౪౭
 ౧ ఫిలిష్తీ ప్రజలను గూర్చి ప్రవక్త అయిన యిర్మీయాకు యెహోవా నుండి వచ్చిన వాక్కు. ఈ వాక్కు ఫరో గాజా పై దండెత్తక ముందు వచ్చింది. 
 ౨  “యెహోవా ఇలా చెప్తున్నాడు. చూడండి. ఉత్తర దిక్కున నీళ్ళు వరదలా పొర్లి పారుతున్నాయి. వాళ్ళు వెల్లువలా పొంగిన నదిలా ఉంటారు. 
తర్వాత వాళ్ళు దేశం పైనా, దాని పట్టణాల పైనా, దానిలో నివాసముండే వాళ్ళ పైనా వెల్లువలా ప్రవహిస్తారు! కాబట్టి అందరూ సహాయం కోసం మొర్ర పెడతారు. 
దేశంలోని ప్రజలందరూ విలపిస్తారు. 
 ౩ వాళ్ళ బలమైన గుర్రాల డెక్కలు నేలను తన్నే చప్పుడు వినిపించినప్పుడు, 
వాళ్ళ రథాల వేగం హోరుకూ, ఉరుము లాంటి వాటి చక్రాల శబ్దానికీ 
భయపడిన తండ్రులు తమ బలహీనత కారణంగా తమ పిల్లలకు సహాయం చేయరు. 
 ౪ ఫిలిష్తీ వాళ్ళను నాశనం చేసే రోజు, తూరు, సీదోనులకు సహాయం చేయాలనుకునే వాళ్ళను కూడా నాశనం చేసే రోజు వస్తుంది. ఎందుకంటే యెహోవా ఫిలిష్తీ వాళ్ళనూ, కఫ్తోరు ద్వీపంలో మిగిలిపోయిన వాళ్ళనూ సర్వ నాశనం చేస్తాడు. 
 ౫ గాజా బోడిగా అయింది. ఆష్కెలోను విషయంలో అయితే, ఆ లోయలో మిగిలిన ఉన్న వాళ్ళు మౌనంగా ఉండిపోతారు. శోకంలో ఎంతకాలం నీకు నువ్వే గాయాలు చేసుకుంటావు?  ౬ అయ్యో, యెహోవా ఖడ్గమా, నువ్వు ఎప్పటికి చాలించుకుంటావు? 
ఇక ఆగు. నీ వరలోకి పోయి మౌనంగా ఉండు. 
 ౭ అష్కెలోను పైనా, సముద్ర తీర ప్రాంతాల పైనా దాడి చేయమని యెహోవా నీకు ఆజ్ఞాపించాడు కదా! 
నువ్వు ఇక మౌనంగా ఎలా ఉంటావు?