8
అహరోను, కుమారులు సేవకు సిద్ధమగుట
యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “అహరోనును, అతని కుమారులను, వారి వస్త్రాలు, అభిషేకించే తైలాన్ని, పాపపరిహారార్థపు కోడెదూడ, రెండు పొట్టేళ్ళను, ఒక గంపెడు పులియని రొట్టెలను నీతో తీసుకొని, ప్రజలందరినీ సన్నిధి గుడారం యొక్క ద్వారం దగ్గర సమావేశపర్చు.”
యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లే మోషే చేసాడు. ప్రజలు సన్నిధి గుడారం దగ్గర సమావేశం అయ్యారు. అప్పుడు మోషే, “చేయవలసినదానిని యెహోవా సెలవిచ్చాడు.”
అప్పుడు అహరోనును, అతని కుమారులను మోషే తీసుకొని వచ్చాడు. అతడు వారికి నీళ్లతో స్నానం చేయించాడు. అప్పుడ అహరోనుకు మోషే చొక్కా తొడిగించాడు. అహరోనుకు నడికట్టును మోషే చుట్టాడు. అంతట ఒక నిలువుపాటి అంగీని మోషే అహరోనుకు తొడిగించాడు. తర్వాత మోషే ఏఫోదును అహరోనుకు ధరింపజేసాడు. నైపుణ్యంగా అల్లిక చేయబడిన నడికట్టును మోషే అహరోను నడుముకు బిగించాడు. ఆ విధంగా ఏఫోదును అహరోనుకు మోషే ధరింపజేసాడు. తర్వాత మోషే, న్యాయతీర్పు పైవస్త్రంలో ఊరీము, తుమ్మీములను ఉంచాడు. అహరోను తలమీద తలపాగాను కూడా మోషే పెట్టాడు. ఈ తలపాగా ముందర భాగంలో బంగారు బద్దను మోషే పెట్టాడు. ఈ బంగారు బద్ద పరిశుద్ధ కిరీటం. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇలా చేసాడు.
10 తర్వాత మోషే అభిషేక తైలాన్ని తీసుకొని పవిత్ర గుడారాన్నీ, దానిలోని వస్తువులన్నిటినీ ప్రతిష్ఠించాడు. ఈ విధంగా వాటిని మోషే పరిశుద్ధం చేసాడు. 11 ఆ అభిషేక తైలంలో కొంత బలిపీఠం మీద ఏడుసార్లు మోషే చిలకపించాడు. బలిపీఠం, దాని పరికరాలు, పాత్రలు అన్నింటినీ మోషే ప్రతిష్ఠించాడు. గంగాళాన్ని, దాని పీటను కూడా మోషే ప్రతిష్ఠించాడు. ఈవిధంగా మోషే వాటిని పరిశుద్ధం చేశాడు. 12 అప్పుడు అభిషేక తైలంలో కొంత అహరోను తలమీద మోషే పోసాడు, ఈ విధంగా అహరోనును అతడు పరిశుద్ధం చేశాడు. 13 అప్పుడు మోషే అహరోను కుమారులను తీసుకొనివచ్చి, వారికి ప్రత్యేకమైన చొక్కాలను తొడిగించాడు. అతడు వారికి ప్రత్యేకమైన చొక్కాలను తొడిగించాడు. అతడు వారికి దట్టీలు కట్టాడు. తర్వాత వారి తలలమీద పాగాలను అతడు చుట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారమే మోషే ఇవన్నీ చేసాడు.
14 అప్పుడు పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను మోషే తీసుకొనివచ్చాడు. పాపపరిహారార్థ బలికొరకైన కోడె దూడ తలమీద అహరోను, అతని కుమారులు వారి చేతులు ఉంచారు. 15 అప్పుడు మోషే ఆ కోడె దూడను వధించి, దాని రక్తాన్ని తీసాడు. మోషే కొంచెం రక్తం తీసుకొని, తన వ్రేలితో దానిని బలిపీఠపు కొమ్ములన్నింటి మీద చల్లాడు. ఈ విధంగా బలిపీఠాన్ని బలులకోసం మోషే సిద్ధం చేసాడు, తర్వాత ఆ రక్తాన్ని బలిపీఠపు అడుగున మోషే పోసాడు. ఈ విధంగా ప్రజల పాపాలను పరిహారం చేసే బలుల కోసం బలిపీఠాన్ని మోషే సిద్ధం చేసాడు. 16 ఆ కోడెదూడ లోపలి భాగాలనుండి కొవ్వు అంతటినీ మోషే తీసాడు. కాలేయం యొక్క కొవ్విన భాగాన్ని, రెండు మూత్ర పిండాలను, వాటిమీద కొవ్వును మోషే తీసి బలిపీఠం మీద వాటిని దహించాడు. 17 అయితే ఆ కోడెదూడ చర్మాని దాన్ని మాంసాన్ని, దాని పేడను వారి బస వెలుపలకు మోషే తీసుకుపోయాడు. నివాసానికి వెలుపల మంట వేసి అందులో వాటిని మోషే కాల్చివేసాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లే మోషే అవన్నీ చేసాడు.
18 తర్వాత మోషే దహనబలి పొట్టేలును తీసుకొచ్చాడు. అహరోను, అతని కుమారులు ఆ పొట్టేలు తలమీద వారి చేతులు ఉంచారు. 19 అప్పుడు మోషే ఆ పొట్టేలును వధించి, దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాడు. 20 పొట్టేలును మోషే ముక్కలుగా కోసాడు. లోపలి భాగాలను, కాళ్లను, నీళ్ళతో మోషే కడిగాడు. 21 తర్వాత మొత్తం పొట్టేలును బలిపీఠం మీద మోషే దహించాడు. తలను, భాగాలను, కొవ్వును మోషే దహించాడు. అది హోమంగా అర్పించబడిన దహనబలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన. యెహోవా ఆజ్ఞాపించినట్లే మోషే వాటిని చేసాడు.
22 అప్పుడు మోషే మరొక పొట్టేలును తీసుకొచ్చాడు. అహరోనును, అతని కుమారులను యాజకులుగా నియమించుటకు ఈ పొట్టేలు ఉపయోగించబడింది. అహరోను, అతని కుమారులు ఆ పోట్టేలు తలమీద వారి చేతులు ఉంచారు. 23 అప్పుడు మోషే ఈ పోట్టేలును వధించాడు. దాని రక్తంలో కొంత అతడు తీసుకొని, అహరోను చెవి కొనమీద, కుడిచేతి బొటన వేలిమీద, అహరోను కుడికాలి బొటనవేలి మీద వేసాడు. 24 తర్వాత అహరోను కమారులను బలిపీఠం దగ్గరకు మోషే తీసుకొని వచ్చాడు. ఆ రక్తంలో కొంత వారి కుడి చెవుల కొనలమీద, కుడి చేతుల బొటనవేళ్ళమీద, వారి కుడి కాళ్ల బొటనవ్రేళ్ల మీద మోషే వేసాడు. తర్వాత బలిపీఠంచుట్టూ ఆ రక్తాన్ని మోషే చిలకరించాడు. 25 కొవ్వును, కొవ్విన తోకను, లోపలి భాగాలమీద కొవ్వు అంతటినీ, కాలేయం యొక్క కొవ్విన భాగాన్ని రెండు మూత్ర పిండాలను, వాటి కొవ్వును, కుడి తొడను మోషే తీసాడు. 26 ఒక గంపెడు పులియని రొట్టెలు ప్రతిరోజూ యెహోవా ముందు ఉంచబడ్డాయి. ఆ రొట్టెల్లో నూనె కలిపి చేయబడ్డ రొట్టె ఒకటి, పులియని రొట్టెల్లోనుంచి ఒక రొట్టెను మోషే తీసుకొని, పొట్టేలు కుడి తొడమీద, కొవ్వుమీద ఆ రొట్టె ముక్కల్ని ఉంచాడు. 27 తర్వాత మోషే వాటన్నింటినీ అహరోను, అతని కుమారుల చేతుల్లో పెట్టాడు. నైవేద్యంగా ఆ ముక్కలను యెహోవా ఎదుట మోషే అల్లాడించాడు. 28 అప్పుడు అహరోను అతని కుమారుల చేతుల్లోనుండి మోషే వాటిని తీసుకొన్నాడు. బలిపీఠం మీద దహనబలిగా వాటిని దహించాడు. కాబట్టి అహరోనును, అతని కుమారులను యాజకులుగా నియమించుటకు అర్పణ అది. అది అగ్నితో అర్పించబడిన అర్పణ. అది యెహోవాకు ఇష్టమైన సువాసన. 29 దాని బోరను మోషే తీసుకొని, యెహోవా ఎదుట అర్పణగా దానిని అల్లాడించాడు. యాజకులను నియమించుటలో పొట్టేలు యొక్క ఆ భాగం మోషేకు చెందుతుంది. ఇది యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు జరిగింది.
30 బలిపీఠం మీద ఉన్న అభిషేకతైలం కొంత, రక్తం కొంత మోషే తీసుకొన్నాడు. అందులో కొంచెం అహరోను మీద, అతని వస్త్రాల మీద, మరియు అహకోనుతో ఉన్న అతని కుమారుల మీద, వారి వస్త్రాల మీద కొంచెం చల్లాడు. ఈ విధంగా అహరోనును అతని వస్త్రాలను, అతని కుమారులను వారి వస్త్రాలను మోషే పవిత్రం చేసాడు. బలులు, అర్పణల నియమాలు
31 అప్పుడు అహరోనుతో, అతని కుమారులతో మోషే ఇలా చెప్పాడు: “మీకు నా ఆజ్ఞ జ్ఞాపకం ఉందా? ‘అహరోను, అతని కుమారులు వీటిని తినాలి’ అని నేను చెప్పాను. కనుక నియామక కార్యక్రమంనుండి రొట్టెలు, మాంసం ఉన్న గంప తీసుకోండి. సన్నిధి దగ్గర ఆ మాంసాన్ని ఉడకబెట్టండి. ఆ రొట్టెను ఆ మాంసాన్ని అక్కడే మీరు తినాలి. 32 రొట్టెగాని మాంసాన్నిగాని ఏమైనా మిగిలిపోతే, దాన్ని కాల్చివేయాలి. 33 నియామక క్రమం ఏడు రోజులపాటు ఉంటుంది. మీ అభిషేకం పూర్తి అయ్యేంతవరకు మీరు సన్నిధి గుడారంనుండి బయటకు వెళ్ల కూడదు. 34 ఈ వేళ మనం చేసిన వాటన్నింటినీ చేయుమని యెహోవా ఆజ్ఞాపించాడు. మీ పాపాలను తుడిచివేసేందుకు ఆయన వీటిని ఆజ్ఞాపించాడు. 35 ఏడు రోజుల పాటు రాత్రింబవళ్లు సన్నిధి గుడారం దగ్గరే మీరు నిలిచి ఉండాలి. యెహోవా ఆజ్ఞలకు మీరు విధేయులు కాకాపోతే మీరు చనిపోతారు. ఈ ఆజ్ఞలు నాకు యెహోవా ఇచ్చాడు.”
36 కనుక యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ అహరోను, అతని కుమారులు జరిగించారు.