౨౬
౧ ఇది ద్వారపాలకుల విభజన గూర్చిన సంగతి. ఆసాపు సంతానంలో కోరే కొడుకు మెషెలెమ్యా కోరహు సంతానం వాడు.
౨ మెషెలెమ్యా కొడుకులు ఎవరంటే జెకర్యా పెద్దవాడు, యెదీయవేలు రెండోవాడు, జెబద్యా మూడోవాడు, యత్నీయేలు నాల్గోవాడు.
౩ ఏలాము అయిదోవాడు, యెహోహనాను ఆరోవాడు, ఎల్యోయేనై ఏడోవాడు.
౪ దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కొడుకులను దయ చేశాడు. వాళ్ళెవరంటే, షెమయా పెద్దవాడు, యెహోజాబాదు రెండోవాడు, యోవాహు మూడోవాడు, శాకారు నాల్గోవాడు, నెతనేలు అయిదోవాడు,
౫ అమ్మీయేలు ఆరోవాడు, ఇశ్శాఖారు ఏడోవాడు, పెయుల్లెతై ఎనిమిదోవాడు. ౬ అతని కొడుకు షెమయాకు కొడుకులు పుట్టారు. వాళ్ళు పరాక్రమశాలులుగా ఉండి తమ తండ్రి కుటుంబంలో పెద్దలయ్యారు.
౭ షెమయా కొడుకులు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, యెల్జాబాదు, బలవంతులైన అతని సహోదరులు ఎలీహు, సెమక్యా.
౮ ఓబేదెదోము కొడుకులూ, వాళ్ళ కొడుకులూ వాళ్ళ సహోదరులూ అరవై ఇద్దరు, వాళ్ళు తమ పని చెయ్యడంలో గట్టివాళ్ళు.
౯ మెషెలెమ్యాకు పుట్టిన కొడుకులూ, సహోదరులూ, పరాక్రమశాలురు. వీళ్ళు పద్దెనిమిది మంది. ౧౦ మెరారీయుల్లో హోసా అనే అతనికి పుట్టిన కొడుకులు పెద్దవాడు షిమ్రీ, అతడు పెద్దకొడుకు కాకపోయినా అతని తండ్రి అతన్ని నాయకునిగా చేశాడు.
౧౧ రెండోవాడు హిల్కీయా, మూడోవాడు టెబల్యాహు, నాలుగోవాడు జెకర్యా, హోసా కొడుకులూ, సహోదరులూ అందరూ కలిసి పదముగ్గురు.
౧౨ ఈ విధంగా ఏర్పాటైన తరగతులనుబట్టి యెహోవా మందిరంలో వంతుల ప్రకారం తమ సోదరులు సేవ చెయ్యడానికి ఈ ద్వారపాలకులు, అంటే వాళ్ళలో ఉన్న పెద్దలు వాళ్ళను జవాబుదారులుగా నియమించడం జరిగింది.
౧౩ చిన్నలకైనా పెద్దలకైనా పూర్వీకుల ఇంటి వరసనుబట్టి ఒక్కొక్క ద్వారం దగ్గర కావలి ఉండడానికి వాళ్ళు చీట్లు వేశారు. ౧౪ తూర్పు వైపు కావలి షెలెమ్యాకు పడింది, వివేకం గలిగి ఆలోచన చెప్పగలిగిన అతని కొడుకు జెకర్యాకు చీటివేసినప్పుడు ఉత్తరం వైపు కావలి అతనికి పడింది.
౧౫ ఓబేదెదోముకు దక్షిణం వైపు కావలీ, అతని కొడుకులకు గిడ్డంగుల కావలి పడింది. ౧౬ షుప్పీముకూ, హోసాకూ, పడమటి వైపున ఉన్న షల్లెకెతు గుమ్మానికి ఎక్కే రాజమార్గాన్ని కాయడానికి చీటి పడింది.
౧౭ తూర్పున లేవీయులైన ఆరుగురు, ఉత్తరాన రోజుకు నలుగురూ, దక్షిణాన రోజుకు నలుగురూ, గిడ్డంగుల దగ్గర ఇద్దరిద్దరూ, ౧౮ బయట ద్వారం దగ్గర పడమరగా ఎక్కి వెళ్ళే రాజమార్గం దగ్గర నలుగురూ, బయట దారిలో ఇద్దరూ, ఏర్పాటు అయ్యారు. ౧౯ కోరే సంతానంలోనూ, మెరారీయుల్లోనూ ద్వారం కావలి కాసే వాళ్లకు ఈ విధంగా వంతులు వచ్చాయి.
౨౦ చివరికి లేవీయుల్లో అహీయా అనేవాడు దేవుని మందిరపు గిడ్డంగులనూ, ప్రతిష్ఠిత వస్తువుల గిడ్డంగులనూ కాసేవాడుగా నియామకం జరిగింది. ౨౧ ఇది లద్దాను సంతానం గూర్చినది. గెర్షోనీయుడైన లద్దాను కొడుకులు, అంటే, గెర్షోనీయులుగా ఉంటూ తమ పూర్వీకుల కుటుంబాలకుకు పెద్దలై ఉన్నవాళ్ళను గూర్చినది. ౨౨ యెహీయేలీ కొడుకులైన జేతాము, అతని సహోదరుడు యోవేలు, యెహోవా మందిరపు గిడ్డంగులకు కావలి కాసేవాళ్ళు.
౨౩ ఇది అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు, అనేవాళ్ళను గూర్చినది. ౨౪ మోషే కొడుకు గెర్షోముకు పుట్టిన షెబూయేలుకు గిడ్డంగుల మీద ప్రధానిగా నియామకం జరిగింది. ౨౫ ఎలీయెజెరు సంతానం వాళ్ళు షెబూయేలు సహోదరులు ఎవరంటే,
అతని కొడుకు రెహబ్యా,
రెహబ్యా కొడుకు యెషయా,
యెషయా కొడుకు యెహోరాము,
యెహోరాము కొడుకు జిఖ్రీ,
జిఖ్రీ కొడుకు షెలోమీతు.
౨౬ రాజైన దావీదూ, పూర్వీకుల కుటుంబాల పెద్దలూ, సహస్రాధిపతులూ, శతాధిపతులూ, సైన్యాధిపతులూ ప్రతిష్ఠించిన ప్రత్యేకమైన సామగ్రి ఉన్న గిడ్డంగులకు షెలోమీతూ, అతని సహోదరులూ కావలి కాసేవాళ్ళయ్యారు. ౨౭ యెహోవా మందిరం మరమ్మతు పనుల కోసం యుద్ధాల్లో పట్టుకున్న కొల్లసొమ్ము కొంత భాగాన్ని వీరు సమర్పించారు. ౨౮ ప్రవక్త అయిన సమూయేలు, కీషు కొడుకు సౌలు, నేరు కొడుకు అబ్నేరు, సెరూయా కొడుకు యోవాబు ప్రతిష్ఠించిన సొమ్మంతటినీ షెలోమీతు, అతని సహోదరుల ఆధీనంలో ఉంచారు.
౨౯ ఇది ఇస్హారీయులను గూర్చినది. వాళ్ళల్లో కెనన్యా, అతని కొడుకులను, పురపాలన జరిగించడానికి ఇశ్రాయేలీయులకు లేఖికులుగా, న్యాయాధిపతులుగా నియమించారు.
౩౦ ఇది హెబ్రోనీయులను గూర్చినది. హషబ్యా, అతని సహోదరులు పరాక్రమశాలురు. వీళ్ళు పదిహేడువేల మంది. వీళ్ళు యొర్దాను ఇవతల పడమటి వైపున ఉండే ఇశ్రాయేలీయులమీద యెహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయంలోనూ, రాజు నియమించిన పని విషయంలోనూ, పర్యవేక్షకులుగా నియమితులయ్యారు.
౩౧ ఇది హెబ్రోనీయులను గూర్చినది. హెబ్రోనీయుల పూర్వీకుల ఇంటి పెద్దలందరికీ యెరీయా పెద్ద. దావీదు ఏలుబడిలో నలభయ్యవ సంవత్సరంలో వాళ్ళ సంగతి పరిశీలించినప్పుడు, వాళ్ళల్లో గిలాదు దేశంలోని యాజేరులో ఉన్న వాళ్ళు పరాక్రమశాలురుగా కనిపించారు. ౩౨ పరాక్రమశాలురైన అతని సంబంధులు రెండువేల ఏడువందల మంది కుటుంబ పెద్దలుగా కనిపించారు. దావీదు దైవసంబంధమైన కార్యాల విషయంలోనూ, రాజకార్యాల విషయంలోనూ, రూబేనీయుల మీదా, గాదీయుల మీదా, మనష్షే అర్థగోత్రపు వాళ్ళ మీదా వాళ్ళను నియమించాడు.