౧ ఆ తరువాత ప్రవక్తల సమాజంలో ఒకడి భార్య ఏడ్చుకుంటూ ఎలీషా దగ్గరికి వచ్చింది. “నీ సేవకుడైన నా భర్త చనిపోయాడు. అతనికి యెహోవాపై భయమూ, భక్తీ ఉన్నాయని నీకు తెలుసు. ఇప్పుడు మాకు అప్పు ఇచ్చిన వాడు నా ఇద్దరు కొడుకులనూ తనకు బానిసలుగా తీసుకు వెళ్ళడానికి వచ్చాడు” అని చెప్పింది. ౨ దానికి ఎలీషా ఆమెతో “నీకు నేనేం చేయగలను? నీకు ఇంట్లో ఏమున్నాయో చెప్పు” అన్నాడు. అప్పుడు ఆమె “నీ సేవకురాలి ఇంట్లో ఓ జాడీలో నూనె తప్పించి ఇంకేమీ లేదు” అంది.
౩ అప్పుడు ఎలీషా “నీవు వెళ్ళి నీ పొరుగు వాళ్ళ దగ్గర ఉన్న పాత్రలు అరువు తెచ్చుకో. ఎన్ని తేగలవో అన్ని తెచ్చుకో. ౪ అప్పుడు నువ్వూ, నీ కొడుకులూ లోపలికి వెళ్ళి తలుపులు మూసుకోండి. అన్ని పాత్రల్లో నూనె పోయండి. నూనెతో నిండిన పాత్రలు ఒక పక్కన ఉంచండి” అని ఆమెతో చెప్పాడు.
౫ ఆమె ఎలీషా దగ్గరనుండి వెళ్ళింది. తన కొడుకులతో లోపలికి వెళ్ళి తలుపులు మూసింది. తన కొడుకులు తెచ్చిన పాత్రలను నూనెతో నింపింది. ౬ ఆ విధంగా తెచ్చిన పాత్రలన్నీ నూనెతో నిండిపోయాయి. ఆమె “ఇంకో పాత్ర పట్రండి” అంది. కానీ ఆమె కొడుకు “ఇక పాత్రలేమీ లేవు” అన్నాడు. దాంతో జాడీలోని నూనె ప్రవాహం నిలిచిపోయింది.
౭ అప్పుడు ఆమె వచ్చి దేవుని మనిషికి ఈ విషయం చెప్పింది. దానికతడు “వెళ్ళు, ఆ నూనె అమ్మి ఆ డబ్బుతో నీ అప్పులు తీర్చు. మిగిలిన దాంతో నువ్వూ నీ పిల్లలూ జీవించండి” అన్నాడు.
౮ ఒకసారి ఎలీషా షూనేము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ అతణ్ణి భోజనానికి రమ్మని ప్రాధేయపడిన ఒప్పించింది. కాబట్టి ఎలీషా ఆ దారి గుండా వెళ్ళినప్పుడల్లా ఆమె దగ్గర భోజనం చేస్తూ ఉండేవాడు. ఆమె ఆ పట్టణంలో చాలా ప్రముఖురాలు. ౯ ఆమె ఒకసారి తన భర్తతో ఇలా అంది. “ఈ మార్గంలో రాకపోకలు సాగించే ఈ వ్యక్తి పవిత్రుడూ, దేవుని మనిషీ అని నాకు తెలుసు. ౧౦ కాబట్టి మనం మిద్దె మీద ఒక చిన్న గది కడదాం. అందులో ఒక మంచం, బల్ల, కుర్చీ, ఒక లాంతరూ ఏర్పాటు చేద్దాం. ఆయన మన దగ్గరికి వచ్చిన ప్రతిసారీ అందులో ఉంటాడు.” ౧౧ కాబట్టి తరువాత ఎలీషా ఆ గదిలో ఉండి విశ్రాంతి తీసుకునే రోజు వచ్చింది.
౧౨ అప్పుడు ఎలీషా తన సేవకుడు గేహజీని పిలిచి “ఆ షూనేమీ స్త్రీని పిలువు” అన్నాడు. అతడు ఆమెను పిలుచుకు వచ్చాడు. ఆమె వచ్చి అతని ముందు నిలబడింది. ౧౩ అప్పుడు ఎలీషా గేహజీకి ఇలా ఆదేశించాడు. “నీవు ఆమెతో చెప్పు. నీవు మా కోసం ఇంత బాధ తీసుకున్నావు. నీ కోసం ఏం చేయాలి? నీ గురించి రాజుతో గానీ సైన్యాధిపతితో గానీ మాట్లాడమంటావా?” దానికి జవాబుగా ఆమె “నేను నా చుట్టాల మధ్యనే నివసిస్తున్నాను” అంది.
౧౪ తరువాత ఎలీషా “ఈమెకు మనం ఏ ఉపకారం చేయగలం?” అని గేహజీని అడిగాడు. గేహజీ “ఆమెకి కొడుకు లేడు. భర్తేమో ముసలివాడు” అన్నాడు. ౧౫ కాబట్టి ఎలీషా “ఆమెను పిలువు” అన్నాడు. అతడు వెళ్లి ఆమెను తీసుకు వచ్చాడు. ఆమె వచ్చి గుమ్మం దగ్గర నిలుచుంది. ౧౬ ఎలీషా ఆమెతో “వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నీ ఒడిలో కొడుకు ఉంటాడు” అన్నాడు. అప్పుడు ఆమె “నా ప్రభూ, వద్దు. దేవుని మనిషివైన నీవు నీ సేవకురాలినైన నాతో అబద్ధం చెప్పొద్దు” అంది.
౧౭ కానీ ఆ స్త్రీ గర్భం ధరించింది. ఆ తరువాత సంవత్సరం సరిగ్గా ఎలీషా చెప్పిన సమయానికి ఒక కొడుకుని కన్నది. ౧౮ ఆ పిల్లవాడు పెరిగిన తరువాత ఒక రోజు పొలంలో కోత కోస్తున్న వాళ్ళ దగ్గర ఉన్న తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వాడు తన తండ్రితో “నా తల! నా తల!” అన్నాడు. ౧౯ వాడి తండ్రి తన సేవకుడితో “పిల్లాణ్ణి ఎత్తుకుని వాళ్ళమ్మ దగ్గరికి తీసుకు వెళ్ళు” అన్నాడు. ౨౦ వాడు ఆ పిల్లవాణ్ణి తీసుకుని తల్లి దగ్గరికి తీసుకు వెళ్ళాడు. వాడు మధ్యాహ్నం వరకూ తల్లి ఒడిలో పడుకుని తరువాత చనిపోయాడు.
౨౧ అప్పుడు ఆమె వాణ్ని దేవుని మనిషి కోసం వేయించిన మంచం పై పడుకోబెట్టి తలుపు వేసి బయటకు వెళ్ళింది. ౨౨ తన భర్తను పిలిచి “నేను దేవుని మనిషి దగ్గరికి త్వరగా వెళ్ళి రావాలి. ఒక పనివాణ్ణీ, ఒక గాడిదనీ పంపించు” అని చెప్పింది.
౨౩ దానికి ఆమె భర్త “ఆయన దగ్గరికి ఈ రోజు ఎందుకు వెళ్ళడం? ఈ రోజు అమావాస్యా కాదు, విశ్రాంతి దినమూ కాదు గదా” అన్నాడు. దానికామె “నేను వెళ్ళడం వల్ల అంతా మంచే జరుగుతుంది” అంది. ౨౪ ఆమె ఆ గాడిదకు జీను కట్టించి దానిపై కూర్చుని పనివాడితో “వేగంగా పోనీ, నేను చెబితే తప్ప నిదానంగా తోలకు” అంది. ౨౫ ఆ విధంగా ఆమె ప్రయాణం చేసి కర్మెలు పర్వతంపై ఉన్న దేవుని మనిషి దగ్గరికి వచ్చింది.
ఆమె దూరంలో ఉండగానే దేవుని మనిషి ఆమెను చూశాడు. తన సేవకుడైన గేహజీని పిలిచి “చూడు, ఆ షూనేమీ స్త్రీ ఇక్కడికి వస్తుంది. ౨౬ నీవు పరిగెత్తుకుంటూ వెళ్ళి ‘నువ్వూ, నీ భర్తా, నీ కొడుకూ క్షేమంగా ఉన్నారా?’ అని అడుగు” అని చెప్పి పంపించాడు. దానికామె “క్షేమంగానే ఉన్నాం” అని జవాబిచ్చింది.
౨౭ తరువాత ఆమె పర్వతం మీద ఉన్న దేవుని మనిషి దగ్గరికి వచ్చి అతని కాళ్ళు పట్టుకుంది. గేహజీ ఆమెను తోలివేయడానికి దగ్గరికి గా వచ్చాడు. అప్పుడు దేవుని మనిషి “ఆమె చాలా నిస్పృహలో ఉంది. యెహోవా ఈ సమస్యను నాకు దాచి ఉంచాడు. నీవు ఆమె జోలికి పోకు” అని ఆదేశించాడు.
౨౮ అప్పుడు ఆమె “ప్రభూ, కొడుకు కావాలని నేను నిన్ను అడిగానా? నాతో అసత్యం పలుక వద్దు అనలేదా?” అంది. ౨౯ అప్పుడు ఎలీషా గేహజీతో “నీవు ప్రయాణానికి సిద్ధపడు. నా కర్ర చేత్తో పట్టుకో. ఆమె ఇంటికి వెళ్ళు. దారిలో నీకెవరైనా ఎదురైతే వాళ్ళను పలకరించ వద్దు. ఎవరైనా నిన్ను పలకరిస్తే వాళ్ళకు జవాబివ్వవద్దు. అక్కడికి వెళ్ళి నా కర్ర పిల్లవాడి ముఖంపై పెట్టు” అని చెప్పాడు.
౩౦ కానీ ఆ పిల్లవాడి తల్లి “యెహోవా ప్రాణం మీదా, నీ ప్రాణం మీదా ఒట్టేసి చెప్తున్నా, నేను మాత్రం నిన్ను వదలను” అంది. కాబట్టి ఎలీషా లేచి ఆమెతో కూడా వెళ్ళాడు. ౩౧ వాళ్ళ కంటే ముందుగా చేరుకున్న గేహజీ ఆ పిల్లవాడి ముఖంపై కర్ర ఉంచాడు కానీ పిల్లవాడు ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నాడు. కాబట్టి గేహజీ వెనక్కు వచ్చి దారిలో ఎలీషాను కలుసుకున్నాడు. ఎలీషాతో “పిల్లవాడు కళ్ళు తెరవలేదు” అని చెప్పాడు.
౩౨ ఎలీషా ఆ ఇల్లు చేరుకుని చనిపోయిన పిల్లవాడు తన మంచంపై పడి ఉండటం చూశాడు. ౩౩ కాబట్టి ఎలీషా లోపలికి వెళ్ళి తలుపులు వేశాడు. తానూ, ఆ పిల్లవాడూ మాత్రమే లోపల ఉండగా యెహోవాకు విజ్ఞాపన చేశాడు. ౩౪ అతడు మంచం ఎక్కి పిల్లవాడి మీద పడుకున్నాడు. తన నోటిని వాడి నోటి మీదా, తన కళ్ళు వాడి కళ్ళ మీదా తన చేతులు వాడి చేతుల మీదా ఉంచి వాడిపై పడుకున్నాడు. అప్పుడు పిల్లవాడి ఒంట్లో వేడి పుట్టింది.
౩౫ తరువాత ఎలీషా లేచి ఆ గదిలో చుట్టూ తిరిగి మళ్ళీ ఆ పిల్లవాడి పైన పడుకున్నాడు. పిల్లవాడు ఏడుసార్లు తుమ్మి కళ్ళు తెరిచాడు. ౩౬ అప్పుడు ఎలీషా గేహజీని పిలిచి “ఆ షూనేమీ స్త్రీని పిలుచుకురా” అన్నాడు. అతడు ఆమెను పిలుచుకు వచ్చాడు. ఆమె గది లోపలికి వచ్చింది. ఎలీషా ఆమెతో “నీ కొడుకుని ఎత్తుకో” అన్నాడు. ౩౭ అప్పుడు ఆమె అతని కాళ్ల మీద సాష్టాంగపడి లేచి తన కొడుకుని ఎత్తుకుని వెళ్ళింది.
౩౮ ఎలీషా తిరిగి గిల్గాలుకు వచ్చాడు. అప్పుడు ఆ దేశంలో కరువు నెలకుని ఉంది. ప్రవక్తల సమాజం వారు అతని ముందు కూర్చుని ఉన్నారు. అపుడు అతడు “పొయ్యి మీద పెద్ద వంట పాత్ర పెట్టి వీళ్ళకు ఆహరం సిద్ధం చెయ్యి” అని తన సేవకుడికి ఆదేశించాడు. ౩౯ వారిలో ఒకడు కూరగాయల కోసం పొలంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక చేదు ద్రాక్షచెట్టును చూశాడు. చేదు కూరగాయలను కోసుకుని తన అంగీ నిండా నింపుకుని తీసుకుని వచ్చాడు. వాటి స్వభావం వాళ్ళకి తెలియలేదు. వారు వాటిని ముక్కలు చేసి పులుసులో వేశారు.
౪౦ భోజనం సమయంలో ఆ పులుసును వాళ్ళకి వడ్డించారు. ప్రవక్తల సమాజం వారు దాన్ని నోట్లో పెట్టుకుని “దేవుని మనిషీ, పాత్రలో విషం ఉంది” అంటూ కేకలు వేశారు. వాళ్ళిక దాన్ని తినలేకపోయారు. ౪౧ కానీ ఎలీషా “కొంచెం పిండి తీసుకు రండి” అన్నాడు. పాత్రలో అతడు ఆ పిండి వేసి “భోజనానికి దీన్ని వడ్డించండి” అన్నాడు. ఇక ఆ పాత్రలో హానికరమైనది లేకుండా పోయింది.
౪౨ తరువాత బయల్షాలిషా నుండి ఒక వ్యక్తి కొత్తగా పండిన యవల పిండితో చేసిన ఇరవై రొట్టెలనూ, తాజాగా కోసిన ధాన్యాన్నీ ఒక బస్తాలో వేసుకుని దేవుని మనిషి కోసం తీసుకు వచ్చాడు. అప్పుడు అతడు “వీటిని వడ్డించు, ఇక్కడున్నవారు భోజనం చేస్తారు” అని చెప్పాడు. ౪౩ అయితే అతని సేవకుడు “ఏమిటీ? వందమందికి తినడానికి ఈ మాత్రం వాటిని వడ్డించాలా?” అన్నాడు. దానికి అతడు “వారు తినడానికి వడ్డించు. ఎందుకంటే ‘వారు తినగా ఇంకా మిగులుతాయి’ అని యెహోవా చెప్తున్నాడు” అన్నాడు. ౪౪ కాబట్టి అతని సేవకుడు వాటిని వాళ్ళకి వడ్డించాడు. యెహోవా చెప్పినట్లుగానే వాళ్ళంతా భుజించిన తరువాత ఆహారం ఇంకా మిగిలి పోయింది.