౩౧
౧ పదకొండవ సంవత్సరం మొదటి నెల ఏడవ రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు. ౨  “నరపుత్రుడా, ఐగుప్తు రాజు ఫరోతో, అతని చుట్టూ ఉన్న సేవకులతో ఇలా చెప్పు.
ఘనత విషయంలో నువ్వు ఎవరిలాగా ఉన్నావు?
౩ అష్షురు లెబానోను దేవదారు వృక్షం లాంటిది. అందమైన కొమ్మలతో,
విశాలమైన గుబురుతో, ఎంతో ఎత్తుగా ఉంది.
దాని చిటారు కొమ్మ మిగతా చెట్ల కంటే ఎత్తుగా ఉంది.
౪ నీళ్లు సమృద్ధిగా ఉండడం వలన అది ఎత్తుగా ఎదిగింది. లోతైన నదిని బట్టి మహావృక్షం అయింది. దాని చుట్టూ కాలువలు పారుతున్నాయి.
వాటి పిల్ల కాలువలు ఆ ప్రాంతంలోని చెట్లన్నిటికీ నీళ్ళు అందించాయి.
౫ ఆ ప్రాంతంలోని చెట్లన్నిటి కంటే అది ఎంతో ఎత్తుగా ఎదిగింది.
దానికి చాలా ఎక్కువ కొమ్మలు ఉన్నాయి.
నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి దాని కొమ్మలు పొడుగ్గా పెరిగాయి.
౬ పక్షులన్నీ దాని కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి. భూజంతువులన్నీ దాని గుబురులో పిల్లలు పెట్టాయి.
దాని నీడలో అన్ని రకాల జాతులు నివసించాయి.
౭ నీళ్ళు సమృద్ధిగా ఉన్న దగ్గర దాని వేళ్ళు పాకాయి. కాబట్టి అది పొడవాటి కొమ్మలతో అది అందంగా, గొప్పగా ఉంది.
౮ దేవుని తోటలోని దేవదారు వృక్షాలు దానికి సాటి కావు.
సరళ వృక్షాలకు అలాంటి కొమ్మలు లేవు. మేడి చెట్ల కొమ్మలు దీని కొమ్మలకు సాటిరావు.
దానికున్నంత అందం దేవుని తోటలోని వృక్షాల్లో దేనికీ లేదు!
౯ అనేక కొమ్మలతో నేను దాన్ని అందంగా చేశాను.
అందుకు దేవుని తోట, ఏదెనులోని వృక్షాలన్నీ దాని మీద అసూయపడ్డాయి.”
౧౦ అందుచేత యెహోవా ప్రభువు ఇలా అంటున్నాడు. “అది ఎంతో ఎత్తుగా ఉంది కాబట్టి, దాని కొన మిగతా వృక్షాలన్నిటిలో కంటే ఎత్తుగా ఉంది కాబట్టి, గర్వించింది. ౧౧ కాబట్టి నేను అతణ్ణి ఒడిసి పట్టుకుని రాజుల్లో అతి బలిష్ఠమైన వాడి చేతుల్లో పెట్టాను. ఈ అధికారి అతని చెడుతనానికి తగిన విధంగా అతని పట్ల జరిగించి తరిమివేశాడు.
౧౨ రాజ్యాలన్నిటిలో అతి క్రూరమైన విదేశీయులు అతన్ని నరికి పారవేశారు. అతని కొమ్మలు కొండల మీద, లోయల్లో పడ్డాయి. అతని శాఖలు భూమి మీదున్న అన్ని వాగుల్లో విరిగి పడ్డాయి. అప్పుడు భూరాజ్యాలన్నీ దాని నీడనుంచి వెళ్లి అతణ్ణి వదిలేశాయి.
౧౩ అతని మోడు మీద ఆకాశపక్షులన్నీ వాలాయి.
అతని కొమ్మల్లో భూజంతువులన్నీ ఉన్నాయి.
౧౪ నీళ్ళ దగ్గరున్న ఏ వృక్షమూ అతిశయంతో అంత ఎత్తుకు ఎదగకుండా ఇది జరిగింది. దాని కొనలు మిగతా వృక్షాలకంటే ఎత్తుగా ఉండకుండాా, నీళ్ళ దగ్గరున్న ఏ వృక్షమూ అంత ఎత్తుకు ఎదగకుండా ఉంటుంది. సాధారణ మనుషులు చనిపోయినట్టుగా అవన్నీ చస్తాయి.
౧౫ యెహోవా ప్రభువు ఇలా చెబుతున్నాడు. “అతడు పాతాళం లోకి పోయిన రోజు నేను భూమికి దుఃఖం కలిగించాను. అగాధజలాలు అతన్ని ముంచేలా చేశాను. సముద్రపు నీటిని ఆపాను. అతన్ని బట్టి నేను వాటి ప్రవాహాలను బంధించాను. అతని కోసం నేను లెబానోనుకు దుఃఖం కలిగించాను. కాబట్టి ఆ ప్రాంతంలోని చెట్లన్నీ అతని కోసం దుఃఖించాయి.
౧౬ అతని పతనం వల్ల కలిగే చప్పుడు విని ప్రజలు వణికిపోయేలా చేశాను. చచ్చిన వాళ్ళుండే గుంటలో అతన్ని విసిరేశాను. పల్లం ప్రాంతాల్లో ఉన్న ఏదేను చెట్లన్నిటినీ నేను ఓదార్చాను. ఇవన్నీ లెబానోనులో నీళ్ళ సమృద్ధి దొరికిన మంచి వృక్షాలు.
౧౭ వాళ్ళు కూడా కత్తితో చచ్చిన వారి దగ్గరికి అతనితోకూడా పాతాళానికి దిగిపోయారు. వీరంతా అతని నీడలో నివసించిన వాళ్ళు, అతనికి సహాయం చేసిన వాళ్ళు. ౧౮ ఘనత, ఆధిక్యం విషయంలో నీకు ఏదెను తోటలోని వృక్షాల్లో సాటి ఏది? అయినా నువ్వు ఏదెను వృక్షాలతో పాటు భూమి కిందికి, సున్నతిలేని వారి దగ్గరికి దిగిపోవలసి వస్తుంది. కత్తితో చచ్చిన వారితో నువ్వు నివసిస్తావు! ఫరో, అతని సేవకులందరికీ జరిగేది ఇదే” ఇదే యెహోవా ప్రభువు సందేశం.