౧౬
౧ రెమల్యా కొడుకు పెకహు పరిపాలనలో 17 వ సంవత్సరంలో యూదా రాజు యోతాము కొడుకు ఆహాజు పరిపాలన ఆరంభించాడు. ౨ ఆహాజు పరిపాలన ఆరంభించినప్పుడు 27 సంవత్సరాల వయస్సు ఉండి, యెరూషలేములో 16 సంవత్సరాలు ఏలాడు. తన పూర్వికుడైన దావీదు తన దేవుడైన యెహోవా దృష్టిలో నీతిగా ప్రవర్తించినట్టు అతడు ప్రవర్తించకుండా ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్టు ప్రవర్తించాడు.
౩ అతడు, ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకుండా యెహోవా వెళ్లగొట్టిన జాతులు చేసిన హేయమైన పనులు చేస్తూ, తన కొడుకును దహన బలిగా అర్పించాడు. ౪ ఇంకా అతడు ఉన్నత స్థలాల్లో, కొండల మీద, అన్ని రకాల పచ్చని వృక్షాల కింద, బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చాడు.
౫ సిరియా రాజు రెజీను, ఇశ్రాయేలు రాజు రెమల్యా కొడుకు పెకహు యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చి, అక్కడ ఉన్న ఆహాజును, పట్టణాన్నీ చుట్టుముట్టారు గాని అతన్ని జయించలేక పోయారు. ౬ ఆ కాలంలో సిరియా రాజు రెజీను ఏలతును మళ్ళీ పట్టుకుని సిరియనుల వశం చేసి, ఏలతులోనుంచి యూదా వాళ్ళను వెళ్లగొట్టినప్పుడు సిరియనులు ఏలతు పట్టణానికి వచ్చి నివాసం ఉన్నారు. ఈ రోజు వరకూ వారు అక్కడే ఉన్నారు.
౭ ఇది ఇలా ఉండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనవీ, రాజనగరు సంబంధమైనవీ అయిన సామానుల్లో కనబడిన వెండి బంగారాలను తీసుకుని అష్షూరు రాజుకు కానుకగా పంపి, ౮  “నేను నీ సేవకుణ్ణి, నీ కొడుకులాంటి వాణ్ణి గనుక నీవు వచ్చి, నా మీద దండెత్తిన సిరియా రాజు చేతిలోనుంచీ, ఇశ్రాయేలురాజు చేతిలోనుంచీ నన్ను రక్షించాలి” అని అష్షూరు రాజు తిగ్లతు పిలేసెరు దగ్గరికి వార్తాహరులను పంపాడు. ౯ అష్షూరు రాజు అతని మాట అంగీకరించి, దమస్కు పట్టణం మీద దాడి చేసి దాన్ని చెర పట్టుకుని, రెజీనును హతం చేసి ఆ ప్రజలను కీరు పట్టణానికి బందీలుగా తీసుకుని వెళ్ళాడు.
౧౦ రాజైన ఆహాజు అష్షూరు రాజు తిగ్లతు పిలేసెరును కలుసుకోడానికి దమస్కు పట్టణానికి వచ్చి, దమస్కు పట్టణంలో ఒక బలిపీఠాన్ని చూసి, దాని పోలిక, నమూనా, దాని పనితనం అంతా యాజకుడైన ఊరియాకు పంపాడు. ౧౧ యాజకుడైన ఊరియా ఆహాజు రాజు దమస్కు పట్టణం నుంచి పంపిన నమూనాకు సరిపడిన బలిపీఠం ఒకటి కట్టించి, రాజైన ఆహాజు దమస్కు నుంచి తిరిగి రాకముందే దాన్ని ఏర్పాటు చేశాడు. ౧౨ అప్పుడు రాజు దమస్కు నుంచి వచ్చి బలిపీఠాన్ని చూసి, ఆ బలిపీఠం సమీపించి, ఎక్కి, ౧౩ దహన బలి, నైవేద్యం అర్పించి, పానార్పణం చేసి, తాను అర్పించిన సమాధానబలి పశువుల రక్తాన్ని దాని మీద చల్లాడు. ౧౪ ఇంకా, యెహోవా సన్నిధిలో ఉన్న ఇత్తడి బలివేదికను మందిరం ముందున్న స్థలం నుంచి, అంటే, తాను కట్టించిన బలిపీఠానికీ, యెహోవా మందిరానికీ మధ్య నుంచి తొలగించి, తాను కట్టించిన దానికి ఉత్తరం వైపు దాన్ని ఉంచాడు.
౧౫ అప్పుడు ఆహాజు రాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపిస్తూ “ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించే దహనబలులూ, సాయంత్రం అర్పించే నైవేద్యాలూ రాజు చేసే దహనబలి, నైవేద్యాలూ, దేశపు ప్రజలందరూ అర్పించే దహనబలులు, నైవేద్యాలూ, పానార్పణలూ ఇంకా ఏ దహనబలి జరిగినా, అ బలి పశువుల రక్తాన్ని దాని మీదే చల్లాలి. అయితే, నేను దేవుణ్ణి సహాయం అడగడానికి ఈ ఇత్తడి బలిపీఠం ఉండాలి” అన్నాడు. ౧౬ యాజకుడైన ఊరియా ఆహాజు రాజు ఆజ్ఞ ప్రకారం అంతా చేశాడు.
౧౭ ఇంకా, ఆహాజు రాజు కదిలే పీట మీది నుండి తొట్టిని పక్కన ఉండే పలకలను తీయించాడు. కంచు ఎద్దుల మీద ఉన్న గంగాళాన్ని దింపి, రాతి అరుగు మీద దాన్ని ఉంచాడు. ౧౮ ఇంకా అతడు అష్షూరు రాజుకు భయపడి విశ్రాంతి దినం ఆచరణ కోసం మందిరంలో కట్టి ఉన్న మంటపాన్ని, రాజు ప్రాంగణంలోనుంచి వెళ్ళే దారిని యెహోవా మందిరం నుంచి తీసేశాడు.
౧౯ ఆహాజు చేసిన ఇతర పనుల గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. ౨౦ ఆహాజు తన పూర్వీకులతోబాటు చనిపోయినప్పుడు దావీదు పట్టణంలో తన పితరుల సమాధిలో అతన్ని పాతిపెట్టారు. అతని కొడుకు హిజ్కియా అతని స్థానంలో రాజయ్యాడు.