42
యెహోవాకు యోబూ జవాబు
అప్పుడు యెహోవాకు యోబూ ఇలా జవాబు చెప్పాడు. యోబు అన్నాడు:
 
“యెహోవా, నీవు అన్నీ చేయగలవని నాకు తెలుసు.
నీవు పథకాలు వేస్తావు, నీ పథకాల్లో ఏదీ మార్చబడజాలదు, నిలిపివేయబడదు.
‘నా సలహాను గూర్చి ఈ వెర్రి ప్రశ్నలు అడుగుతున్న ఇతడు ఎవరు?’ అని యెహోవా, నీవు ప్రశ్నించావు.
నేను (యోబును) నాకు అర్థం కాని విషయాలు యెహోవాని అడిగాను.
నేను తెలిసి కోలేనంత మరీ వివరీతమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలను గూర్చి నేను మాట్లాడాను.
 
“యెహోవా, ‘నీవు నాతో యెబూ, నేను నీతో మాట్లాడుతాను.
నేను నిన్ను ప్రశ్నలు అడుగుతాను. నీవు నాకు జవాబు ఇవ్వాలి’ అన్నావు.
యెహోవా, ఇదివరకు నిన్ను గూర్చి నేను విన్నాను.
కానీ ఇప్పుడు నా స్వంత కళ్లతో నేను నిన్ను చూశాను.
కనుక ఇప్పుడు, నన్ను గూర్చి
నేను సిగ్గుపడుతున్నాను.
యెహోవా, నేను విచారిస్తున్నాను.
నేను ఈ ధూళిలో, బూడిదలో కూర్చొని ఉండగానే నేను నా జీవితం, నా హృదయం మార్చుకొంటానని వాగ్దానం చేస్తున్నాను.”
యోబూకు తన ఐశ్వర్యాలను యెహోవా తిరిగి యివ్వటం
యెహోవా యోబుతో మాట్లాడటం చాలించిన తర్వాత, ఆయన ఎలీఫజుతో మాట్లాడినాడు. ఎలీఫజు తేమాను పట్టణస్థుడు. ఎలీఫజుతో యెహోవా ఇలా చెప్పాడు: “నీ మీద, నీ యిద్దరు స్నేహితుల మీద నేను కోపంగా ఉన్నాను. ఎందుకంటే మీరు నన్ను గూర్చి సరిగా చెప్పలేదు. కానీ యోబు నన్ను గూర్చి సరైన సంగతులు చెప్పాడు. యోబు నా సేవకుడు. కనుక ఎలీఫజూ ఇప్పుడు ఏడు ఎద్దులను, ఏడు పొట్టేళ్లను నీవే తీసుకో. వాటిని నా సేవకుడు యోబు దగ్గరకు తీసుకొని వెళ్లి, మీ నిమిత్తం దహనబలిగా వాటిని అర్పించండి. నా సేవకుడు యోబు మీ కోసం ప్రార్థిస్తాడు. అప్పుడు నేను అతని ప్రార్థనకు తప్పక జవాబు ఇస్తాను. అప్పుడు మీరు శిక్షించబడాల్సిన విధంగా నేను మిమ్మల్ని శిక్షించను. మీరు చాలా అవివేకంగా ఉన్నారు గనుక మీరు శిక్షించబడాలి. మీరు నన్ను గూర్చి సరైన సంగతులు చెప్పలేదు. కానీ నా సేవుకుడు యోబు, నన్ను గూర్చి స రైన సంగతులు చెప్పాడు.”
కనుక తేమానువాడగు ఎలీపజు, షూహి దేశస్థుడైన బిల్దదు, నయమాతీ పట్టణస్థుడైన జోఫరు యెహోవాకు విధేయులయ్యారు. అప్పుడు యెహోవా చెప్పినట్లు వాళ్లు చేశారు. అప్పుడు యెహోవా యోబు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు.
10 కనుక యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించటం ముగించాడు. అప్పుడు యెహోవా యోబుకు మరల విజయం ఇచ్చాడు. యోబుకు అంతకు ముందు ఉన్నదానికి రెండంతలుగా దేవుడు ఇచ్చాడు. 11 యోబు సోదరులు, ఆడపడుచులు అందరూ తిరిగి యోబు ఇంటికి వచ్చారు. అంతకు ముందు యోబును ఎరిగిన ప్రతి ఒక్కరూ అతని ఇంటికి వచ్చారు. వాళ్లంతా యోబుతో కలిసి విందు భోజనం చేశారు. యోబుకు యెహోవా చాలా కష్టం కలిగించాడు గనుక వాళ్లంతా అతనిని ఓదార్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వెండి నాణెం, ఒక బంగారు ఉంగరం యోబుకు ఇచ్చారు.
12 యోబు జీవితంలో మొదటి భాగం కంటే రెండో భాగాన్ని యెహోవా అధికంగా ఆశీర్వదించాడు. పద్నాలుగు వేల గొర్రెలు, ఆరు వేల ఒంటేలు, రెండు వేల ఆవులు, వెయ్యి ఆడ గాడిదలు యోబుకు స్వంతం అయ్యాయి. 13 యోబుకు ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమారైలు కూడ ఉన్నారు. 14 యోబు మొదటి కుమారైకు యెమీమా అని పేరు పెట్టాడు. యోబు రెండో కుమార్తెకు కెజీయా అని పేరు పెట్టాడు. యోబు మూడో కుమార్త్తెకు కెరెంహప్పుక్ అని పేరు పెట్టాడు. 15 దేశం అంతటిలో యోబు కుమార్త్తెలు మహాగొప్ప సౌందర్యవతులు. యోబు తన కుమార్తెలకు తన ఆస్తిలో భాగం ఇచ్చాడు. వారి సోదరులు కూడ తమ తండ్రి ఆస్తిలో వాటా పొందారు.
16 కనుక యోబు మరో నూటనలభై సంవత్సరాలు జీవించాడు. అతడు తన పిల్లలను, మనుమలు మనుమరాండ్రను, మునిమనుమలు మనుమరాండ్రను, వారి పిల్లలను చూచేంతవరకు జీవించాడు. 17 యోబు చని చోయినప్పుడు అతడు కడువృద్ధుడు. యోబు సుదీర్గమైన కాలం జీవించాడు.