౧౨
 ౧ కీషు కొడుకైన సౌలుకు భయపడి దావీదు ఇంకా దాగి ఉన్నప్పుడు, సౌలు బంధువులైన బెన్యామీనీయుల్లో పరాక్రమవంతులు కొంతమంది దావీదుకు యుద్ధంలో సాయం చెయ్యడానికి అతని దగ్గరికి సిక్లగుకు వచ్చారు.  ౨ వీళ్ళు బాణాలు ధరించి, కుడి ఎడమ చేతులతో, వడిసెలతో రాళ్లు రువ్వడంలో, బాణాలు వేయడంలో సామర్ధ్యం ఉన్నవాళ్ళు. 
 ౩ వాళ్లెవరంటే, గిబియావాడు షెమాయా కొడుకులైన అహీయెజెరు, ఇతడు అధిపతి. ఇతని తరువాతి వాడు యోవాషు, అజ్మావెతు కొడుకులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహూ,  ౪ ముప్ఫైమందిలో పరాక్రమశాలి, ముప్ఫైమందికి పెద్ద ఇష్మయా అనే గిబియోనీయుడు, యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు, 
 ౫ ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫటయా,  ౬ కోరహీయులు ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము,  ౭ గెదోరు ఊరివాడు యెరోహాము కొడుకులు యోహేలా, జెబద్యా అనేవాళ్ళు. 
 ౮ ఇంకా, గాదీయుల్లో పరాక్రమవంతులు కొంతమంది అరణ్యంలో దాగి ఉన్న దావీదు దగ్గర చేరారు. వీళ్ళు డాలు, ఈటె తో యుద్ధం చేయడంలో ప్రవీణులు. వీళ్ళు సింహం ముఖంలాంటి ముఖం ఉన్నవాళ్ళు. కొండల్లో ఉండే జింకలంత వేగంగా పరుగెత్త గలిగిన వాళ్ళు. 
 ౯ వాళ్లెవరంటే, మొదటివాడు ఏజెరు, రెండోవాడు ఓబద్యా, మూడోవాడు ఏలీయాబు,  ౧౦ నాల్గోవాడు మిష్మన్నా, ఐదోవాడు యిర్మీయా,  ౧౧ ఆరోవాడు అత్తయి, ఏడోవాడు ఎలీయేలు,  ౧౨ ఎనిమిదోవాడు యోహానాను, తొమ్మిదోవాడు ఎల్జాబాదు,  ౧౩ పదోవాడు యిర్మీయా, పదకొండోవాడు మక్బన్నయి. 
 ౧౪ గాదీయులైన వీళ్ళు సైన్యానికి అధిపతులుగా ఉన్నారు. వాళ్ళల్లో అతి అల్పుడైనవాడు, వందమందికి అధిపతి, అత్యధికుడైనవాడు వెయ్యిమందికి అధిపతి,  ౧౫ యొర్దాను గట్టుల మీదుగా పొర్లి పారే మొదటి నెలలో, దాన్ని దాటి వెళ్లి తూర్పు లోయల్లో, పడమటి లోయల్లో ఉన్నవాళ్ళందర్నీ తరిమివేసిన వాళ్ళు వీళ్ళే. 
 ౧౬ ఇంకా బెన్యామీనీయుల్లో కొంతమంది, యూదావాళ్ళల్లో కొంతమంది, దావీదు దాగి ఉన్న స్థలానికి వచ్చారు.  ౧౭ దావీదు బయల్దేరి వాళ్లకు ఎదురు వెళ్లి వాళ్లతో “మీరు సమాధానంతో నాకు సాయం చెయ్యడానికి నా దగ్గరికి వచ్చి ఉంటే, నా హృదయం మీతో కలుస్తుంది. అలా కాకుండా నావల్ల మీకు అపకారమేమీ కలుగలేదని తెలిసినా, నన్ను శత్రువుల చేతికి అప్పగించాలని మీరు వచ్చి ఉంటే, మన పూర్వీకుల దేవుడు దీన్ని చూసి మిమ్మల్ని గద్దించు గాక” అన్నాడు. 
 ౧౮ అప్పుడు ముప్ఫైమందికి అధిపతైన అమాశై ఆత్మవశంలో ఉండి “దావీదూ, మేము నీవాళ్ళం, యెష్షయి కొడుకా, మేము నీ పక్షాన ఉన్నాం. నీకు సమాధానం కలుగుగాక, సమాధానం కలుగుగాక, నీ సహకారులకు కూడా సమాధానం కలుగుగాక, నీ దేవుడే నీకు సహాయం చేస్తున్నాడు” అని పలికినప్పుడు, దావీదు వాళ్ళను చేర్చుకుని వాళ్ళను తన దండుకు అధిపతులుగా చేశాడు. 
 ౧౯ మనష్షేవాళ్ళు కూడా కొంతమంది వచ్చి దావీదు పక్షాన చేరారు. దావీదు ఫిలిష్తీయులతో కలిసి సౌలుమీద యుద్ధం చెయ్యడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళు వచ్చి దావీదుతో కలిశారు. కాని, వాళ్ళు దావీదుతో కలిసి ఫిలిష్తీయులకు సాయం చెయ్యలేదు. ఎందుకంటే దావీదు తన యజమాని అయిన సౌలు పక్షాన చేరిపోయి, వాళ్లకు ప్రాణహాని చేస్తాడని తమలో తాము చర్చించి, ఫిలిష్తీయుల అధికారులు దావీదును పంపివేశారు. 
 ౨౦ అప్పుడు అతడు సిక్లగుకు తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు మనష్షే వారు అద్నా యోజాబాదు, యెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అనే వేలమందిమీద అధిపతులు దావీదు పక్షాన చేరారు. 
 ౨౧ వాళ్ళందరూ పరాక్రమశాలులూ, సైన్యాధిపతులు. ఆ తిరుగులాడే దండులను హతం చెయ్యడానికి వాళ్ళు దావీదుకు సాయం చేశారు.  ౨౨ దావీదు సైన్యం దేవుని సైన్యంలా మహా సైన్యంగా అవుతూ, ప్రతిరోజూ అతనికి సాయం చేసేవాళ్ళు అతని దగ్గరికి వచ్చి చేరుతూ ఉన్నారు. 
 ౨౩ యెహోవా నోటి మాట ప్రకారం సౌలు రాజ్యాన్ని దావీదు వైపుకు తిప్పాలన్న ప్రయత్నంలో యుద్ధానికి ఆయుధాలు ధరించి అతని దగ్గరికి హెబ్రోనుకు వచ్చిన అధిపతుల లెక్క ఇలా ఉంది.  ౨౪ యూదా వాళ్ళల్లో డాలు, ఈటె పట్టుకుని యుద్ధానికి సిద్ధపడిన వాళ్ళు ఆరువేల ఎనిమిది వందలమంది.  ౨౫ షిమ్యోనీయుల్లో యుద్ధానికి తగిన శూరులు ఏడువేల వందమంది. 
 ౨౬ లేవీయుల్లో అలాంటివాళ్ళు నాలుగువేల ఆరువందలమంది.  ౨౭ అహరోను సంతతి వాళ్లకు అధిపతి యెహోయాదా. అతనితోపాటు ఉన్నవాళ్ళు మూడువేల ఏడు వందలమంది.  ౨౮ పరాక్రమవంతుడైన సాదోకు అనే యువకునితో పాటు అతని తండ్రి యింటి వాళ్ళైన అధిపతులు ఇరవై ఇద్దరు. 
 ౨౯ సౌలు సంబంధులైన బెన్యామీనీయులు మూడు వేలమంది. అప్పటి వరకూ వాళ్ళల్లో చాలామంది సౌలు ఇంటిని కాపాడుతూ ఉన్నవాళ్ళు.  ౩౦ తమ పూర్వీకుల యింటివాళ్ళల్లో పేరుపొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీయుల్లో ఇరవైవేల ఎనిమిదివందల మంది.  ౩౧ మనష్షే అర్థ గోత్రం వారిలో దావీదును రాజుగా చెయ్యడానికి వచ్చిన వాళ్ళు పద్దెనిమిది వేల మంది. 
 ౩౨ ఇశ్శాఖారీయుల్లో సమయోచిత జ్ఞానం ఉండి, ఇశ్రాయేలీయులు ఏం చెయ్యాలో అది తెలిసిన అధిపతులు రెండువందల మంది. వీళ్ళ సంబంధులందరూ వీళ్ళ ఆజ్ఞకు బద్ధులై ఉన్నారు.  ౩౩ జెబూలూనీయుల్లో అన్నిరకాల యుద్ధ ఆయుధాలు ధరించి యుద్ధానికి వెళ్ళగలిగిన వాళ్ళు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు, దావీదు పట్ల నమ్మకంగా స్వామిభక్తి కలిగి యుద్ధం చెయ్య గలవాళ్ళు యాభై వేల మంది. 
 ౩౪ నఫ్తాలీయుల్లో వెయ్యిమంది అధిపతులూ, వాళ్లతోపాటు డాలు, ఈటె పట్టుకొన్నవాళ్ళు ముప్ఫై ఏడువేలమంది.  ౩౫ దానీయుల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఇరవై ఎనిమిదివేల ఆరువందలమంది. 
 ౩౬ ఆషేరీయుల్లో యుద్ధ ప్రావీణ్యం కలిగి, యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు నలభై వేలమంది.  ౩౭ ఇంకా యొర్దాను నది అవతల ఉండే రూబేనీయుల్లో గాదీయుల్లో మనష్షేవాళ్ళల్లో సగం మంది, అన్ని రకాల ఆయుధాలు ధరించిన యుద్ధశూరులైన ఈ యోధులందరూ హృదయంలో దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాలన్న కోరిక కలిగి ఉండి ఆయుధాలు ధరించి హెబ్రోనుకు వచ్చారు. 
 ౩౮ ఇశ్రాయేలులో మిగిలిన వాళ్ళందరూ ఏక మనస్సుతో దావీదును రాజుగా చేసుకోవాలని కోరుకున్నారు.  ౩౯ వాళ్ళ సహోదరులు వాళ్ళ కోసం భోజనపదార్ధాలు సిద్ధం చేసినప్పుడు, వాళ్ళు దావీదుతో కలిసి అక్కడ మూడు రోజులుండి అన్నపానాలు పుచ్చుకుంటూ ఉన్నారు. 
 ౪౦ ఇశ్రాయేలీయులకు సంతోషం కలిగింది. ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి పొలిమేరల వరకూ వారి సంబంధులు గాడిదల మీద, ఒంటెల మీద, కంచర గాడిదల మీద, ఎద్దుల మీద ఆహారం, పిండి వంటలు, అంజూర పళ్ళ ముద్దలు, ఎండిన ద్రాక్షపళ్ళ గెలలు, ద్రాక్షామధురసం, నూనె, గొర్రెలు, పశువులు, విస్తారంగా తీసుకొచ్చారు.