2 Kings
రాజులు రెండవ గ్రంథము
౧ అహాబు చనిపోయిన తరువాత మోయాబు దేశం ఇశ్రాయేలు రాజ్యంపై తిరుగుబాటు చేసింది. ౨ అప్పుడే అహజ్యా షోమ్రోనులోని తన మేడగది కిటికీలో నుండి కింద పడి గాయపడ్డాడు. అప్పుడతడు దూతలను పిలిచి “మీరు ఎక్రోను దేవుడు బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి ఈ గాయం మాని బాగుపడతానో లేదో కనుక్కుని రండి” అని వారికి చెప్పి పంపించాడు.
౩ కానీ యెహోవా దూత తిష్బీ వాడైన ఏలీయాతో ఇలా అన్నాడు. “నీవు లేచి సమరయ రాజు పంపిన దూతలను కలుసుకో. వారికిలా చెప్పు. ఎక్రోను దేవుడైన బయల్జెబూబును సంప్రదించడానికి వెళ్తున్నారా? ఇశ్రాయేలులో అసలు దేవుడనే వాడు లేడనుకున్నారా? ౪ సరే, యెహోవా ఇలా చెప్తున్నాడు. నీవు కచ్చితంగా ఎక్కిన పడక దిగకుండానే చనిపొతావు.” ఏలీయా వారికిలా చెప్పి వెళ్ళిపోయాడు.
౫ తరువాత ఆ దూతలు రాజు దగ్గరికి తిరిగి వచ్చేశారు. రాజు “మీరు ఎందుకు తిరిగి వచ్చారు?” అని అడిగాడు. ౬ వారు ఇలా అన్నారు “ఒక వ్యక్తి మాకు ఎదురయ్యాడు. అతడు మాతో మిమ్మల్ని పంపిన రాజు దగ్గరకి తిరిగి వెళ్ళండి. అతనితో ఇలా చెప్పండి. యెహోవా చెప్పేదేమిటంటే ఎక్రోను దేవుడైన బయల్జెబూబును సంప్రదించడానికి దూతలను పంపుతున్నావా? ఇశ్రాయేలులో దేవుడు లేడనుకున్నావా? కాబట్టి నీవు ఎక్కిన మంచం ఇక దిగవు. కచ్చితంగా చనిపోతావు, అని చెప్పాడు.”
౭ అప్పుడు రాజు “మిమ్మల్ని కలుసుకుని ఈ మాటలు చెప్పినవాడు ఎలా ఉన్నాడు?” అని అడిగాడు. ౮ అందుకు వారు “అతడు గొంగళి కట్టుకుని తోలు నడికట్టు పెట్టుకుని ఉన్నాడు” అన్నారు. అప్పుడు రాజు “ఆ వ్యక్తి తిష్బీ వాడైన ఏలీయానే” అన్నాడు.
౯ అప్పుడు రాజు యాభై మంది సైనికులతో ఒక అధికారిని ఎలీయా దగ్గరికి పంపించాడు. ఎలీయా ఒక కొండ మీద కూర్చుని ఉన్నాడు. ఆ అధికారి ఎలీయా ఉన్న చోటికి కొండ ఎక్కి వచ్చాడు. అతడు ఎలీయాతో “ఇదిగో, దేవుని మనిషీ, రాజు నిన్ను దిగి రమ్మంటున్నాడు” అన్నాడు. ౧౦ అందుకు ఏలీయా “నేను దేవుని మనిషినే అయితే ఆకాశం నుండి అగ్ని కురిసి నిన్నూ నీ యాభై మందినీ కాల్చి వేస్తుంది గాక” అన్నాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిసి ఆ అధికారినీ అతనితో ఉన్న యాభై మందినీ కాల్చి వేసింది.
౧౧ ఆహాజు రాజు మరో యాభై మంది సైనికులతో ఇంకో అధికారిని పంపించాడు. ఇతడు కూడా ఎలీయాతో “ఇదిగో, దేవుని మనిషీ, రాజు నిన్ను త్వరగా దిగి రమ్మంటున్నాడు” అన్నాడు. ౧౨ అందుకు ఏలీయా “నేను దేవుని మనిషినే అయితే ఆకాశం నుండి అగ్ని కురిసి నిన్నూ నీ యాభై మందినీ కాల్చి వేస్తుంది గాక” అని జవాబిచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిసి ఆ అధికారినీ అతనితో ఉన్న యాభై మందినీ కాల్చి వేసింది.
౧౩ అయినా రాజు మూడోసారి మరో యాభై మంది సైనిక బృందాన్ని పంపించాడు. వీళ్ళ అధికారి కొండ పైకి వెళ్ళాడు. ఇతడు ఎలీయా ఎదుట మోకాళ్ళపై వంగి ప్రాధేయ పూర్వకంగా “దేవుని మనిషీ, నిన్ను వేడుకుంటున్నాను. నీ దృష్టిలో నా ప్రాణాన్నీ, నీ సేవకులైన ఈ యాభై మంది ప్రాణాలనూ విలువైనవిగా ఉండనీ. ౧౪ ఇంతకు ముందు వచ్చిన ఇద్దరు అధికారులనూ, వాళ్ళ సైనికులనూ నిజంగానే ఆకాశం నుండి దిగి వచ్చిన అగ్ని కాల్చివేసింది. కానీ ఇప్పుడు నా ప్రాణం నీ దృష్టికి విలువైనదిగా ఉండనీ” అన్నాడు.
౧౫ అప్పుడు యెహోవా దూత ఎలీయాతో “దిగి అతనితో కూడా వెళ్ళు. అతనికి భయపడకు” అని చెప్పాడు. కాబట్టి ఎలీయా లేచి అతనితో కూడా రాజు దగ్గరికి వెళ్ళాడు. ౧౬ తరువాత ఎలీయా అహజ్యాతో ఇలా అన్నాడు. “నీవు ఎక్రోను దేవుడైన బయల్జెబూబు దగ్గరికి దూతలను పంపించావు. ఈ సంగతులు అడిగి తెలుసుకోడానికి ఇశ్రాయేలులో దేవుడు లేడనుకున్నావా? కాబట్టి ఇప్పుడు నీవు పండుకున్న మంచం పైనుండి దిగవు. కచ్చితంగా చనిపోతావు.”
౧౭ ఏలీయా పలికిన యెహోవా మాట ప్రకారం ఆహాజు రాజు చనిపోయాడు. అతనికి కొడుకు లేడు. అందుచేత అతని స్థానంలో అతని సోదరుడైన యెహోరాము రాజు అయ్యాడు. యూదా రాజు యెహోషాపాతు కొడుకు యెహోరాము పాలన రెండవ సంవత్సరంలో ఇది జరిగింది. ౧౮ అహజ్యా గూర్చిన ఇతర సంగతులు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.