౧౮
౧ ఇశ్రాయేలు రాజు, ఏలా కొడుకు హోషేయ పరిపాలనలో మూడో సంవత్సరంలో యూదా రాజు ఆహాజు కొడుకు హిజ్కియా ఏలడం ఆరంభించాడు. ౨ అతడు 25 సంవత్సరాల వయస్సులో ఏలడం ఆరంభించి, యెరూషలేములో 29 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు అబీ. ఆమె జెకర్యా కూతురు. ౩ అతడు తన పూర్వికుడైన దావీదు ఆదర్శాన్ని అనుసరించి, యెహోవా దృష్టిలో ఏది సరైనదో అది చేశాడు.
౪ ఉన్నత స్థలాలను తొలగించి, విగ్రహాలను పగలగొట్టి, దేవతా స్తంభాలను పడగొట్టాడు. మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. దానికి ఇశ్రాయేలీయులు “నెహుష్టాను” అని పేరు పెట్టి, దానికి ధూపం వేసేవారు. ౫ అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాలో విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనైనా, అతని పూర్వికులైన రాజుల్లోనైనా అతనితో సమానుడు ఒక్కడూ లేడు.
౬ అతడు యెహోవాకు నమ్మకంగా ఉండి, ఆయన్ను వెంబడించడంలో వెనుతిరగకుండా, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నాడు. ౭ కాబట్టి, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. తాను వెళ్లిన ప్రతిచోటా అతడు జయం పొందాడు. అతడు అష్షూరు రాజుకు లోబడలేదు. అతని మీద తిరగబడ్డాడు. ౮ ఇంకా గాజా పట్టణం, దాని సరిహద్దుల వరకూ బురుజులనుండి ప్రాకారాల వరకూ ఫిలిష్తీయులపై దాడి చేశాడు.
౯ రాజైన హిజ్కియా పరిపాలనలో నాలుగో సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజు ఏలా కొడుకు హోషేయ పరిపాలనలో ఏడో సంవత్సరంలో, అష్షూరురాజు షల్మనేసెరు షోమ్రోను పట్టణంపై దండెత్తి దాన్ని చుట్టుముట్టాడు. ౧౦ మూడు సంవత్సరాలకు అష్షూరీయులు దాన్ని చేజిక్కించుకున్నారు. హిజ్కియా పరిపాలనలో ఆరో సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజు హోషేయ పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో షోమ్రోను పట్టణం శత్రువుల వశం అయ్యింది.
౧౧ ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా చెప్పిన మాట వినకుండా ఆయన నిబంధనకూ, ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికీ లోబడలేదు. వాటిని అతిక్రమించారు. ౧౨ అష్షూరు రాజు ఇశ్రాయేలు వాళ్ళను అష్షూరు దేశానికి తీసుకెళ్ళి, గోజాను నది దగ్గర ఉన్న హాలహు, హాబోరు అనే పట్టణాల్లో, మాదీయుల పట్టణాల్లో వాళ్ళను ఉంచాడు.
౧౩ హిజ్కియా రాజు పరిపాలనలో 14 వ సంవత్సరంలో అష్షూరురాజు సన్హెరీబు యూదా దేశంలో ఉన్న ప్రాకారాలున్న పట్టాణాలన్నిటి మీద దాడి చేసి వాటిని చేజిక్కించుకున్నాడు. ౧౪ యూదారాజు హిజ్కియా, లాకీషు పట్టణంలో ఉన్న అష్షూరు రాజు దగ్గరికి వార్తాహరులను పంపి “నావల్ల తప్పు జరిగింది. నా దగ్గర నుంచి నీవు వెనక్కి వెళ్ళిపోతే నీవు నా మీద మోపిన దాన్ని నేను భరిస్తాను” అని వార్త పంపించాడు. అష్షూరురాజు 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారం యూదా రాజు హిజ్కియా చెల్లించాలని విధించాడు. ౧౫ కాబట్టి హిజ్కియా యెహోవా మందిరంలో, రాజనగరంలో, వస్తువుల రూపంలో ఉన్న వెండి అంతా అతనికి ఇచ్చేశాడు.
౧౬ ఇంకా ఆ కాలంలో హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారం, తాను కట్టించిన స్తంభాలకున్న బంగారం తీయించి అష్షూరు రాజుకిచ్చాడు. ౧౭ కాని, అష్షూరు రాజు తర్తాను, రబ్సారీసు, రబ్షాకేనులను లాకీషు పట్టణం నుంచి యెరూషలేములో ఉన్న హిజ్కియా రాజుపైకి పెద్ద సైన్యంతో పంపాడు. వారు యెరూషలేముపై దండెత్తి చాకిరేవు మార్గంలో ఉన్న మెరక కొలను కాలవ దగ్గర ప్రవేశించి, అక్కడ ఉండి రాజును పిలిపించాడు. ౧౮ హిల్కీయా కొడుకూ, గృహ నిర్వాహకుడూ అయిన ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్య లేఖనాల అధికారి అయిన ఆసాపు కొడుకు యోవాహు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు.
౧౯ అప్పుడు రబ్షాకే వాళ్ళతో అష్షూరురాజు హిజ్కియాతో చెప్పమన్నది ఈ విధంగా వినిపించాడు. “నీకున్న ఈ ధైర్యానికి ఆధారం ఏంటి? ౨౦ యుద్ధం విషయంలో నీ ఆలోచన, నీ బలం అన్నీ వట్టి మాటలే. నా మీద తిరుగుబాటు చెయ్యడానికి నీకు ధైర్యం ఇచ్చింది ఎవరు? ౨౧ నలిగిన రెల్లులాంటి ఈ ఐగుప్తును నమ్ముకుంటున్నావు. కాని, ఎవరైనా దాని మీద ఆనుకుంటే అది అతని చేతికి గుచ్చుకుని లోపలికి దిగుతుంది. ఆతన్ని నమ్ముకున్న వాళ్ళందరికీ ఐగుప్తురాజు ఫరో అలాంటివాడే.
౨౨ మా దేవుడు యెహోవాను మేము నమ్ముకుంటున్నాము, అని ఒకవేళ మీరు నాతో చెప్తారేమో. యెరూషలేములో ఉన్న ఈ బలిపీఠం దగ్గర మాత్రమే మీరు నమస్కారం చెయ్యాలని యూదా వాళ్ళకూ, యెరూషలేము వాళ్ళకూ ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవరి ఉన్నత స్థలాలూ, బలిపీఠాలూ పడగొట్టాడో ఆయనే గదా యెహోవా? ౨౩ కాబట్టి, నా యజమాని అష్షూరు రాజు పక్షంగా నిన్ను సవాలు చేస్తున్నాను. చాలినంత మంది రౌతులు నీ దగ్గర ఉంటే రెండువేల గుర్రాలు నేను నీకిస్తాను.
౨౪ అలా ఐతే నీవు నా యజమాని సేవకుల్లో అతి తక్కువ వాడైన ఒక్క అధిపతినైనా ఎలా ఎదిరించగలవు? రథాలూ, రౌతులూ పంపుతాడని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించావు గదా! ౨౫ యెహోవా ఇష్టం లేకుండానే ఈ దేశంపై యుద్ధం చేసి నాశనం చెయ్యడానికి నేను వచ్చానా? ‘ఆ దేశంపై దాడి చేసి నాశనం చెయ్యి’ అని యెహోవాయే నాకు ఆజ్ఞ ఇచ్చాడు” అన్నాడు.
౨౬ రబ్షాకేతో హిల్కీయా కొడుకు ఎల్యాకీము, షెబ్నా, యోవాహు ఇలా అన్నారు. “నీ దాసులమైన మాకు సిరియా భాష తెలుసు గనుక ఆ భాషలో మాట్లాడండి. ప్రాకారాల మీద ఉన్న ప్రజలకు తెలిసిన యూదుల భాషలో దయచేసి మాట్లాడొద్దు” అన్నారు. ౨౭ రబ్షాకే “ఈ మాటలు చెప్పడానికి నీ యజమాని దగ్గరకూ, నీ దగ్గరికి మాత్రమేనా నా యజమాని నన్ను పంపింది? త్వరలో మీతో పాటు తమ మలం తిని తమ మూత్రం తాగాల్సిన ఈ ప్రాకారాల మీద కూర్చున్న వాళ్ళ దగ్గరికి కూడా నన్ను పంపాడు గదా” అని చెప్పాడు.
౨౮ అతడు పెద్ద స్వరంతో యూదుల భాషలో “మహారాజైన అష్షూరురాజు చెప్పిన మాటలు వినండి. రాజు చెప్పదేమంటే, ౨౯ హిజ్కియా వల్ల మోసపోకండి. నా చేతిలోనుంచి మిమ్మల్ని విడిపించడానికి అతనికి శక్తి చాలదు. ౩౦ యెహోవా పేరట మిమ్మల్ని నమ్మించి, ‘యెహోవా మనలను విడిపిస్తాడు, ఈ పట్టణం అష్షూరురాజు చేతికి చిక్కదు’ అని హిజ్కియా చెప్తున్నాడు.
౩౧ హిజ్కియా చెప్పిన మాట మీరు నమ్మవద్దు. అష్షూరురాజు చెప్పేదేమంటే, నాతో సంధి చేసుకుని మీరు బయటికి నా దగ్గరికి వస్తే, మీలో ప్రతి మనిషీ తన సొంత ద్రాక్షచెట్టు ఫలం, తన అంజూరపు చెట్టు ఫలం తింటూ, తన సొంత బావిలో నీళ్లు తాగుతాడు. ౩౨ ఆ తరువాత మీరు చనిపోకుండా బ్రతికేలా మేము వచ్చి మీ దేశం లాంటి దేశానికీ, అంటే గోదుమలు, ద్రాక్షారసం ఉన్న దేశానికీ, ఆహారం, ద్రాక్షచెట్లు ఉన్న దేశానికీ, ఒలీవ నూనె, తేనె ఉన్న దేశానికీ మిమ్మల్ని తీసుకు పోతాము. అక్కడ మీరు సుఖంగా ఉంటారు. కాబట్టి, యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని హిజ్కియా మీకు బోధించే మాటలు వినొద్దు.
౩౩ వివిధ ప్రజల దేవుళ్లలో ఎవరైనా తమ దేశాన్ని అష్షూరురాజు చేతిలోనుంచి విడిపించారా? ౩౪ హమాతు దేవుళ్ళు ఏమయ్యారు? అర్పాదు దేవుళ్ళు ఏమయ్యారు? సెపర్వయీము దేవుళ్ళు ఏమయ్యారు? హేన ఇవ్వా అనే వాళ్ళ దేవుళ్ళు ఏమయ్యారు? (షోమ్రోను దేశపు) దేవుళ్ళు మా చేతిలోనుంచి షోమ్రోనును విడిపించారా? ౩౫ మా చేతిలోనుంచి యెహోవా యెరూషలేమును విడిపిస్తాడు అనడానికి, వివిధ దేశాల దేవుళ్లలో ఎవరైనా తమ దేశాన్ని మా చేతిలోనుంచి విడిపించిన సందర్భం ఉందా?” అన్నాడు.
౩౬ అయితే అతనికి జవాబు ఇవ్వొద్దని రాజు చెప్పిన కారణంగా ప్రజలు ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ౩౭ గృహ నిర్వాహకుడైన హిల్కీయా కొడుకు ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్య లేఖనాల అధిపతి ఆసాపు కొడుకు యోవాహు, బట్టలు చింపుకుని హిజ్కియా దగ్గరికి వచ్చి, రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజేశారు.