౨
 ౧ సీయోనులో బాకా ఊదండి, 
నా పరిశుద్ధ పర్వతం మీద మేల్కొలిపే శబ్దం చేయండి! 
యెహోవా దినం వస్తున్నదనీ అది సమీపమయ్యిందనీ 
దేశనివాసులంతా భయంతో వణకుతారు గాక. 
 ౨ అది చీకటి రోజు, గాఢాంధకారమయమైన రోజు. 
కారు మబ్బులు కమ్మే కటిక చీకటి రోజు. 
పర్వతాల మీద ఉదయకాంతి ప్రసరించినట్టు 
బలమైన గొప్ప సేన వస్తూ ఉంది. 
అలాంటి సేన ఎన్నడూ లేదు, ఇక ఎన్నడూ మళ్ళీ రాదు. 
తరతరాల తరువాత కూడా అది ఉండదు. 
 ౩ దాని ముందు అగ్ని అన్నిటినీ కాల్చేస్తున్నది. 
వాటి వెనుక, మంట మండుతూ ఉంది. 
అది రాకముందు భూమి ఏదేను తోటలా ఉంది. 
అది వచ్చి వెళ్లిపోయిన తరువాత భూమి ఎడారిలా పాడయింది. 
దానినుంచి ఏదీ తప్పించుకోలేదు. 
 ౪ సేన రూపం, గుర్రాల లాగా ఉంది. 
వాళ్ళు రౌతులలాగా పరుగెడుతున్నారు. 
 ౫ వాళ్ళు పర్వత శిఖరాల మీద రథాలు పరుగులు పెడుతున్నట్టు వచ్చే శబ్దంతో దూకుతున్నారు. 
ఎండిన దుబ్బు మంటల్లో కాలుతుంటే వచ్చే శబ్దంలా, 
యుద్ధానికి సిద్ధమైన గొప్ప సేనలా ఉన్నారు. 
 ౬ వాటిని చూసి ప్రజలు అల్లాడిపోతున్నారు, 
అందరి ముఖాలు పాలిపోతున్నాయి. 
 ౭ అవి శూరుల్లాగా పరుగెడుతున్నాయి. 
సైనికుల్లాగా అవి గోడలెక్కుతున్నాయి. 
అటూ ఇటూ తిరుగకుండా అవన్నీ తిన్నగా నడుస్తున్నాయి. 
 ౮ ఒకదానినొకటి తోసుకోకుండా తమ దారిలో చక్కగా పోతున్నాయి. 
ఆయుధాలు ఎదుర్కొన్నా వరుస తప్పవు. 
 ౯ పట్టణంలో చొరబడుతున్నాయి. 
గోడల మీద పరుగెడుతూ దొంగల్లాగా కిటికీల గుండా ఇళ్ళల్లోకి వస్తున్నాయి. 
 ౧౦ వాటి ముందు భూమి కంపిస్తున్నది, 
ఆకాశాలు వణుకుతున్నాయి. 
సూర్యచంద్రులకు చీకటి కమ్ముకుంది. 
నక్షత్రాలు కాంతి తప్పుతున్నాయి. 
 ౧౧ యెహోవా తన సైన్యం ముందు తన స్వరం పెంచాడు, 
ఆయన యోధులు చాలా ఎక్కువమంది. 
ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారు బలవంతులు. 
యెహోవా దినం గొప్పది, మహా భయంకరమైనది. 
దాన్ని ఎవరు వైపుకోగలరు? 
 ౧౨ యెహోవా ఇలా అంటున్నాడు, 
“ఇప్పుడైనా, ఉపవాసముండి కన్నీళ్ళు కారుస్తూ దుఃఖిస్తూ 
హృదయపూర్వకంగా నాదగ్గరికి తిరిగి రండి.” 
 ౧౩ మీ యెహోవా దేవుడు అత్యంత కృప గలవాడూ దయగలవాడు. 
త్వరగా కోపపడేవాడు కాదు. విస్తారంగా ప్రేమ చూపించేవాడు. 
శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు. 
కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక 
మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి. 
 ౧౪ ఒకవేళ ఆయన మీ వైపు తిరిగి జాలి చూపుతాడేమో. 
మీరు మీ యెహోవా దేవునికి తగిన నైవేద్యాన్ని, 
పానార్పణాన్ని అర్పించేలా మిమ్మల్ని దీవిస్తాడేమో ఎవరికి తెలుసు? 
 ౧౫ సీయోనులో బాకా ఊదండి. 
ఉపవాసదినం ప్రతిష్ఠించండి. సంఘంగా కూడండి. 
 ౧౬ ప్రజలను సమకూర్చండి. 
సంఘాన్ని ప్రతిష్ఠించండి. పెద్దలను పిలిపించండి. 
పిల్లలనూ చంటి పిల్లలనూ తీసుకురండి. 
పెళ్లికొడుకులు తమ గదుల్లోనుంచి, 
పెళ్లికూతుళ్ళు తమ పెళ్లి గదుల్లోనుంచి రావాలి. 
 ౧౭ యెహోవాకు పరిచర్యచేసే సేవకులు, యాజకులు 
మంటపానికీ బలిపీఠానికి మధ్య నిలబడి ఏడవాలి. 
“యెహోవా, నీ ప్రజలను కనికరించు. 
నీ సొత్తుగా ఉన్న వారిని సిగ్గుపడనివ్వకు. 
వారి మీద రాజ్యాలను ఏలనివ్వకు. 
వారి దేవుడు ఏమయ్యాడు? అని ఇతర ప్రజలు ఎందుకు చెప్పుకోవాలి?” 
 ౧౮ అప్పుడు యెహోవా తన దేశాన్ని గురించి రోషంతో ఉన్నాడు. 
తన ప్రజల పట్ల జాలితో ఉన్నాడు. 
 ౧౯ యెహోవా తన ప్రజలకు ఇలా జవాబిచ్చాడు, 
“నేను మీకు ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె పంపిస్తాను. 
మీరు వాటితో తృప్తి చెందుతారు. 
ఇకనుంచి మరెన్నడూ మిమ్మల్ని ఇతర ప్రజల్లో అవమానానికి గురిచేయను. 
 ౨౦ ఉత్తర దిక్కు నుంచి వచ్చే సేనను మీకు దూరంగా పారదోలతాను. 
వారిని ఎండిపోయి, పాడైపోయిన ప్రాంతానికి తోలివేస్తాను. 
దాని ముందు భాగాన్ని తూర్పు సముద్రంలో, దాని వెనుక భాగాన్ని పడమటి సముద్రంలో పడేస్తాను. 
అది కంపు కొడుతుంది, చెడ్డవాసన వస్తుంది. 
నేను గొప్ప పనులు చేస్తాను.” 
 ౨౧ దేశమా, భయపడక సంతోషించి గంతులు వెయ్యి. 
యెహోవా గొప్ప పనులు చేశాడు. 
 ౨౨ పశువులారా, భయపడవద్దు. గడ్డిబీళ్లలో పచ్చిక మొలుస్తుంది. 
చెట్లు కాయలు కాస్తాయి. అంజూరపుచెట్లు, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి. 
 ౨౩ సీయోను ప్రజలారా, ఆనందించండి. 
మీ యెహోవా దేవుణ్ణి తలుచుకుని సంతోషించండి. 
ఆయన మీ కోసం సరిపోయినంత తొలకరి వాన, వాన జల్లు పంపిస్తాడు. 
ముందులాగా తొలకరి వాన, కడవరి వాన కురిపిస్తాడు. 
 ౨౪ కళ్ళాలు గోదుమ గింజలతో నిండి ఉంటాయి. 
కొత్త ద్రాక్షారసం, నూనెతో తొట్లు పొర్లి పారతాయి. 
 ౨౫  “ఎగిరే మిడతల గుంపులూ పెద్ద మిడతలూ మిడత పిల్లలూ గొంగళి పురుగులూ, 
ఆ నా మహాసేన తినేసిన సంవత్సరాల పంటను మీకు మళ్ళీ ఇస్తాను. 
 ౨౬ మీరు కడుపునిండా తిని తృప్తి పడతారు. 
మీ మధ్య చేసిన అద్భుతాలను బట్టి 
మీ యెహోవా దేవుని పేరును స్తుతిస్తారు. 
నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను. 
 ౨౭ అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉంది నేనే అనీ, 
నేనే మీ యెహోవా దేవుడిననీ, 
నేను తప్ప వేరే దేవుడు లేడనీ మీరు తెలుసుకుంటారు. 
నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను. 
 ౨౮ తరువాత నేను ప్రజలందరి మీద 
నా ఆత్మను కుమ్మరిస్తాను. 
మీ కొడుకులూ మీ కూతుర్లూ ప్రవచనాలు చెబుతారు. 
మీ ముసలివారు కలలుకంటారు. 
మీ యువకులకు దర్శనాలు వస్తాయి. 
 ౨౯ ఆ రోజుల్లో నేను పనివారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. 
 ౩౦ ఆకాశంలో అద్భుతాలు చూపిస్తాను. 
భూమ్మీద రక్తం, మంటలు, ఎత్తయిన పొగ కలిగిస్తాను. 
 ౩౧ యెహోవా భయంకరమైన ఆ మహాదినం రాకముందు 
సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంలా మారతాయి. 
 ౩౨ యెహోవా పేరున ప్రార్థనచేసే వారందరినీ కాపాడడం జరుగుతుంది. 
యెహోవా చెప్పినట్టు సీయోను కొండమీద, యెరూషలేములో తప్పించుకున్నవారుంటారు. 
యెహోవా ఏర్పాటు చేసుకున్నవాళ్ళు మిగులుతారు.”