34
మోషే మరణించటం
మోషే మోయాబు పల్లపు ప్రాంతాల నుండి యెరికో దాటి నెబో కొండ మీద పిస్గా శిఖరం మీదికి వెళ్లాడు. గిలాదునుండి దానువరకు దేశం మొత్తం యెహోవా మోషేకు చూపించాడు. ఎఫ్రాయిము, మనష్షేల దేశం అంతా, నఫ్తాలీ అంతా యెహోవా అతనికి చూపించాడు. యూదా దేశం మధ్యదరా సముద్రం వరకు ఆయన అతనికి చూపించాడు. నెగెవు ప్రాంతాన్ని, సోయెరు నుండి ఈతచెట్ల పట్టణం యెరికోకు పోయే లోయ అంతా మోషేకు యెహోవా చూపించాడు. “అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను వాగ్దానంచేసిన దేశం యిదే. ‘మీ సంతతివారికి ఈ దేశం నేను యిస్తాను’ అని వారితో నేను చెప్పాను. నిన్ను ఆ దేశం చూడ నిచ్చాను, నీవు అక్కడికి వెళ్లలేవు” అని మోషేతో యెహోవా చెప్పాడు.
అప్పుడు యెహోవా సేవకుడు మోషే అక్కడ మోయాబు దేశములో చనిపోయాడు. ఇలా జరుగుతుందని యోహావా మోషేతో ముందే చెప్పాడు. బెత్పెయోరు అవతల మోయాబు దేశంలోని లోయలో యెహోవా మోషేను పాతి పెట్టాడు. అయితే మోషే సమాధి ఎక్కడ ఉందో ఈ రోజువరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు అతని వయస్సు 120 సంవత్సరాలు. అతని కళ్లు మసక కాలేదు. అతడు ఇంకా బలంగానే ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మోయాబు పల్లపు ప్రాంతాల్లో 30 రోజుల పాటు మోషే కోసం ఏడ్చారు. ఇది పూర్తి సంతాప దినాల సమయము.
యెహోషువ కొత్త నాయకుడవటం
అప్పుడు నూను కుమారుడైన యెహోషువ మీద మోషే చేతులు పెట్టిన కారణంగా యెహోషువ జ్ఞానాత్మతో పూర్తిగా నిండిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ మాట విన్నారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్టు వారు చేసారు.
10 కాని ఆ సమయమునుండి మళ్లీ మోషేవంటి ప్రవక్త జన్మించలేదు. యెహోవా దేవునికి మోషే ముఖాముఖిగా తెలుసు. 11 ఈజిప్టు దేశంలో యెహోవా చేత పంపబడి మోషే చేసిన అద్భుతాలు, మహాత్కార్యాలు, ఏ ప్రవక్తా ఎన్నడూ చేయలేదు. ఆ అద్భుతాలు, మహాత్కార్యాలు ఈజిప్టులో ఫరోకు, అతని సేవకులందరికీ, ప్రజలందరికి చూపించబడ్డాయి. 12 మోషే చేయగా ఇశ్రాయేలు ప్రజలంతా చూసిన ఆ శక్తివంతమైన ఆశ్చర్యకార్యాలు ఏ ప్రవక్తా ఎన్నడూ చేయలేదు.