42
యెహోవా యొక్క ప్రత్యేకమైన సేవకుడు 
 1 “నా సేవకుణ్ణి చూడండి! 
నేను అతన్ని బలపరుస్తాను. 
నేను ఏర్పరచుకొన్నవాడు అతడే. 
అతని గూర్చి నేను ఎంతో ఆనందిస్తున్నాను. 
నా ఆత్మను నేను అతనిలో ఉంచాను. 
జనాలన్నింటికి అతడు న్యాయం చేకూరుస్తాడు. 
 2 అతడు వీధుల్లో కేకలు వేయడు 
అతడు గట్టిగా అరిచి శబ్దం చేయడు. 
 3 అతడు సౌమ్యుడు అతడు నలిగిన గడ్డిపరకను గూడ విరువడు. 
మిణుకు మిణుకు మంటున్న మంటనుగూడ అతడు ఆర్పడు. 
అతడు న్యాయాన్ని ప్రయోగించి ఏది సత్యమో తెలుసుకొంటాడు. 
 4 లోకానికి న్యాయం చేకూర్చేవరకు 
అతడు బలహీనం కాడు, నలిగిపోడు. 
దూర స్థలాల్లోని ప్రజలు అతని ఉపదేశాలను విశ్వాసిస్తారు.” 
ప్రపంచాన్ని చేసినవాడు, పరిపాలించేవాడు యెహోవా 
 5 యెహోవా, సత్యదేవుడు ఈ సంగతులు చెప్పాడు: (ఆకాశాలను యెహోవా చేశాడు. ఆకాశాలను భూమిమీద విస్తరింపజేసినవాడు యెహోవా. ఆయనే భూమిమీద సమస్తం చేసాడు. భూమిమీద మనుష్యులందరికి ఆయనే జీవం ప్రసాదిస్తాడు. భూమిమీద నడిచే ప్రతి వ్యక్తికి ఆయనే ప్రాణం పోస్తాడు.) 
 6 “మీరు సరైనది చేయాలని నిన్ను పిలిచింది నేనే, యెహోవాను. 
నేను నీ చేయి పట్టుకొంటాను. నేను నిన్ను కాపాడుతాను. 
ప్రజలతో నాకు ఒక ఒడంబడిక ఉంది. అని తెలియజేసేందుకు నీవే ఒక సంకేతం 
నీవు ప్రజలందరి కోసం ప్రకాశించే వెలుగుగా ఉంటావు. 
 7 గుడ్డివాళ్ల కళ్లు నీవు తెరుస్తావు. వాళ్లు చూడగలుగుతారు. 
అనేక మంది ప్రజలు చెరలో ఉన్నారు. ఆ ప్రజలను నీవు విడుదల చేస్తావు. 
అనేక మంది ప్రజలు చీకట్లో జీవిస్తున్నారు. ఆ బందీ గృహంనుండి నీవు వారిని బయటకు నడిపిస్తావు. 
 8 “నేను యెహోవాను. 
నా పేరు యెహోవా 
నేను నా మహిమను మరొకరికి ఇవ్వను. 
నాకు చెందాల్సిన స్తుతిని విగ్రహాలను (అబద్ధపు దేవుళ్ళను) తీసుకోనివ్వను. 
 9 కొన్ని సంగతులు జరుగుతాయని మొదట్లోనే నేను చెప్పాను, 
ఆ సంగతులు జరిగాయి. 
ఇప్పుడు, భవిష్యత్తులో జరుగబోయే సంగతులను గూర్చి, 
అవి జరుగక ముందే నేను మీకు వాటిని గూర్చి చెబతాను.” 
దేవునికొక స్తుతి గీతం 
 10 యెహోవాకు కొత్త కీర్తన పాడండి. 
భూమి మీద చాలా దూరంలో ఉన్న సర్వ ప్రజలారా, 
సముద్రాల్లో ప్రయాణం చేసే సర్వ ప్రజలారా, 
మహా సముద్రాల్లోని సర్వ ప్రాణులారా, 
దూర స్థలాల్లో ఉన్న సర్వ ప్రజలారా యెహోవాను స్తుతించండి! 
 11 అరణ్యాలు, పట్టణాలు కేదారు పొలాలు 
యెహోవా స్తుతించండి 
సెలా నివాసులారా ఆనందంగా పాడండి. 
మీ పర్వత శిఖరం మీదనుండి పాడండి. 
 12 యెహోవాకు మహిమ ఆపాదించండి. 
దూర దేశాల్లోని ప్రజలంతా ఆయనను స్తుతించాలి. 
 13 యెహోవా ఒక పరాక్రమ సైనికునిలా బయలుదేరుతున్నాడు. 
ఆయన యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్న వానిలా ఉంటాడు. ఆయన చాలా ఉర్రూతలూగుతూంటాడు. 
ఆయన గట్టిగా కేకలు వేసి అరుస్తాడు. 
ఆయన తన శత్రువులను ఓడిస్తాడు. 
దేవుడు చాలా ఓర్పుగలవాడు 
 14 “చాలా కాలంగా నేను మౌనంగా ఉన్నాను. 
నేను అలానే మౌనంగా ఉండి, నన్ను నేను నిగ్రహించుకొన్నాను. 
కానీ ఇప్పుడు శిశువును కంటున్న స్త్రీలా నేను గట్టిగా అరుస్తాను. 
నేను కఠినంగా, గట్టిగా ఊపిరి పీలుస్తాను. 
 15 కొండలను, పర్వతాలను నేను నాశనం చేస్తాను. 
అక్కడ మొలిచే మొక్కలన్నింటిని నేను ఎండిపోయేట్టు చేస్తాను. 
నదులను నేను పొడి నేలగా చేస్తాను. 
నీటి మడుగులను నేను ఎండిపోయేట్టు చేస్తాను. 
 16 గుడ్డివారికి ఇదివరకు తెలియని మార్గంలో నేను వారిని నడిపిస్తాను 
ఆ గుడ్డివారు ఇదివరకు ఎన్నడూ తిరుగని బాటలలో నేను వారిని నడిపిస్తాను. 
చీకటిని నేను వారికి వెలుగుగా చేస్తాను. 
కరకు నేలను నేను చదును చేస్తాను. 
నేను వాగ్దానం చేసే పనులను నేను చేస్తాను. 
నా ప్రజలను నేను విడువను. 
 17 కానీ కొంతమంది మనుష్యులు నన్ను వెంబడించటం మానివేశారు. 
బంగారపు పూత పూయబడిన విగ్రహాలు వారికి ఉన్నాయి. ‘మీరే మా దేవుళ్లు’ అని వారు ఆ విగ్రహాలతో చెబతారు. 
ఆ ప్రజలు వారి అబద్ధపు దేవుళ్లను నమ్ముతారు. 
కానీ ఆ ప్రజలు నీరాశ చెందుతారు.” 
దేవుని మాట వినటానికి ఇశ్రాయేలు నిరాకరించింది 
 18 “చెవిటి ప్రజలారా నా మాట వినాలి. 
గుడ్డి మనుష్యులారా మీరు కళ్లు తెరిచి, నన్ను చూడాలి. 
 19 ప్రపంచం అంతటిలోకెల్లా నా సేవకుడు* నా సేవకుడు ఇక్కడ ఇది ఇశ్రాయేలు ప్రజలు అని కూడా అర్థం చెప్పవచ్చు. ఎక్కువ గుడ్డివాడు. 
నేను ప్రపంచంలోకి పంపించిన నా సేవకుడు మహా చెవిటి. 
నేను ఒడంబడిక చేసు కొన్న ఆ వ్యక్తి యెహోవా సేవకుడు అందరికంటె మహా గుడ్డివాడు. 
 20 ఈ సేవకుడు తాను ఏమి చేయాలో అది చూడాలి. 
కానీ అతడు నాకు విధేయత చూపడం లేదు. 
అతడు తన చెవులతో వినగలడు. 
కానీ అతడు నా మాట వినుటకు నిరాకరిస్తున్నాడు.” 
 21 యెహోవా తన సేవకుని ఎడల న్యాయం చూపగోరుతున్నారు. 
కనుక అద్భుతమైన ఉపదేశాలను యెహోవా తన ప్రజలకు చేస్తాడు. 
 22 అయితే ప్రజలను చూడండి 
ఇతరులు వారిని ఓడించి, వారి దగ్గర దొంగిలించారు. 
యువకులంతా భయపడ్తున్నారు. 
వారు చెరలో బంధించబడ్డారు. 
మనుష్యులు వారి ధనం వారి దగ్గర్నుండి దోచుకొన్నారు. 
వారిని రక్షించేందుకు ఏ మనిషిలేడు. 
ఇతరులు వారి డబ్బు దోచుకొన్నారు. 
“దానిని తిరిగి ఇచ్చేయండి” అని చెప్పగల వాడు ఒక్కడూ లేడు. 
 23 మీలో ఎవరైనా దేవుని మాట విన్నారా? లేదు. కానీ మీరు ఆయన మాటలు జాగ్రత్తగా విని, జరిగిన దానిని గూర్చి ఆలోచించాలి.  24 యాకోబు, ఇశ్రాయేలునుండి ధనాన్ని దోచుకోనిచ్చింది ఎవరు? యెహోవాయే వారిని ఇలా చేయనిచ్చాడు. మనం యెహోవాకు విరోధంగా పాపం చేశాం. అందుచేత యెహోవా మన ధనాన్ని ఇతరులు దోచుకోనిచ్చాడు. యెహోవా కోరిన విధంగా జీవించటానికి ఇశ్రాయేలు ప్రజలు ఇష్టపడలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఉపదేశాలను వినిపించు కోలేదు.  25 అందుచేత యెహోవా వారిమీద కోపగించాడు. యెహోవా వారి మీదకు గొప్పయుద్ధాలు వచ్చేట్టు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు వారి చుట్టూరా అగ్ని ఉన్నట్టుగా ఉంది. కానీ జరుగుతోంది ఏమిటో వారికి తెలియలేదు. వారు కాలిపోతున్నట్టే ఉంది. కానీ జరుగుతోన్న సంగతులను గ్రహించేందుకు వారు ప్రయత్నించ లేదు.