౨౬
 ౧ పదకొండో సంవత్సరం నెలలో మొదటి రోజు యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు.  ౨  “నరపుత్రుడా, తూరు యెరూషలేము గురించి ‘ఆహా’ అంటూ ‘ప్రజల ప్రాకారాలు పడిపోయాయి, ఆమె నావైపు తిరిగింది. ఆమె పాడైపోయినందువలన మేము వర్దిల్లుతాం’ అని చెప్పాడు.” 
 ౩ కాబట్టి యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “తూరూ, నేను నీకు విరోధిని. సముద్రం దాని అలలను పైకి తెచ్చే విధంగా నేను అనేక ప్రజలను నీ మీదికి రప్పిస్తాను.  ౪ వారు వచ్చి తూరు ప్రాకారాలను కూల్చి దాని కోటలను పడగొడతారు. నేను దాని శిథిలాలను తుడిచివేస్తాను. వట్టి బండ మాత్రమే మిగులుతుంది. 
 ౫ ఆమె సముద్రం ఒడ్డున వలలు ఆరబెట్టుకునే చోటవుతుంది. ఈ విషయం చెప్పింది నేనే.” ఇదే యెహోవా ప్రభువు సందేశం. “ఆమె ఇతర రాజ్యాలకు దోపిడీ అవుతుంది.  ౬ బయటి పొలాల్లో ఉన్న దాని కూతుళ్ళు కత్తి పాలవుతారు. అప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.” 
 ౭ యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “అత్యంత శక్తివంతుడైన బబులోనురాజు నెబుకద్నెజరును నేను తూరు పట్టణం మీదికి రప్పిస్తున్నాను. అతడు గుర్రాలతో రథాలతో రౌతులతో మహా సైన్యంతో వస్తున్నాడు.  ౮ అతడు బయటి పొలాల్లోని నీ కూతుళ్ళను కత్తి పాలు చేస్తాడు. నీ కెదురుగా బురుజులు కట్టించి మట్టి దిబ్బలు వేయించి నీ కెదురుగా డాళ్ళను ఎత్తుతాడు. 
 ౯ అతడు నీ ప్రాకారాలను పడగొట్టడానికి యంత్రాలు వాడతాడు. అతని ఆయుధాలు నీ కోటలను కూలుస్తాయి.  ౧౦ అతనికి ఉన్నఅనేక గుర్రాలు రేపిన దుమ్ము నిన్ను కప్పేస్తుంది! కూలిపోయిన పట్టణ గోడల గుండా ద్వారాల గుండా అతడు వచ్చినప్పుడు గుర్రాలు, రథ చక్రాల శబ్దాలకు నీ ప్రాకారాలు కంపిస్తాయి.  ౧౧ అతడు తన గుర్రాల డెక్కలతో నీ వీధులన్నీ అణగదొక్కేస్తాడు. నీ ప్రజలను కత్తితో నరికేస్తాడు. నీ బలమైన స్తంభాలు నేల కూలుతాయి. 
 ౧౨ ఈ విధంగా వాళ్ళు నీ ఐశ్వర్యాన్ని దోచుకుంటారు. నీ వ్యాపార సరుకులను కొల్లగొట్టుకుపోతారు. నీ గోడలు కూలుస్తారు. నీ విలాస భవనాలను పాడుచేస్తారు. నీ రాళ్లనూ నీ కలపనూ మట్టినీ నీళ్లలో ముంచివేస్తారు.  ౧౩ నేను నీ సంగీతాలను మాన్పిస్తాను. నీ సితారా నాదం ఇక వినబడదు.  ౧౪ నిన్ను వట్టి బండగా చేస్తాను. నీవు వలలు ఆరబెట్టే చోటు అవుతావు. నిన్ను మళ్ళీ కట్టడం ఎన్నటికీ జరగదు. ఈ విషయం చెప్పింది నేనే.” ఇదే యెహోవా ప్రభువు సందేశం! 
 ౧౫ తూరు గురించి యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “నువ్వు పతనమయ్యేటప్పుడు, నీ మధ్య జరిగే భయంకరమైన హత్యల్లో గాయపడ్డ వాళ్ళ కేకల శబ్దానికి ద్వీపాలు వణికిపోవా?  ౧౬ సముద్రపు అధిపతులంతా తమ సింహాసనాల మీద నుంచి దిగి, తమ రాజ వస్త్రాలనూ రంగురంగుల బట్టలనూ తీసి వేస్తారు. వాళ్ళు భయాన్ని కప్పుకుంటారు. వాళ్ళు నేల మీద కూర్చుని గడగడ వణకుతూ నీ గురించి భయాందోళన చెందుతారు. 
 ౧౭ వారు నీ గురించి శోకగీతం ఎత్తి ఇలా అంటారు. 
నావికులు నివసిస్తున్న నువ్వు ఎలా నాశనమయ్యావు! 
పేరుగాంచిన ఎంతో గొప్ప పట్టణం - ఇప్పుడు సముద్రం పాలయింది. 
నువ్వూ, నీ పురవాసులూ సముద్రంలో బలవంతులు. 
నువ్వంటే సముద్ర నివాసులందరికీ భయం. 
 ౧౮ ఇప్పుడు నువ్వు కూలిన ఈ దినాన తీరప్రాంతాలు వణుకుతున్నాయి. 
నువ్వు మునిగిపోవడం బట్టి తీర ప్రాంతాలు భయంతో కంపించిపోయాయి. 
 ౧౯ యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, నేను నిన్ను పాడుచేసి నిర్జనమైన పట్టణంగా చేసేటప్పుడు మహా సముద్రం నిన్ను ముంచివేసేలా నీ మీదికి అగాధ జలాన్ని రప్పిస్తాను.  ౨౦ పురాతన దినాల్లో మృత్యులోకంలోకి దిగిపోయినవారి దగ్గర నువ్వుండేలా చేస్తాను. పూర్వకాలంలో పాడైన స్థలాల్లో భూమి కిందున్న భాగాల్లో, అగాధంలోకి దిగిపోయిన వారితో పాటు నువ్వుండేలా చేస్తాను. దీనంతటి బట్టి సజీవులు నివసించే చోటికి నువ్వు తిరిగి రావు.  ౨౧ నీ మీదికి విపత్తు తెస్తాను. నువ్వు లేకుండా పోతావు. ఎంత వెతికినా నీవెన్నటికీ కనిపించవు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.