౧ యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “ఇదిగో నిన్ను ఫరోకు దేవుడిగా నియమించాను. నీ అన్న అహరోను నీ మాటలు వినిపించే ప్రవక్తగా ఉంటాడు. ౨ నేను నీకు ఆజ్ఞాపించేదంతా నువ్వు మాట్లాడాలి. ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనివ్వాలని నీ అన్న అహరోను ఫరోతో చెబుతాడు. ౩ అయితే నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను. ఆ దేశంలో అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు జరిగిస్తాను. ౪ అప్పుడు కూడా ఫరో మీ మాట వినడు. కాబట్టి నా చెయ్యి ఐగుప్తు మీద మోపి గొప్ప తీర్పు క్రియలతో నా సేనలు అంటే ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటకు రప్పిస్తాను. ౫ నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి వాళ్ళ మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటకు రప్పించినప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.”
౬ మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేశారు. ౭ వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషే వయసు 80 సంవత్సరాలు, అహరోను వయసు 83 సంవత్సరాలు. ౮ యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పాడు. “మీ దేవుని శక్తి రుజువు చేయడానికి ఏదైనా ఒక అద్భుతం చూపించండి అని మిమ్మల్ని అడిగితే ౯ నువ్వు అహరోనుకు నీ చేతికర్రను ఇచ్చి దాన్ని ఫరో ముందు పడవెయ్యమని చెప్పు. అది పాముగా మారిపోతుంది.” ౧౦ మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళారు. యెహోవా వారికి చెప్పినట్టు అహరోను ఫరో ఎదుటా అతని పరివారం ఎదుటా తన కర్రను పడవేసినప్పుడు అది పాముగా మారింది.
౧౧ అప్పుడు ఫరో తన దేశంలోని జ్ఞానులను, మాంత్రికులను పిలిపించాడు. ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తితో అదే విధంగా చేశారు. ౧౨ వాళ్ళలో ప్రతి మాంత్రికుడూ తమ కర్రలను పడవేసినప్పుడు అవి పాములుగా మారాయి గాని అహరోను వేసిన కర్ర వాళ్ళు వేసిన కర్రలను మింగివేసింది. ౧౩ అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠివంగా మారిపోయింది, అతడు వారి మాట పెడచెవిన పెట్టాడు.
౧౪ తరువాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “ఫరో హృదయం కఠినంగా మారింది. అతడు ఈ ప్రజలను పంపడానికి ఒప్పుకోవడం లేదు. ౧౫ ఉదయాన్నే ఫరో నది ఒడ్డుకు వెళ్తాడు. అప్పుడు నువ్వు నది దగ్గర నిలబడి పాముగా అయిన కర్రను పట్టుకుని ఫరోకు ఎదురు వెళ్ళు. ౧౬ అతనితో, ‘ఎడారిలో ఆయన్ని సేవించడానికి ఆయన ప్రజలను వెళ్ళనివ్వమని ఆజ్ఞాపించడానికి హెబ్రీయుల దేవుడు యెహోవా నన్ను నీ దగ్గరికి పంపించాడు. ఇంతకు ముందు నువ్వు మా మాట వినలేదు. ౧౭ ఇప్పుడు యెహోవా చెబుతున్నది ఏమిటంటే, ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను నదిలో ఉన్న నీళ్ళను కొడుతున్నాను. నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి. దీన్ని బట్టి ఆయన యెహోవా అని నీవు తెలుసుకుంటావు ౧౮ నదిలోని చేపలన్నీ చనిపోతాయి. నది దుర్వాసన కొడుతుంది. ఐగుప్తీయులు ఆ నీళ్ళు తాగలేకపోతారు’ అని యెహోవా చెబుతున్నాడు.”
౧౯ యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “నువ్వు అహరోనుతో ఇలా చెప్పు. నీ కర్ర పట్టుకుని ఐగుప్తు నీళ్ళ మీద అంటే, వారి నదుల మీద, కాలువల మీద, చెరువుల మీద, నీటి గుంటలన్నిటి మీదా నీ చెయ్యి చాపు. ఆ నీళ్ళన్నీ రక్తంగా మారిపోతాయి. ఐగుప్తు దేశమంతా చెక్క తొట్లలో, రాతి పాత్రల్లో సహా రక్తం ఉంటుంది.” ౨౦ యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే అహరోనులు చేశారు. ఫరో, అతని సేవకులు చూస్తూ ఉండగా అహరోను తన కర్ర పైకెత్తి నది నీళ్లను కొట్టినప్పుడు నది నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి.
౨౧ నదిలోని చేపలన్నీ చచ్చిపోయాయి, నది నుండి దుర్వాసన కొట్టింది. ఐగుప్తీయులు నది నీళ్లు తాగలేక పోయారు. ఐగుప్తు దేశమంతా రక్తమయం అయింది. ౨౨ ఐగుప్తు మాంత్రికులు కూడా ఆ విధంగానే చేయగలిగారు. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని మోషే అహరోనుల మాట వినలేదు. ౨౩ జరిగిన దాన్ని లక్ష్యపెట్టకుండా ఫరో తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. ౨౪ అయితే ఐగుప్తీయులందరూ నది నీళ్లు తాగలేకపోయారు. మంచినీళ్ళ కోసం నది ఒడ్డున గుంటలు తవ్వుకున్నారు. ౨౫ యెహోవా నదిని కొట్టిన తరువాత ఏడు రోజులు గడిచాయి.