తృతీయ పరిచ్ఛేదము 
 ౭౩
ఆసాపు కీర్తన 
 ౧ ఇశ్రాయేలు పట్ల, శుద్ధహృదయం గలవారి పట్ల దేవుడు నిజంగా దయ గలవాడు. 
 ౨ నా పాదాలు కొద్దిలో జారిపోయేవి. నా అడుగులు దాదాపుగా జారి పోయాయి. 
 ౩ భక్తిహీనులు క్షేమంగా ఉండడం చూసి వారి గర్వాన్ని చూసి నేను అసూయపడ్డాను. 
 ౪ మరణ సమయంలో కూడా వారికి యాతన అనిపించదు. వారు పుష్టిగా ఉన్నారు. 
 ౫ ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు వచ్చే విపత్తులు వారికి రావు. 
 ౬ కాబట్టి గర్వం వారి మెడ చుట్టూ కంఠహారం లాగా ఉంది. దుర్మార్గతను వారు వస్త్రంలాగా ధరిస్తారు. 
 ౭ వారి కళ్ళు కొవ్వు పట్టి ఉబ్బి ఉన్నాయి. దురాలోచనలు వారి హృదయంలోనుండి బయటికి వస్తున్నాయి. 
 ౮ వారు ఎగతాళి చేస్తారు. పొగరుబోతు మాటలు పలుకుతారు. గర్వంగా గొప్పలు చెప్పుకుంటారు. 
 ౯ వారి మాటలు దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. వారి నాలుకతో భూమి అంతటినీ చుట్టి వస్తారు. 
 ౧౦ కాబట్టి దేవుని ప్రజలు వారి పక్షం చేరతారు. వారి మాటలను మంచినీళ్ళు తాగినట్టు తాగుతారు. 
 ౧౧ దేవునికి ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఏమి జరుగుతూ ఉందో ఆయనకి అవగాహన ఉందా? అని వారనుకుంటారు. 
 ౧౨ గమనించండి. వారు దుర్మార్గులు. మరింత డబ్బు సంపాదిస్తూ విచ్చలవిడిగా ఉంటారు. 
 ౧౩ నా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడం వ్యర్థమే. నా చేతులు కడుక్కుని నిర్దోషంగా ఉండడం వ్యర్థమే. 
 ౧౪ రోజంతా నాకు బాధ కలుగుతూ ఉంది. ప్రతి ఉదయం నేను శిక్షకు గురవుతున్నాను. 
 ౧౫ ఇలాటి మాటలు నేను చెబుతాను అని నేను అన్నట్టయితే నేను ఈ తరంలోని నీ పిల్లలను మోసం చేసినట్టే. 
 ౧౬ అయినా దీన్ని గురించి ఆలోచించినప్పుడు అది నాకు చాలా కష్టసాధ్యం అనిపించింది. 
 ౧౭ నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్లి ధ్యానించినప్పుడు వారి గతి ఏమిటో గ్రహించ గలిగాను. 
 ౧౮ నువ్వు వారిని కాలుజారే స్థలంలో ఉంచావు. నువ్వు వారిని పడదోసినప్పుడు వారు నశిస్తారు. 
 ౧౯ ఒక్క క్షణంలో వారు అంతమైపోతారు. విపరీతమైన భయంతో నశించిపోతారు. 
 ౨౦ నిద్ర మేలుకుని తన కల మరచిపోయినట్టు ప్రభూ, నువ్వు మేలుకుని వారి ఉనికి లేకుండా చేస్తావు. 
 ౨౧ నా హృదయంలో దుఃఖం ఉంది. నా అంతరంగంలో నేను గాయపడ్డాను. 
 ౨౨ అప్పుడు నేను తెలివి తక్కువగా ఆలోచించాను. నీ సన్నిధిలో మృగం వంటి వాడుగా ఉన్నాను. 
 ౨౩ అయినా నేను నిరంతరం నీతో ఉన్నాను. నువ్వు నా కుడిచెయ్యి పట్టుకుని ఉన్నావు. 
 ౨౪ నీ సలహాలతో నన్ను నడిపిస్తావు. తరువాత నన్ను మహిమలో చేర్చుకుంటావు. 
 ౨౫ పరలోకంలో నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వు నాకుండగా ఈ లోకంలో నాకింకేమీ అక్కరలేదు. 
 ౨౬ నా శరీరం, నా హృదయం క్షీణించిపోయినా దేవుడు ఎప్పుడూ నా హృదయానికి బలమైన దుర్గంగా ఉన్నాడు. 
 ౨౭ నీకు దూరంగా జరిగేవారు నశించిపోతారు. నీకు అపనమ్మకంగా ఉన్నవారందరినీ నువ్వు నాశనం చేస్తావు. 
 ౨౮ నాకు మాత్రం కావలసింది దేవునికి దగ్గరగా ఉండడమే. యెహోవాను నా ఆశ్రయంగా చేసుకున్నాను. నీ కార్యాలన్నిటినీ నేను ప్రచారం చేస్తాను.