33
యూదా రాజుగా మనష్షే
మనష్షే యూదా రాజయ్యేనాటికి పన్నెండు సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు ఏబైయైదు సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. యెహోవా దృష్టికి చెడ్డవైన పనులన్నీ మనష్షే చేశాడు. అన్యదేశాల వారి భయంకరమైన, పాప భూయిష్టమైన ఆచారాలన్నిటినీ అతడు అనుసరించాడు. ఆ రాజ్యాల వారిని ఇశ్రాయేలీయుల ఎదుటనుండి యెహోవా బయటకు వెడల గొట్టినాడు. తన తండ్రి హిజ్కియా తొలగించిన ఉన్నత స్థలాలన్నీ మనష్షే మళ్లీ నిర్మించాడు. బయలు దేవతలకు పూజా పీఠాలను, అషేరా దేవతా స్తంభాలను మనష్షే నిర్మించాడు. నక్షత్ర మండలాలకు ప్రణమిల్ల, వాటిని అతడు ఆరాధించాడు. యెహోవా ఆలయంలో బూటకపు దేవతలకు మనష్షే బలిపీఠాలు నిర్మించాడు. కాని “నా నామము యెరూషలేములో శాశ్వతంగా వుంటుంది” అని యెహోవా తన ఆలయ విషయంలో చెప్పియున్నాడు. రెండు ఆలయ ఖాళీ స్థలాలలోను ప్రతి నక్షత్ర మండలానికి ఒక్కొక్కటి చొప్పున మనష్షే బలిపీఠాలను నిర్మించాడు. బెన్‌హిన్నోము లోయలో* బెన్‌హిన్నోము లోయలో బెన్‌హిన్నోము లోయకే తరువాత గేహన్న అని పేరు వచ్చింది. ఇది యెరూషలేముకు దక్షిణభాగన వున్నది. చాలా మంది పసిపిల్లలను, చిన్న పిల్లలను అన్యదేశాల బూటకపు దేవతలకు బలి నిమిత్తం లోయలో అగ్నిలో నడిపించేవారు. మనష్షే తన స్వంత పిల్లలను కూడ దేవతలకు బలియిచ్చాడు. మనష్షే భవిష్యత్తును తెలిసికోవటానికి మంత్రతంత్ర విద్యలను ఆశ్రయించి, సోది చెప్పు వారిని, చిల్లంగి వాండ్రను సంప్రదించాడు. కర్ణపిశాచి విద్యలను పాటించే వారిని సోదిచెప్పు వారిని ప్రోత్సహించి వారి సలహాలు తీసికొన్నాడు. దేవుని దృష్టిలో చాలా హేయమైన పనులు చేశాడు. మనష్షే పాపాలు యెహోవాకు కోపం వచ్చేటట్లు చేశాయి. అతడు ఒక దేవతా విగ్రహాన్ని కూడ చేయించి దానిని ఆలయంలో నెలకొల్పాడు. ఈ ఆలయాన్ని గురించి యెహోవా దావీదుకు అతని కుమారుడు. సొలొమోనుకు యిలా చెప్పినాడు: “ఈ ఆలయంలోను, యెరూషలేములోను నా నామమును స్థిరంగా ప్రతిష్టించుతాను. ఇశ్రాయేలు కుటుంబాల వారుంటున్న స్థానములన్నిటిలోను నేను యెరూషలేమును ఎంపిక చేసికొన్నాను. ఇశ్రాయేలీయుల పూర్వీకులకు యివ్వడానికి నిశ్చయించిన ఈ రాజ్యంనుండి మరెన్నడూ నేను వారిని బయటకు వెళ్ల గొట్టను. కాని వారికి నేను ఆజ్ఞాపించిన విషయాలన్నిటినీ వారు తప్పక పాటించాలి. ఇశ్రాయేలు ప్రజలకు అందజేయమని నేను మోషేకు ఇచ్చిన ధర్మాశాస్త్రాన్ని, నియమ నిబంధనలను, ఆజ్ఞలను వారు తప్పక అనుపరించాలి.”
యూదా ప్రజలను, యెరూషలేము వాసులను తప్పుడు పనులు చేయటానికి మనష్షే ప్రోత్సహించాడు. ఇశ్రాయేలీయుల ముందు నుండి యెహోవా చేత బలవంతంగా వెళ్లగొట్టబడి నాశనం గావింపబడిన వారి కంటె వారు ఎక్కువ పాపాలు చేశారు.
10 యెహోవా మనష్షేతోను, అతని ప్రజలతోను మాట్లాడినాడుగాని, వారు దేవుని మాట వినటానికి నిరాకరించారు. 11 అందువల్ల అష్షూరు రాజు సైన్యాధికారులను యూదాపై దండెత్తటానికి యెహోవా రప్పించాడు. ఆ అధికారులు మనష్షేను పట్టుకుని, అతనికి సంకెళ్లు వేశారు. మనష్షే చేతులకు వారు ఇత్తడి గొలుసులు తగిలించారు. వారతనిని బందీగా బబులోనుకు పట్టుకుపోయారు.
12 మనష్షే చాలా బాధ అనుభవించాడు. ఆ సమయంలో తన దేవుడగు యెహోవాను వేడుకున్నాడు. తన పితరుల దేవుని ముందర మనష్షే మిక్కిలి విధేయుడైనాడు 13 మనష్షే దేవునికి ప్రార్థన చేసి, తనకు సహాయపడమని వేడుకున్నాడు. యెహోవా మనష్షే మనవి ఆలకించి, అతని విషయంలో బాధపడినాడు. యెహోవా అతనిని యెరూషలేముకు తిరిగి వచ్చి తన సింహాసనాన్ని మళ్లీ అలకరించేలా చేసినాడు. యెహోవాయే నిజమైన దేవుడని మనష్షే అప్పుడు తెలిసికొన్నాడు.
14 ఇది జరిగిన పిమ్మట మనష్షే, దావీదు నగరానికి బయట ఒక గోడ కట్టించాడు. (కిద్రోను) లోయలో మత్స్యద్వారం ముంగిట నున్న గిహోను నీటి బుగ్గకు పశ్చిమంగా ఈ గోడవుంది. మనష్షే ఈ గోడను ఓపెలు కొండ చుట్టూ కట్టించాడు. ఈ గోడ చాలా ఎత్తుగా కట్టించాడు. పిమ్మట యూదాలో వున్న కోటలన్నిటిలో అతడు సైనికాధికారులను నియమించాడు. 15 ఇతర దేవుళ్ల విగ్రహాలన్నిటినీ మనష్షే తీసి పారవేశాడు. ఆలయంలో వున్న విగ్రహాన్ని అతడు తీసివేశాడు. యెరూషలేములో ఆలయ ప్రాకారం మీద అతను నెలకొల్పిన బలిపీఠాలన్నీ తొలగించాడు. ఆ బలిపీఠాలన్నిటినీ యెరూషలేము నగరంనుండి తీసి బయట పారవేశాడు. 16 పిమ్మట అతడు యెహోవా బలిపీఠాన్ని ప్రతిష్ఠించి దాని మీద సమాధానబలులు, కృతజ్ఞతార్పణలు సమర్పించాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఘనంగా ఆరాధించుమని మనష్షే యూదా ప్రజలందరికి ఆజ్ఞాపించాడు. 17 ప్రజలు ఉన్నత స్థలాలలో బలులు యివ్వటం కొనసాగించారు గాని వారు అవన్నీ వారి దేవుడగు యెహోవాకే అర్పించారు.
18 మనష్షే చేసిన ఇతర విషయాలు, దేవునికి అతడు చేసిన ప్రార్థన, ఇశ్రాయేలు దేవుని తరపున దీర్ఘదర్శలు అతనిని గురించి చెప్పిన విషయాలు అన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడినాయి. 19 మనష్షే దేవునికి చేసిన ప్రార్థన, దేవుడు దానిని విన్న విధము, అది విని దేవుడు బాధపడిన విషయములు దీర్ఘదర్శులు రచించిన గ్రంథంలో వ్రాయబడినాయి. మనష్షే తనకు తాను విధేయుడు కాక పూర్వం అతడు చేసిన పాపాలు, పొరపాట్లు, అతను ఎక్కడెక్కడ ఇతర దేవుళ్లకు ఉన్నత స్థలాలు, అషేరా దేవతా స్తంభాలు నిలిపిన విషయాలు దీర్ఘదర్శుల గ్రంథంలో రాయబడ్డాయి. 20 మనష్షే చనిపోయినప్పుడు అతనిని తన పూర్వీకులతోపాటు సమాధిచేశారు. ప్రజలతనిని తన స్వంత రాజ గృహంలోనే సమాధి చేశారు. మనష్షే స్థానంలో ఆమోను కొత్తగా రాజయ్యాడు. ఆమోను మనష్షే కుమారుడు.
యూదా రాజుగా ఆమోను
21 యూదాకు రాజయ్యేనాటికి ఆమోను ఇరువదిరెండేండ్లవాడు. యెరూషలేములో అతడు రెండేండ్లపాటు రాజుగా ఉన్నాడు. 22 దేవుని సన్నిధిలో ఆమోను అన్నీ నీచకార్యాలే చేశాడు. తన తండ్రి మనష్షే చేసిన విధంగా, దేవుడు అతని నుండి ఆశించిన పవిత్ర కార్యాలేవీ ఆమోను చేయలేదు. తన తండ్రి మనష్షే చేయించి వుంచిన చెక్కడపు (నగిషీ) బొమ్మల విగ్రహాలకు ఆమోను బలులు అర్పించాడు. ఆమోను ఆ విగ్రహాలను ఆరాధించాడు. 23 తన తండ్రి మనష్షే పరివర్తన చెందినట్లు, ఆమోను దేవుని ముందు వీధేయుడై మెలగలేదు. పైగా ఆమోను రోజు రోజుకు మరింత పాపం చేయసాగాడు. 24 ఆమోను సేవకులు అతనిపై కుట్రపన్నారు. వారు ఆమోనును అతని స్వంత ఇంటిలోనే హత్యచేశారు. 25 కాని యూదా ప్రజలు రాజైన ఆమోనుపై కుట్ర పన్నిన సేవకులందరీని చంపివేశారు. తరువాత ప్రజలు కొత్త రాజుగా యోషీయాను ఎంపిక చేశారు. యోషీయా ఆమోను కుమారుడు.

*33:6: బెన్‌హిన్నోము లోయలో బెన్‌హిన్నోము లోయకే తరువాత గేహన్న అని పేరు వచ్చింది. ఇది యెరూషలేముకు దక్షిణభాగన వున్నది. చాలా మంది పసిపిల్లలను, చిన్న పిల్లలను అన్యదేశాల బూటకపు దేవతలకు బలి నిమిత్తం లోయలో అగ్నిలో నడిపించేవారు.