౨౭
రోమ్ నగరానికి ప్రయాణ సన్నాహాలు 
 ౧ మేము ఓడలో ఇటలీ వెళ్ళాలని నిర్ణయమైంది. వారు పౌలునీ, మరికొందరు ఖైదీలనీ అగస్టస్ సైనిక దళంలోని శతాధిపతి అయిన జూలియస్ అనే అతనికి అప్పగించారు.  ౨ ఆసియా తీరం పక్కగా ఉన్న పట్టణాల మీదుగా ప్రయాణించే అద్రముత్తియ పట్టణపు ఓడ ఎక్కి మేము బయలుదేరాం. మాసిదోనియ లోని తెస్సలోనిక పట్టణం వాడైన అరిస్తార్కు మాతో కూడ ఉన్నాడు. 
 ౩ మరునాడు సీదోను వచ్చాం. అప్పుడు జూలియస్ పౌలు మీద దయ చూపించి, అతడు తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి పరిచర్యలు పొందడానికి అనుమతించాడు.  ౪ అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టడం చేత సైప్రస్ దీవి చాటుగా ఓడ నడిపించాము.  ౫ తరువాత కిలికియకు పంఫూలియకు ఎదురుగా ఉన్న సముద్రం దాటి లుకియ పట్టణమైన మురకు చేరాం. 
 ౬ అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళబోతున్న అలెగ్జాండ్రియ పట్టణపు ఓడను చూసి అందులో మమ్మల్ని ఎక్కించాడు.  ౭ చాలా రోజుల పాటు మెల్లగా నడిచి, ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మల్ని అడ్డగించడం చేత క్రేతు చాటుగా సల్మోనే తీరంలో ఓడ నడిపించాము.  ౮ అతి కష్టంతో దాన్ని దాటి, ‘సురక్షిత ఆశ్రయాలు’ అనే స్థలానికి చేరాం. దాని పక్కనే లాసియ పట్టణం ఉంది. 
 ౯ చాలా కాలం గడిచింది. యూదుల ఉపవాసదినం కూడా అప్పటికి గడిచిపోయింది, ప్రయాణం చేయడం ప్రమాదకరంగా మారింది.  ౧౦ అప్పుడు పౌలు, “సోదరులారా, ఈ ప్రయాణం వలన సరకులకు, ఓడకు మాత్రమే కాక మనకూ ప్రాణహానీ, తీవ్ర నష్టం కలగబోతున్నదని నాకనిపిస్తుంది” అని వారిని హెచ్చరించాడు. 
 ౧౧ అయితే శతాధిపతి, పౌలు చెప్పింది కాక నావికుడు, ఓడ యజమాని చెప్పిందే నమ్మాడు.  ౧౨ పైగా చలి కాలం గడపడానికి ఆ రేవు అనుకూలమైనది కాకపోవడం చేత అక్కడ నుండి బయలుదేరి వీలైతే ఫీనిక్సు చేరి అక్కడ చలికాలం గడపాలని ఎక్కువమంది ఆలోచన చెప్పారు. అది క్రేతులోని నైరుతి వాయువ్య దిక్కుల వైపు ఉన్న ఒక రేవు.  ౧౩ అంతేగాక దక్షిణపు గాలి మెల్లగా విసరడంతో వారు తమ ఆలోచన సరైందని భావించి లంగరెత్తి, క్రేతు తీరంలో ఓడను నడిపించారు. 
తుఫాను 
 ౧౪ కొంచెం సేపటికి ఊరకులోను అనే పెనుగాలి క్రేతు మీద నుండి విసిరింది.  ౧౫ ఓడ దానిలో చిక్కుకుపోయి గాలికి ఎదురు నడవలేక పోయింది. ఇక ఎదురు నడిపించడం మాని, గాలికి కొట్టుకొనిపోయాం.  ౧౬ తరువాత కౌద అనే ఒక చిన్న ద్వీపం చాటుగా దాన్ని నడిపించాం. బహు కష్టంగా ఓడకు కట్టిన పడవను కాపాడుకోగలిగాం.  ౧౭ దాన్ని పైకెత్తి కట్టిన తరువాత తాళ్ళు మొదలైనవి తీసుకుని ఓడ చుట్టూ బిగించి కట్టారు. ఓడ సూర్తిస్ అనే ఇసుకతిప్పకు తగిలి పగిలిపోతుందేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకొనిపోయారు. 
 ౧౮ గాలి చాలా తీవ్రంగా కొట్టడం వలన ఆ మరునాడు సరుకులు పారవేయడం మొదలుపెట్టారు.  ౧౯ మూడవ రోజున తమ చేతులారా ఓడ సామగ్రిని పారవేశారు.  ౨౦ కొన్ని రోజులపాటు సూర్యుడుగానీ నక్షత్రాలుగానీ కనబడక పెద్దగాలి మా మీద కొట్టింది. మేము ప్రాణాలతో తప్పించుకుంటామనే ఆశ పూర్తిగా నశించిపోయింది. 
పౌలు ప్రోత్సాహ వాక్కులు 
 ౨౧ వారు చాలాకాలం పస్తులు ఉండగా పౌలు వారి మధ్య నిలబడి, “అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకుండానే ఉండవలసింది. అప్పుడీ హానీ, నష్టమూ కలగకపోయేది.  ౨౨ ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. ఓడకి మాత్రమే నష్టం కలుగుతుందిగానీ, మీలో ఎవరి ప్రాణానికీ హాని కలగదు.  ౨౩ నేను ఎవరి వాడినో ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గత రాత్రి నా పక్కన నిలబడి,  ౨౪ ‘పౌలూ, భయపడకు. నీవు సీజరు ముందు నిలబడాల్సి ఉంది. ఇదిగో, నీతో కూడ ఓడలో ప్రయాణిస్తున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడు’ అని నాతో చెప్పాడు.  ౨౫ కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగుతుందని నేను దేవుని నమ్ముతున్నాను.  ౨౬ అయినప్పటికీ మనం కొట్టుకుపోయి ఏదైనా ఒక ద్వీపానికి తగులుకోవాలి” అని చెప్పాడు. 
 ౨౭ పద్నాలుగవ రాత్రి మేము అద్రియ సముద్రంలో ఇటు అటు కొట్టుకు పోతుండగా అర్థరాత్రి వేళ ఓడ నావికులు ఏదో ఒక దేశం దగ్గర పడుతున్నదని ఊహించి  ౨౮ ఇనుప గుండు కట్టిన తాడు వేసి చూసి సుమారు నూట ఇరవై అడుగుల లోతని తెలుసుకున్నారు. ఇంకా కొంతదూరం వెళ్ళిన తరువాత, మళ్ళీ గుండు వేసి చూసి తొంభై అడుగుల లోతని తెలుసుకున్నారు. 
 ౨౯ అప్పుడు రాతి దిబ్బలకు కొట్టుకుంటామేమో అని భయపడి, వారు ఓడ అడుగు నుండి నాలుగు లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారుతుందా అని కాచుకొని ఉన్నారు.  ౩౦ అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని ఆలోచించి, లంగరులు వేయబోతున్నట్లుగా నటించి సముద్రంలో పడవ దింపివేశారు.  ౩౧ అందుకు పౌలు “వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకోలేరు” అని శతాధిపతితో, సైనికులతో చెప్పాడు.  ౩౨ వెంటనే సైనికులు పడవ తాళ్ళు కోసి దాని కొట్టుకు పోనిచ్చారు. 
 ౩౩ తెల్లవారుతుండగా పౌలు, “పద్నాలుగు రోజుల నుండి మీరేమీ ఆహారం తీసుకోక పస్తులున్నారు.  ౩౪ కాబట్టి ఆహారం పుచ్చుకోమని మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయంగా ఉంటుంది. మీలో ఎవరి తలనుండీ ఒక్క వెంట్రుక కూడా నశించదు” అని చెప్పి ఆహారం తీసుకోమని అందరినీ బతిమాలాడు.  ౩౫ ఈ మాటలు చెప్పి, ఒక రొట్టె పట్టుకొని అందరి ముందూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాడు.  ౩౬ అప్పుడంతా ధైర్యం తెచ్చుకొని ఆహారం తీసుకున్నారు.  ౩౭ ఓడలో ఉన్న మేమంతా రెండు వందల డెబ్భై ఆరుగురం.  ౩౮ వారు తిని తృప్తి పొందిన తరువాత, గోదుమలను సముద్రంలో పారబోసి ఓడను తేలిక చేశారు. 
 ౩౯ తెల్లవారిన తరవాత అది ఏ దేశమో వారు గుర్తు పట్టలేకపోయారు, కానీ తీరం గల ఒక సముద్రపు పాయను చూసి, సాధ్యమైతే ఓడను అందులోకి నడిపించాలని ఆలోచించారు.  ౪౦ కాబట్టి లంగరుల తాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచి పెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా ఒడ్డుకి నడిపించారు. 
 ౪౧ కానీ ఓడ రెండు ప్రవాహాలు కలిసిన చోట చిక్కుకుపోయి ఇసుకలో ఇరుక్కుపోయింది. అందువల్ల ఓడ ముందు భాగం కూరుకుపోయి కదలలేదు. వెనక భాగం అలల దెబ్బకు బద్దలైపోతూ ఉంది.  ౪౨ ఖైదీల్లో ఎవరూ ఈదుకొని పారిపోకుండేలా వారిని చంపాలనే ఆలోచన సైనికులకు కలిగింది గాని,  ౪౩ శతాధిపతి పౌలుని రక్షించాలని కోరి వారి ఆలోచనకు అంగీకరించలేదు. ఈత వచ్చినవారు ముందు సముద్రంలో దూకి ఈదుకుంటూనూ,  ౪౪ మిగిలినవారు ఓడ చెక్క పలకలు, ఇతర వస్తువుల సాయంతోనూ ఒడ్డుకు చేరాలని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా అందరం తప్పించుకొని ఒడ్డుకు చేరాం.