11
“మాదీయుడైన దర్యావేషు రాజుగా ఉన్న మొదటి సంవత్సరంలో, నేను మిఖాయేలుకు తోడుగా నిలుబడ్డాను.
“దానియేలూ! ఇప్పుడు నేను నీకు నిజం వివరిస్తాను, మరి ముగ్గురు రాజులు పారసీకలో రాజ్యం చేస్తారు. తర్వాత నాలుగవ రాజు వస్తాడు. తనకంటె ముందున్న ఇతర పారసీక రాజులకంటె, ఆ నాలుగవ రాజు ఐశ్వర్యవంతుడై, గొప్పవాడై వుంటాడు. అతడు గ్రీకు రాజ్యానికి విరోధంగా అందర్ని పురికొల్పుతాడు. తర్వాత శక్తిమంతుడైన గొప్పరాజు ఒకడు వస్తాడు. అతను ఎక్కువ అధికారం కలిగి తన ఇష్టానుసారంగా చేస్తాడు. అతడు అభివృద్ధి పొందుచూ ఉండగా అతని రాజ్యము ముక్కలుగా విరిగి ఆకాశపు నాలుగు దిక్కులకు విభాగమవుతుంది. అతని రాజ్యం అతని పిల్లలకు గాని మనుమలకి గాని విభాగితం కాదు. అతని రాజ్యానికి అతను పాలించిన నాటి శక్తి వుండదు. ఎందుకనగా అతని రాజ్యం లాగివేయబడి ఇతరులకు ఇవ్వబడుతుంది.
“దక్షిణ రాజు బలవంతుడవుతాడు. కాని అతని రాజుల్లో ఒకడు అతనికంటె బలవంతుడౌతాడు, మరియు ఇతని రాజ్యం గొప్పదవుతుంది.
“కొన్ని సంవత్సరాల తర్వాత, ఈ ఇద్దరు రాజులు ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. దక్షిణ రాజు యొక్క కుమారై ఉత్తర రాజు యొద్ద ఒప్పందం చేసు కోటానికి వస్తుంది. కాని ఆమె తన బలాన్ని నిలుపుకోదు. అతడు త న మాటను, బలాన్ని నిలుపుకోడు. కాని, ఆమెను, ఆమెను తెచ్చిన వారిని, ఆమెను కన్న వారిని, ఆమెను బలపరచిన వారిని, ఆ సమయాల్లో విడిచిపెడతారు.
“కాని ఆమె కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి దక్షిణ రాజు యొక్క స్థానం ఆక్రమించడానికి వస్తాడు. అతడు ఉత్తర రాజు సైన్యాలను ఎదిరించి ఆ రాజు యొక్క బలమైన దుర్గంలోకి ప్రవేశిస్తాడు. అతను యుద్ధం చేసి జయిస్తాడు. అతను దేవతా ప్రతిమల్ని, లోహ విగ్రహాల్ని, వెండి బంగారాలతో చేయబడిన విలువగల వస్తువుల్ని ఉజిప్టుకి తీసుకు వెళతాడు. ఆ తర్వాత అతను కొన్ని సంవత్సరాల పాటు ఉత్తర రాజును ఎదిరించడు. ఉత్తర రాజు రాజ్యాన్ని ఎదుర్కొని తర్వాత తన దేశానికి మరలిపోతాడు.
10 “ఉత్తర రాజు కుమారులు యుద్ధ సన్నద్ధులై ఒక పెద్ద పైన్యాన్ని సమకూర్చుతారు. ఆ సైన్యం ఆ ప్రదేశంగుండా గొప్ప ప్రవాహంవలె దక్షిణ రాజు యొక్క బలమైన దుర్గం వరకు యుద్ధం సాగిస్తుంది. 11 అప్పుడు దక్షిణ రాజు మహోగ్రడై ఉత్తర రాజుతో యుద్ధం చేస్తాడు. ఉత్తర రాజు పెద్ద సైన్యంతో ఎదిరిస్తాడు కాని ఆ సైన్యం దక్షిణ రాజు వశమవుతుంది. 12 ఉత్తర సైన్యం ఓడిపోయి తీసుకొని పోబడుతుంది. దక్షిణ రాజు గర్విష్ఠి అవుతాడు. ఉత్తర సైన్యంలో వేలాది సైనికుల్ని హతమార్చుతాడు. కాని అతని విజయం కొనసాగదు. 13 ఉత్తర రాజు మరో సైన్యం సమకూర్చు కుంటాడు. ఆ సైన్యం మొదటి సైన్యం కంటె చాలా పెద్దది. చాలా సంవత్సరాల తర్వాత, అతను ఈ పెద్ద సైన్యాన్ని చాలా ఆయుధాల్ని సిద్ధం చేసికొని యుద్ధానికి వెళతాడు.
14 “ఆ రోజుల్లో దక్షిణ రాజుకి చాలామంది వ్యతిరేకులై ఉంటారు. దర్శన నెరవేర్పుగా నీ ప్రజల్లో తిరుగుబాటుదారులు ఎదురు తిరుగుతారు గాని ఓడి పోతారు. 15 తర్వాత ఉత్తర రాజు వచ్చి గోడలకు ముట్టడి దిబ్బలు కట్టి ఒక దృఢమయిన నగరాన్ని ఆక్రమిస్తాడు. దక్షిణ సైన్యానికి మరల యుద్ధం చేయడానికి శక్తి ఉండదు. దక్షిణ సైన్యానికి చెందిన ఉత్తమ సైనికులు కూడా ఉత్తర సైన్యాన్ని ఆపలేక పోతారు.
16 “తన ఇష్టము వచ్చినట్లు ఉత్తర రాజు చేస్తాడు. ఎవ్వరూ అతనిని విరోధించలేరు. అతను అధికారం పొంది, సుందర దేశాన్ని అదుపులో ఉంచుకొంటాడు. మరిము అతనికి దాన్ని నాశనం చేసే శక్తికూడా ఉంటుంది. 17 ఉత్తర రాజు తన సర్వ సైనిక బలంతో వచ్చి దక్షిణ రాజులో ఒప్పందం చేసుకోటానికి నిర్ణయిస్తాడు. ఉత్తర రాజు దక్షిణ రాజుకు పెళ్లి చేసుకునేందుకు తన కుమార్తెలలో ఒకదానిని అనుమతిస్తాడు, ఎందుకంటే దక్షిణ రాజుని ఓడించాలని. కాని ఆ పథకాలు నెరవేరవు, అతనికి తోడ్పడవు.
18 “అప్పుడు ఉత్తర రాజు తన దృష్టిని సముద్ర తీరాననున్న దేశాల మీదికి మరల్చుతాడు, పెక్కు నగరాల్ని జయిస్తాడు. కాని తర్వాత ఒక సైన్యాధిపతి ఉత్తర రాజు యొక్క తిరుగుబాటుని, అతని గర్వాన్ని అణచి అతడు సిగ్గుచెందేలా చేస్తాడు.
19 “అది జరిగిన తర్వాత, ఉత్తర రాజు తన స్వదేశంలోని బలమైన దుర్గాలకు తిరిగి వెళతాడు. కాని అతను బలహీనుడై పతనం చెంది మరణము పాలవుతాడు.
20 “ఆ ఉత్తర రాజు తర్వాత మరో క్రొత్త పరిపాలకుడు వస్తాడు. ఆ పరిపాలకుడు పన్నులు వసూలు చేసే అధికారిని రాజ వైభవం కోసం డబ్బు సంపాదించటానికి పంపుతాడు. కాని కొన్ని సంవత్సరాలలోనే, ఆ పరిపాలకుడు కోపము వల్లగాని, యుద్ధమువల్లగాని కాకుండ నాశనం చేయబడతాడు.
21 “ఆ పరిపాలకుని తర్వాత అతి క్రూరుడు, ద్వేషింపబడినవాడు అయిన ఒక వ్యక్తి వస్తాడు. రాజ వంశానికి చెందినవాడనే గౌరవం వానికి ఉండదు. మాయోపాయముచేత అతతడు పరిపాలకుడవుతాడు. ప్రజలు నెమ్మదిగా ఉన్న సమయాన, అతడు రాజ్యముమీద దాడి చేస్తాడు. 22 ప్రవాహంలాంటి ఆ సైన్యాలు వాని ఎదుటనుండి తుడిచి వేయబడును. ఒప్పందం కుదుర్చుకున్న రాజు కూడా నశిస్తాడు. 23 ఆ రాజుతో ఒప్పందం కుదుర్చుకొన్న తర్వాత మోసంగా ప్రవర్తించి, కొద్ది మందితోనే అతడు అధికారాన్ని పొందుతాడు.
24 “సంవన్న దేశాలు నెమ్మదిగా ఉన్నప్పుడు, అతడు (క్రూరుడూ ద్వేషింపబడినవాడూ అయిన ఆ పరిపాలుకుడు) వాటిమీద దాడి చేస్తాడు. అతని తండ్రులుగాని, అతని పూర్వీకులుగాని చేయలేనిదాన్ని అతడు సాధిస్తాడు. దోపిడి, లూటి చేసి పొందిన సంపత్తును వాని అనుచరుల మధ్య పంచుతాడు. బలమైన కోటల్ని పడగొట్టడానికి కుట్ర చేస్తాడు, గాని అది ఒక కాలము వరకు మాత్రమే.
25 “దక్షిణ రాజుకు విరోధంగా గొప్ప సైన్యంతో తన బలాన్ని, ధైర్యాన్ని ఎక్కువ చేసుకొంటాడు. గొప్ప బలమైన సేనతో దక్షిణ రాజు యుద్ధానికి దిగుతాడు గాని, అతనికి వ్యతిరేకంగా శత్రువు పన్నిన పన్నాగాల వల్ల దక్షిణ రాజు ఓడిపోతాడు. 26 దక్షిణ రాజు భోజన పదార్థాలనుండి తినేవారే అతన్ని నాశనము చేయాలని ప్రయత్నిస్తారు. అతని సైన్యం ఓడించ బడుతుంది. యుద్ధంలో చాలామంది సైనికులు చంపబడుతారు. 27 ఆ రాజులిద్దరూ దురుద్దేశముతో ఒకే భోజన బల్లవద్ద కూర్చొని ఒకరికొకరు అబద్ధాలు చెప్పు కొంటారు. అందువల్ల వారిలో ఎవరికీ మంచి కలుగదు. ఎందుకంటే దేవుడు వారి అంతానికి ఒక కాలం నిర్ణయించాడు.
28 “ఉత్తర రాజు అధిక సంపదతో తన దేశానికి తిరిగి వెళతాడు. కాని, పవిత్ర ఒడంబడికకు విరుద్ధంగా అతను తన హృదయాన్ని మార్చుకొంటాడు. తన ఇష్టానుసారంగా జరిగిస్తూ అతడు స్వదేశానికి మరలి పోతాడు.
29 “నియమిత సమయాన, ఉత్తర రాజు దక్షిణ రాజు మీద మరల దాడి చేస్తాడు, కాని ఈ సారి, పూర్వంవలె అతడు గెలుపొందలేడు. 30 కిత్తీము నుండి ఓడలువచ్చి ఉత్తర రాజును ఎదిరిస్తాయి. ఆ ఓడలు రావటం చూసి. అతడు భయభ్రాంతుడవుతాడు. అప్పుడతను వెనుదిరిగి, పవిత్ర ఒడంబడిక పట్ల తన కోపాన్ని తీర్చుకొంటాడు. అతడు వెనక్కి తిరిగి పవిత్ర ఒడంబడికను విసర్జించే వాళ్ల మాట వింటాడు. 31 వానినుండి వచ్చిన సైన్యాలు కోటను, దేవాలయాన్ని అపవిత్ర పరచి, అనుదిన బలి అర్పణలను నిలుపు చేస్తాయి. వాళ్లు నాశనకరమైన ఆ అసహ్యమైన దాన్ని దేవాలయంలో నిలుపుతారు.
32 “ఉత్తర రాజు పవిత్ర ఒడంబడికను అతిక్రమించిన వాళ్లను (యూదులు) తన ఇచ్ఛకపు మాటలచేత దుష్టత్యానికి మళ్లించుతాడు. కాని తమ దేవుణ్ణి ఎరిగిన ప్రజలు స్థిరముగా నిలబడి అతనిని ఎదిరిస్తారు.
33 “కొన్ని దినాలపాటు వారు ఖడ్గంతోను, అగ్నితోను, చెరసాల బంధనతోను, దోపుడుతోను హింసించబడ్డ, వారిలో జ్ఞానవంతులైన వారు అనేకులను సంగతులు అర్థము చేసికొనేటట్లు చేస్తారు. 34 జ్ఞాన వంతులైన ఆ యూదులు హింసించబడ్డ తర్వాత, వారికి కొద్దిపాటి సహాయం లభిస్తుంది. అనేకులు వారికి వారే జ్ఞానులైన యూదులతో ముఖస్తుతి చేస్తూ కలిసి పోతారు. 35 నియమితమైన అంత్య కాలం ఇంకను రాలేదు. ఆ అంత్యకాలం వరకు జ్ఞానుల్లో కొందరు కూలుట ద్వారా మిగిలిన వారు శుద్ధిగాను, నిర్మలులుగాను, పరిశుద్ధులుగాను చేయ బడటానికి ఇలాగున జరుగుతుంది.
ఆత్మ ప్రశంస చేసుకునే రాజు
36 “ఉత్తర రాజు తన ఇష్టానుసారముగా చేస్తాడు. ప్రతి దేవతకు పైగా తనకు తానే హెచ్చించుకొంటూ, ఘన పరచుకొంటాడు. అంతేకాక, దేవాది దేవునికి విరోధంగా విచిత్రమైన విషయాలు మాట్లాడుతాడు. ఉగ్రత తీరే వరకు వాడు వర్ధిల్లుతాడు. ఏది నిర్ణయమైందో అది వానికి జరుగుతుంది.
37 “తన పూర్వీకుల పట్ల ఆ ఉత్తర రాజు శ్రద్ధ వహింపడు. స్త్రీల ఇష్ట దేవతల పట్ల కూడ లక్ష్యపెట్టడు. ఏ దేవుని గురించి అతడు లక్ష్యపెట్టడు. అన్ని దేవుళ్ల దేవతల కంటే తనను తాను హెచ్చించుకొంటాడు. 38 వీటన్నీటికి బదులుగా కోటల దేవతను గౌరవిస్తాడు. తన పూర్వీకులు ఎరుగని దేవతను బంగారు, వెండి, వెలగల రాళ్లు మరియు వెలగల బహుమానాలతో గౌరవిస్తాడు.
39 “ఆ ఉత్తర రాజు బలమైన కోటల మీదికి అన్యదేవుని సహాయంతో దాడి చేస్తాడు, తనను గుర్తించే వాళ్లను హెచ్చించి గౌరవిస్తాడు. వాళ్లను చాలా మంది ప్రజల మీద పరిపాలకులుగా ఉంచి, దేశాన్ని వెలకు విభాగిస్తాడు.
40 “అంత్యకాలంలో, దక్షిణ రాజు ఉత్తర రాజుతో యుద్ధం చేస్తాడు. ఉత్తర రాజు ఉగ్రుడై సుడిగాలి వలె దక్షిణ రాజు మీద రథాలు, గుర్రపు రౌతులు, అనేక ఓడలతో విరుచుకు పడుతాడు. అదే విధంగా దేశాల మీదికి ప్రవాహం వలె వెళతాడు. 41 అతడు మహిమాదేశం మీద కూడా దాడి చేస్తాడు. అనేక దేశాల్లో వేలాది మందిని పడగొడతాడు, కాని ఎదోము, మోయాబు, అమ్మోనీయల నాయకులు అతని చేతినుండి రక్షింపబడుతారు. 42 చాలా దేశాల్లో ఉత్తర రాజు తన అధికారాన్ని వ్యాపింప జేస్తాడు కాని ఈజిప్టు తప్పించుకోలేదు. 43 ఈజిప్టుకు చెందిన వెండి బంగారం సర్వ సంపదలకు అతడు అధిపతి అవుతాడు. లిబియావాళ్లు, కూషీయులు (ఇతియోపియా వాళ్లు) అతని ఎడల విధేయులై ఉంటారు. 44 కాని ఉత్తర రాజు తూర్పు, ఉత్తర దిశలనుంచి వచ్చిన సమాచారము తెలిసికొని. భయభ్రాంతుడై, మహోగ్రుడై చాలా మందిని సర్వ నాశనం చేయడానికి ముందుకు సాగుతాడు. 45 సుందరమైన పరిశుద్ధ పర్వతానికి* పరిశుద్ధ పర్వతం యెరూషలేము పర్వతంమీద నిర్మింప బడింది. సముద్రానికి మధ్య అతను రాజవైభవంగల గుడారాలు నెలకొల్పుతాడు. చివరికి అతడు నిస్సహాయుడై మరణిస్తాడు.

*11:45: పరిశుద్ధ పర్వతం యెరూషలేము పర్వతంమీద నిర్మింప బడింది.