౩౦
౧ దావీదు, అతనితో ఉన్నవారు మూడవ రోజున సిక్లగు వచ్చారు. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదా సిక్లగు మీదా దాడిచేసి, దోచుకుని సిక్లగు ప్రజలను ఓడించి, ఊరు తగలబెట్టి, ౨ పెద్దలనూ పిల్లలనూ అందులో ఉన్న స్త్రీలతో సహా చంపకుండా చెరబట్టి తీసుకుపోయారు.
౩ దావీదు, అతని మనుషులు అ ఊరికి వచ్చి అది కాలిపోయి ఉండడం, తమ భార్యలూ, కొడుకులూ కూతుర్లూ చెరలోకి పోయి ఉండడం చూసి ౪ ఇక ఏడవడానికి ఓపిక లేనంత గట్టిగా ఏడ్చారు.
౫ యజ్రెయేలీయురాలు అహీనోయము, కర్మెలు వాడైన నాబాలు భార్యగా ఉన్న అబీగయీలు అనే దావీదు ఇద్దరు భార్యలు కూడా చెరలోకి పోవడం చూసి ౬ దావీదు చాలా దుఃఖపడ్డాడు. తమ తమ కొడుకులూ కూతుర్లను బట్టి వారందరికీ ప్రాణం విసికి పోయి దావీదును రాళ్లు రువ్వి చంపాలని చెప్పుకున్నారు. దావీదు తన దేవుడు, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు.
౭ అప్పుడు దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడైన అహీమెలెకు కుమారుడు అబ్యాతారుతో చెప్పాడు. అబ్యాతారు ఏఫోదును దావీదు దగ్గరికి తీసుకు వచ్చాడు. ౮  “నేను ఈ సేనను తరిమితే దాని కలుసుకోగలుగుతానా?” అని యెహోవా దగ్గర దావీదు విచారణ చేశాడు. అందుకు యెహోవా “తరుము, తప్పకుండా నీవు వాళ్ళని కలుసుకుని నీవారినందరినీ విడిపించుకుంటావు” అని చెప్పాడు.
౯ కాబట్టి దావీదు, అతనితో ఉన్న 600 మంది బయలుదేరి, బెసోరు వాగు గట్టుకు వస్తే వారిలో 200 మంది ఆగిపోయారు. ౧౦ దావీదు, ఇంకా 400 మంది తరుముతూ పోయారు గానీ ఆ 200 మంది అలిసి పోయి బెసోరు వాగు దాటలేక ఆగిపోయారు. ఆ 400 మంది పోతుంటే ౧౧ ఒక పొలంలో ఒక ఐగుప్తీయుడు తారసపడ్డాడు. వారు దావీదు దగ్గరికి అతణ్ణి తీసుకు వచ్చి భోజనం పెడితే, తిన్నాడు. దాహానికి నీరిస్తే, తాగాడు.
౧౨ వారు అతనికి అంజూరపు ముద్ద తుంచి ఇచ్చారు. రెండు ఎండు ద్రాక్ష ముద్దలు అతనికిచ్చారు. అతడు మూడు రోజులనుండి పస్తులున్నాడు. భోజనం చేసిన తరువాత అతడి ప్రాణం తెప్పరిల్లింది. ౧౩ అప్పుడు దావీదు “నీవు ఏ దేశం వాడివి? ఎక్కడనుండి వచ్చావు?” అని అడిగాడు. అందుకు వాడు “నేను ఐగుప్తు వాణ్ణి. ఒక అమాలేకీయుడికి బానిసనయ్యాను. మూడు రోజుల క్రితం నాకు జబ్బు చేసింది. నా యజమాని నన్ను వదిలి వెళ్ళిపోయాడు.
౧౪ మేము దండెత్తి కెరేతీ జాతి వారుండే దక్షిణ దేశానికి, యూదా దేశానికి, కాలేబు దక్షిణ దేశానికి వచ్చి వాటిని దోచుకుని సిక్లగును కాల్చివేశాం” అని చెప్పాడు. ౧౫  “ఆ దోపిడీ గుంపును కలుసుకొనేందుకు నీవు నాకు దారి చూపుతావా” అని దావీదు అడిగితే అతడు “నేను నిన్ను చంపననీ నీ యజమాని వశం చేయననీ దేవుని పేరున నాకు మాట ఇస్తే ఆ గుంపును కలుసుకోవడానికి నీకు దారి చూపుతాను” అన్నాడు.
౧౬ తరువాత వాడు వారి దగ్గరికి దావీదును తోడుకుని పోయాడు. ఆ దోపిడీ వారు ఫిలిష్తీయుల దేశంలోనుండి, యూదా దేశం లోనుండి తాము దోచి తెచ్చుకొన్న కొల్ల సొమ్ముతో, ఆ ప్రదేశమంతా చెల్లాచెదరుగా తింటూ, తాగుతూ ఆటపాటల్లో ఉన్నారు. ౧౭ దావీదు అదను కనిపెట్టి సంధ్యవేళ మొదలు మరునాటి సాయంత్రం వరకూ వారిని చంపుతూ ఉంటే ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యువకులు తప్ప ఒక్కడు కూడా తప్పించుకొన్నవాడు లేకపోయాడు.
౧౮ ఇలా దావీదు అమాలేకీయులు దోచుకు పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకున్నాడు. అంతేకాదు, అతడు తన ఇద్దరు భార్యలను కూడా రక్షించుకున్నాడు. ౧౯ కొడుకులూ కూతుర్లూ దోపుడు సొమ్ము, ఇలా వారు ఎత్తుకుపోయిన దానంతటిలో ఏదీ తక్కువ కాకుండా మొత్తం దావీదు దక్కించుకున్నాడు. ౨౦ దావీదు ఇంకా అమాలేకీయుల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ చేజిక్కించుకున్నాడు. ఇవి దావీదుకు దోపుడు సొమ్ము అని భావించి తక్కిన వారు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలారు.
౨౧ అలిసి పోయి దావీదుతో కలిసి రాలేక బెసోరు వాగు దగ్గర నిలిచిపోయిన ఆ 200 మంది దగ్గరకి దావీదు తిరిగి వెళ్ళాడు. వారు దావీదును అతనితో ఉన్నవారిని ఎదుర్కొనడానికి బయలుదేరి వచ్చారు. దావీదు వారి దగ్గరకి వచ్చి వారి యోగక్షేమాలు అడిగాడు.
౨౨ దావీదుతో కూడా వెళ్లిన వారిలో దుష్టులు, పనికిమాలిన వారు కొంతమంది “వీళ్ళు మనతో కూడా రాలేదు గనక వారి భార్యలనూ పిల్లలనూ తప్ప మనకు దక్కిన దోపుడు సొమ్ములో ఏమీ వీరికి ఇవ్వనక్కర లేదు. తమ భార్య పిల్లలను మాత్రం వారు తీసికోవచ్చు” అన్నారు.
౨౩ అందుకు దావీదు వారితో “నా సోదరులారా, యెహోవా మనలను కాపాడి మనమీదికి వచ్చిన ఈ దండును మన వశం చేసి, మనకు దయచేసిన కొల్ల సొమ్ము విషయంలో మీరు ఇలా చేయడం తగదు. ౨౪ మీరంటున్నది ఎవరు ఒప్పుకుంటారు? యుద్దానికి పోయినవాడికీ సామాను దగ్గర కావలి ఉన్న వాడికి ఒకటే భాగం కదా. అందరూ సమానంగానే పాలు పంచుకుంటారు గదా” ౨౫ ఆ విధంగా అప్పటి నుండి ఇప్పటి వరకూ దావీదు ఇశ్రాయేలీయుల్లో అలాటి పంపకం కట్టడగా న్యాయవిధిగా ఏర్పరచి నియమించాడు.
౨౬ దావీదు సిక్లగుకు చేరుకుని దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు పంపించాడు. యెహోవా శత్రువులనుండి నేను దోచుకొన్న సొమ్ములో కొంత కానుకగా మీకు ఇస్తున్నానని చెప్పి వారికి పంపించాడు. ౨౭ బేతేలులో, దక్షిణ రామోతులో, యత్తీరులో, ౨౮ అరోయేరులో, షిప్మోతులో, ఎష్తెమోలో, ౨౯ రాకాలులో, యెరహ్మెయేలీయుల గ్రామాల్లో, కేనీయుల గ్రామాల్లో, ౩౦ హోర్మాలో బోరాషానులో, అతాకులో ౩౧ హెబ్రోనులో దావీదూ అతని మనుషులూ తిరుగాడిన స్థలాలన్నిటిలో ఉన్న పెద్దలకు దావీదు ఇలా పంపించాడు.