౧౧
౧ అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదుకు ఎదురుగా సైన్యాన్ని మోహరించాడు. అప్పుడు యాబేషువారు “మేము నీకు సేవకులుగా ఉంటాం. మాతో ఒప్పందం చేసుకో” అని నాహాషును అడిగారు. ౨  “ఇశ్రాయేలు జాతి ప్రజలందరికీ అవమానం కలిగేలా మీ అందరి కుడి కళ్ళు పెరికివేస్తానని మీతో ఒప్పందం చేసుకుంటాను” అని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు పెద్దలతో చెప్పాడు.
౩ అందుకు వారు “మేము ఇశ్రాయేలీయుల అన్ని సరిహద్దు ప్రాంతాలకు మా రాయబారులను పంపడానికి మాకు వారం రోజులు సమయం ఇవ్వు. ఈలోపుగా మమ్మల్ని కాపాడేవారు ఎవరూ లేరని తెలిస్తే మమ్మును మేమే నీకు అప్పగించుకుంటాం” అన్నారు.
౪ ఆ రాయబారులు సౌలు ఉంటున్న గిబియాకు వచ్చి అక్కడి ప్రజలకు ఆ సమాచారం అందించినప్పుడు ఆ ప్రజలంతా గట్టిగా ఏడ్చారు. ౫ సౌలు పొలం నుండి పశువులను తోలుకుని వస్తూ “ప్రజలు అలా ఏడవడానికి కారణం ఏమిటి?” అని అడిగాడు. వారు యాబేషువారు తెచ్చిన సమాచారం అతనికి తెలియజేసారు.
౬ సౌలు ఆ మాటలు వినగానే దేవుని ఆత్మ అతన్ని తీవ్రంగా ఆవహించాడు. అతడు ఆగ్రహంతో ౭ ఒక కాడి ఎడ్లను ముక్కలుగా నరికి ఇశ్రాయేలీయుల దేశంలోని నాలుగు దిక్కులకు రాయబారుల చేత వాటిని పంపుతూ “సౌలు, సమూయేలులతో చేతులు కలపని వారందరి ఎడ్లను నేను ఈ విధంగా చేస్తాను” అని కబురు పంపాడు. అందువల్ల ప్రజల్లో యెహోవా భయం కలిగింది. కాబట్టి ఒక్కడు కూడా మిగలకుండా అందరూ సౌలు దగ్గరకి వచ్చారు. ౮ అతడు బెజెకులో సమావేశమైన వారిని లెక్కపెట్టినప్పుడు ఇశ్రాయేలు వారు మూడు లక్షల మంది, యూదావారు 30 వేల మంది ఉన్నారు.
౯ అప్పుడు సౌలు “రేపు మధ్యాహ్నం లోపుగా మీకు రక్షణ కలుగుతుందని యాబేష్గిలాదు వారితో చెప్పండి” అని ఆ రాయబారులకు ఆజ్ఞాపించాడు. వారు వెళ్ళి యాబేషువారికి ఆ వార్త తెలిపినప్పుడు వారు చాలా సంతోషించారు. ౧౦ అప్పుడు యాబేషువారు నాహాషు పంపిన మనుషులతో ఇలా చెప్పారు. “రేపు మేము బయలుదేరి మమ్మల్ని మేము నీకు అప్పగించుకొంటాం. అప్పుడు నీకు ఏది అనుకూలమో దాన్ని మాకు చేయవచ్చు.”
౧౧ తరువాతి రోజు సౌలు ప్రజలను మూడు గుంపులుగా చేసిన తరువాత వారు తెల్లవారేలోగా శిబిరం మధ్యకు చేరుకుని మధ్యాహ్నంలోగా అమ్మోనీయులను సంహరించారు. మిగిలిన వారిలో ఏ ఇద్దరూ కలసి తప్పించుకోలేకుండా చెదరిపోయారు.
౧౨ తరువాత ప్రజలు “సౌలు మనలను ఏలుతాడా? అని అడిగిన వారెక్కడ ఉన్నారు? మేము వారిని చంపడానికి వారిని తెప్పించు” అని సమూయేలుతో అన్నారు. ౧౩ అందుకు సౌలు “ఈ రోజు యెహోవా మనకు రక్షణ కలిగించాడు కాబట్టి మీరు ఎవరినీ చంపవద్దు” అన్నాడు.
౧౪  “మనం గిల్గాలుకు వెళ్లి రాజ్య పరిపాలన పద్ధతులను తిరిగి స్థిరపరచుకుందాం, రండి” అని సమూయేలు ప్రజలందరినీ పిలిచాడు. ౧౫ ప్రజలంతా గిల్గాలుకు వచ్చి అక్కడ యెహోవా సన్నిధానంలో శాంతి బలులు అర్పించి, యెహోవా సన్నిధి తోడుగా సౌలుకు పట్టాభిషేకం జరిగించారు. సౌలు, అక్కడ చేరిన ప్రజలంతా సంతోషంతో ఉప్పొంగిపోయారు.