలు ప్రజల్లో ఇది ఒక చట్టంగా ఉండాలి. యెహోవాయే ఈ ఆజ్ఞను మోషేకు ఇస్తున్నాడు.’ ” 
కొత్త నాయకుడుగా యెహోషువ 
 12 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “ఆ కొండమీదికి ఎక్కుము. యొర్దాను నదికి తూర్పున ఉన్న కొండల్లో అది ఒకటి. ఇశ్రాయేలు ప్రజలకు నేను ఇస్తున్న దేశాన్ని నీవు అక్కడ నుండి చూస్తావు.  13 నీవు ఈ దేశాన్ని చూశాక, నీ సోదరుడు అహరోను మరణించినట్టే నీవు మరణిస్తావు.  14 సీను అరణ్యంలో నీళ్లకోసం ప్రజలు కోపగించుకోవటం జ్ఞాపకం చేసుకొనుము. నీవూ, అహరోనూ కూడ నా ఆజ్ఞకు విధేయులయ్యేందుకు నిరాకరించారు. ప్రజల ముందు నీవు నన్ను ఘనపర్చలేదు, పవిత్రంగా చూడలేదు.” (ఇది సీను అరణ్యంలో కాదేషు దగ్గర మెరీబా నీళ్ల సంగతి.) 
 15 యెహోవాతో మోషే ఇలా అన్నాడు:  16 “ప్రజల ఆలోచనలు తెలిసిన దేవుడు యెహోవా ప్రభువు, నీవే ఈ ప్రజలకోసం మరో నాయకుడిని ఎంచుకోమని మనవి చేస్తున్నాను.  17 ఈ దేశంలోనుండి వీరిని బయటకు నడిపించి, కొత్త దేశంలో చేర్చగల నాయకుడిని ఎంచవలసినదిగా నేను యెహోవాకు మనవి చేస్తున్నాను. అప్పుడు యెహోవా ప్రజలు కాపరి లేని గొర్రెల్లా ఉండరు.” 
 18 కనుక మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నూను కుమారుడైన యెహోషువ నాయకుడుగా ఉంటాడు. యోహోషువ ఆత్మను పొందినవాడు. అతడిని కొత్త నాయకునిగా చేయి.  19 యాజకుడైన ఎలీయాజరు ఎదుటా, ప్రజలందరి ఎదుటా నిలబడమని అతనితో చెప్పు. అప్పుడు అతడికి కొత్త నాయకునిగా నీవు చేయి. 
 20 “అతడిని నీవు నాయకునిగా చేస్తున్నావని ప్రజలకు చూపెట్టు, అప్పుడు ప్రజలంతా అతనికి లోబడతారు.  21 ఒకవేళ యెహోషువ ఒక కొత్త నిర్ణయం ఏదైనా చేయాలంటే అతడు యాజకుడైన ఎలీయాజరు దగ్గరకు వెళతాడు. యెహోవా జవాబు తెలుసుకొనేందుకు ఎలీయాజరు ఊరీమును ప్రయోగిస్తాడు. అప్పుడు యెహోషువ, ప్రజలందరూ దేవుడు చెప్పిన వాటిని చేస్తారు. ‘యుద్ధానికి వెళ్లండి’ అని అతడు చెబితే వారు యుద్ధానికి వెళ్తారు. ఒకవేళ ‘ఇంటికి వెళ్లండి’ అని అతడు చెబితే వారు ఇంటికి వెళతారు.” 
 22 మోషే యెహోవాకు విధేయుడయ్యాడు. యాజకుడైన ఎలీయాజరు ముందు, ప్రజలందరి ఎదుట నిలబడమని యెహోషువాతో చెప్పాడు. మోషే,  23 అప్పుడు అతడే కొత్త నాయకుడు అని చూపెట్టేందుకు అతనిమీద మోషే చేతులు పెట్టాడు. అతనితో యెహోవా చెప్పినట్టే అతడు చేసాడు.