4
ఆ కాలంలో ఏడుగురు స్త్రీలు ఒక్క మగవాణ్ణి పట్టుకొని, “మా స్వంత భోజనం మేముతింటాము, మా స్వంత బట్టలు మేము కట్టు కొంటాము, నీ పేరు మాత్రం మాకు పెట్టి, మా అవమానం తొలగించుము” అని చెబుతారు.
ఆ సమయంలో యెహోవా మొక్క (యూదా) చాలా అందంగా, గొప్పగా ఉంటుంది. అప్పటికి ఇంకా ఇశ్రాయేలులో జీవించి ఉండే ప్రజలు ఆ దేశంలో పండే వాటిని చూచి ఎంతో గర్విస్తారు. ఆ సమయంలో ఇంకా సీయోనులో, యెరూషలేములో జీవిస్తున్న ప్రజలు పరిశుద్ధ (ప్రత్యేక) ప్రజలు అని పిలువ బడతారు. ఒక ప్రత్యేక జాబితాలో పేర్లు ఉన్న ప్రజలందరికీ ఇలా జరుగుతుంది. బతికేందుకు అనుమతించబడిన ప్రజల జాబితా అది.
సీయోను స్త్రీల కల్మషాన్ని యెహోవా కడిగి వేస్తాడు. యెరూషలేములోని రక్తమంతా యెహోవా కడిగివేస్తాడు. దేవుడు న్యాయ ఆత్మను ప్రయోగించి, న్యాయంగా తీర్పు తీరుస్తాడు. మరియు ఆయన దహించే ఆత్మను ప్రయోగించి, సమస్తాన్నీ శుద్ధి చేస్తాడు. ఆయన తన ప్రజలతో ఉన్నట్టు ఆ సమయంలో దేవుడు రుజువు చేస్తాడు. పగలు పొగల మేఘాన్ని, దేవుడు చేస్తాడు. రాత్రి ప్రకాశించే అగ్ని జ్వాలను దేవుడు చేస్తాడు. ఇవి ప్రతి ఇంటిమీద, ఆకాశంలోను, సీయోను కొండమీద, ప్రజల ప్రతి సమావేశం మీద నిలిచి ఉంటాయి. ప్రతి వ్యక్తి మీద కాపుదల ఉంటుంది. ఆ కాపుదల ఒక భద్రతా స్థలం. ఆ కాపుదల సూర్యుని వేడినుండి ప్రజలను కాపాడుతుంది. అన్ని రకాల వర్షాలు వరదల నుండి దాగుకొనేందుకు ఆ కాపుదల క్షేమ స్థానంగా ఉంటుంది.