6
 1 అందుకు యెహోవా, “ఫరోకు నేను ఏమి చేస్తానో నీవు ఇప్పుడు చూస్తావు. అతని మీద నేను నా మహాశక్తిని ప్రయోగిస్తాను. దానితో అతడు నా ప్రజలను వెళ్లనిస్తాడు. వారు వెళ్లిపోవడానికి అతడు ఎంత ఇష్టపడతాడంటే, అతడే వారిని వెళ్లిపొమ్మని బలవంతం చేస్తాడు” అని మోషేతో చెప్పాడు. 
 2 మోషేతో దేవుడు ఇలా చెప్పాడు,  3 “యెహోవాను నేనే. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబలకు నేను ప్రత్యక్షమయ్యాను. వాళ్లు, (ఎల్షద్దయి) సర్వశక్తిగల దేవుడు అని నన్ను పిలిచారు. నా పేరు యెహోవా అని వారికి తెలియలేదు.  4 వారితో నేను ఒక ఒడంబడిక చేసాను. కనాను దేశం వారికి ఇస్తానని వాగ్దానం చేసాను. వారు ఆ దేశంలో నివసించారు గాని అది వారి స్వంత దేశం కాదు.  5 ఇప్పుడు ఇశ్రాయేలు వాళ్లకు ఉన్న కష్టాలు నాకు తెలుసు. వారు ఈజిప్టుకు బానిసలుగా ఉన్నారని నాకు తెలుసు. నా ఒడంబడిక కూడా నాకు జ్ఞాపకం ఉంది.  6 కనుక నేను వాళ్లతో నీవు ఇలా చెప్పమన్నట్టు ప్రజలతో చెప్పు. ‘నేనే యెహోవాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను. నేను మిమ్మల్ని స్వతంత్రుల్నిగా చేస్తాను. ఈజిప్టు వాళ్లకు మీరు బానిసలుగా ఉండరు. నేను నా మహాశక్తిని ప్రయోగించి మహా భయంకర శిక్షను ఈజిప్టు వారి మీదికి రప్పిస్తాను. అప్పుడు మిమ్మల్ని నేను రక్షిస్తాను.  7 మీరు నా ప్రజలుగా ఉంటారు. నేనే మీ దేవుడిగా ఉంటాను. నేనే యెహోవాను, మీ దేవుడనని, ఈజిప్టునుండి నేనే మిమ్మల్ని విడిపించానని మీరు తెలుసుకొంటారు.  8 అబ్రాహాము, ఇస్సాకు, యాకోబలకు నేను ఒక గొప్ప వాగ్దానం చేసాను. అందుచేత నేనే మిమ్మల్ని ఆ దేశానికి నడిపిస్తాను. ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను. అది మీదే అవుతుంది. నేను యెహోవాను.’ ” 
 9 అందుచేత మోషే ఇదంతా ఇశ్రాయేలు వాళ్లతో చెప్పాడు. అయితే, ప్రజలు పనిలో చాలా కష్టపడుచున్నందుచేత మోషేను వారు సహించలేదు. అతని మాట వారు వినలేదు. 
 10 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు:  11 “ఇశ్రాయేలు ప్రజల్ని తన దేశంనుండి తప్పక వెళ్లిపోనివ్వాలని ఫరో దగ్గరకు వెళ్లి చెప్పు.” 
 12 అయితే మోషే, “ఇశ్రాయేలు ప్రజలే నా మాట వినరు. అలాంటప్పుడు ఫరో అంతకంటె వినడు. అసలే నాకు మాట్లాడటం చేతకాదు.”q అని అన్నాడు. 
 13 కాని మోషే, అహరోనులతో యెహోవా మాట్లాడాడు. వారు వెళ్లి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలని యెహోవా వారికి ఆజ్ఞాపించాడు. ఫరో దగ్గరికి వెళ్లి అతనితో కూడ మాట్లాడాలని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్టు నుండి బయటకు నడిపించుమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. 
ఇశ్రాయేలీయుల కుటుంబాల్లో కొన్ని 
 14 ఇశ్రాయేలు కుటుంబాల నాయకుల పేర్లు ఇవి: 
ఇశ్రాయేలు జ్యేష్ఠపుత్రుడు రూబేనుకు హనోకు, పల్లు, హెస్రోన్, కర్మి అనే నలుగురు కుమారులు గలరు. 
 15 యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, షావూలు అనువారు షిమ్యోను కుమారులు. (షావూలు కనానీ స్త్రీ ద్వారా పుట్టిన కుమారుడు). 
 16 లేవీ 137 సంవత్సరాలు బతికాడు. గెర్షోను, కహాతు, మెరారీ అనువారు లేవీ కుమారులు. 
 17 గెర్షోను కుమారులు లిబ్నీ, షిమీ. 
 18 కహాతు 133 సంవత్సరాలు బ్రతికాడు. అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనువారు కహాతు కుమారులు. 
 19 మహలి, ముషి అను వారు మెరారీ కుమారులు. 
ఈ కుటుంబాలన్ని ఇశ్రాయేలు కుమారుడు లేవీ సంతానం. 
 20 అమ్రాము 137 సంవత్సరాలు బతికాడు. అమ్రాము తన తండ్రి సోదరి యోకెబెదును వివాహం చేసుకొన్నాడు. ఈ అమ్రాము కుమారులే మోషే, అహరోను. 
 21 కోరహు, నెపెగు, జిఖ్రీ అనువారు ఇస్హారు కుమారులు. 
 22 మిషాయేలు, ఎల్జఫను, సిత్రీ అనువారు ఉజ్జీయేలు కుమారులు. 
 23 అహరోను ఎలీషెబను వివాహం చేసుకొన్నాడు. (ఎలీషెబ అమ్మినాదాబు కుమార్తె. నయసోను సోదరి) అహరోను ఎలీషెబలకు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులు పుట్టారు. 
 24 కోరహు కుమారులు అంటే, అస్సీరు, ఎల్కానా, అబియాసాపు. 
 25 అహరోను కుమారుడైన ఎలియాజరు పుతీయేలు కుమార్తెను పెండ్లాడాడు, వాళ్లు ఫీనెహాసుకు జన్మనిచ్చారు. 
ఈ మనుష్యులంతా ఇశ్రాయేలు కుమారుడైన లేవీ సంతానం. 
 26 అహరోను, మోషే ఈ వంశానికి చెందిన వాళ్లు, “ఇశ్రాయేలు ప్రజల వంశాలను నడిపించండి” అని యెహోవా చెప్పింది వీళ్లకే.  27 ఈజిప్టు రాజైన ఫరోతో మాట్లాడిన వాళ్లు అహరోను, మోషే, ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్టు విడిచి పెట్టి వెళ్లనివ్వాల్సిందిగా ఫరోతో చెప్పింది వీళ్లే. 
దేవుడు మళ్లీ మోషేను పిల్చాడు 
 28 ఈజిప్టు దేశంలో దేవుడు మోషేతో మాట్లాడాడు.  29 “నేను యెహోవాను నేను నీతో చెప్పిందంతా ఈజిప్టు రాజుతో చెప్పు” అన్నాడు. 
 30 “కానీ, నేను చక్కగా మాట్లాడలేను గదా! రాజు నా మాట వినడు” అని జవాబిచ్చాడు మోషే.