20
అష్షూరు ఈజిప్టును, ఇథియోపియాను ఓడిస్తుంది
అష్షూరు రాజు సర్గోను. అష్డోదు మీద యుద్ధం చేయటానికి సర్గోను తర్తానును ఆ పట్టణం మీదికి పంపించాడు. తర్తాను అక్కడికి వెళ్లి ఆ పట్టణాన్ని పట్టుకొన్నాడు. ఆ సమయంలో ఆమోజు కుమారుడు యెషయా ద్వారా యెహోవా మాట్లాడాడు: “వెళ్లు, నీ నడుముకు కట్టిన దుఃఖవస్త్రం తీసివేయి. నీ పాదాల జోళ్లు తీసివేయి” అని యెహోవా చెప్పాడు. యెషయా యెహోవాకు విధేయుడయ్యాడు. మరియు యెషయా బట్టలు లేకుండా, చెప్పులు లేకుండా అక్కడ అంతా తిరిగాడు. అప్పుడు యెహోవా చెప్పాడు: “బట్టలు లేకుండ, చెప్పులు లేకుండా యెషయా మూడు సంవత్సరాలు తిరిగాడు. ఇది ఈజిప్టు, ఇథియోపియాకు సంకేతం. అష్షూరు రాజు ఈజిప్టును, ఇథియోపియాను ఓడిస్తాడు. అష్షూరు బందీలను పట్టుకొని, వారి దేశాల నుండి తీసుకొనిపోతాడు. పెద్దవాళ్లు, యువతీ యువకులు బట్టలు చెప్పులు లేకుండానే తీసుకొని పోబడతారు. వారు సాంతం నగ్నంగా ఉంటారు. ఈజిప్టు ప్రజలు అవమానిం చబడతారు. ప్రజలు సహాయం కోసం ఇథియోపియా వైపుచూస్తారు. ఆ ప్రజలు భగ్నమైపోతారు. ఈజిప్టు ఔన్నత్యం చూచి ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. అలాంటి ప్రజలు అవమానించబడతారు.”
సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రజలు, “ఆ దేశాలు మాకు సహాయం చేస్తాయని వాటిని నమ్ముకొన్నాము. అవి మమ్మల్ని అష్షూరు రాజు నుండి విమోచిస్తాయని మేం వాటి దగ్గరకు పరుగెత్తాం. కానీ వాటిని చూడండి. ఆ దేశాలు పట్టుకోబడ్డాయి, మరి మనం ఎలా తప్పించు కోగలుగుతాం?” అని అంటారు.