౨౯
౧  “నాకు యాజకులయ్యేలా వాళ్ళను ప్రతిష్ట చేయడానికి నువ్వు ఈ విధంగా చెయ్యి. ౨ ఒక కోడెదూడను, లోపం లేని రెండు పొట్టేళ్లను తీసుకో. పొంగకుండా కాల్చిన రొట్టెను, పొంగకుండా వండిన నూనెతో కలిసిన వంటకాలను, నూనె పూసిన పలచని అప్పడాలు తీసుకో. ౩ వాటిని గోదుమపిండితో చెయ్యాలి. వాటిని ఒక గంపలో ఉంచి ఆ గంపను, ఆ కోడెదూడను, ఆ రెండు పొట్టేళ్లను తీసుకు రావాలి.
౪ అహరోనును అతని కొడుకులను సన్నిధి గుడారం గుమ్మం దగ్గరికి తీసుకువచ్చి వాళ్లకు నీళ్లతో స్నానం చేయించాలి. ౫ అహరోనుకు దుస్తులు తొడిగి ఏఫోదు నిలువుటంగీని, ఏఫోదు వక్షపతకాన్ని వేసి, అల్లిక పని గల నడికట్టును అతనికి కట్టాలి. ౬ అతని తలమీద పాగా పెట్టి ఆ పాగా మీద పవిత్ర కిరీటం నిలబెట్టాలి. ౭ తరువాత అభిషేక తైలం తీసుకుని అతని తల మీద పోసి అతణ్ణి అభిషేకించాలి.
౮ తరువాత అతని కొడుకులను రప్పించి వారికి అంగీలు తొడిగించాలి. ౯ అహరోనుకు, అతని కొడుకులకూ నడికట్లు కట్టి వారికి టోపీలు పెట్టాలి. ఈ విధంగా అహరోనును, అతని కొడుకులను ప్రతిష్టించాలి. యాజకత్వ నిర్వహణ పదవి వారికి చెందుతుంది. ఇది ఎప్పటికీ నిలిచి ఉండే కట్టుబాటు.
౧౦ నువ్వు సన్నిధి గుడారం ఎదుటికి ఆ కోడెదూడను తెప్పించాలి. అహరోను, అతని కొడుకులు ఆ కోడెదూడ తలపై తమ చేతులు ఉంచాలి. ౧౧ సన్నిధి గుడారం ద్వారం దగ్గర యెహోవా సన్నిధానంలో ఆ కోడెదూడను వధించాలి. ౧౨ వధించిన ఆ కోడెదూడ రక్తంలో కొంచెం తీసుకుని నీ వేలుతో బలిపీఠం కొమ్ముల మీద పూయాలి. మిగిలిన రక్తమంతా బలిపీఠం కింద పారబోయాలి.
౧౩ దాని పేగులకు, కాలేయానికి, రెండు మూత్రపిండాలకు పట్టిన కొవ్వు అంతటినీ తీసివేసి బలిపీఠంపై కాల్చివెయ్యాలి. ౧౪ ఆ దూడ మాంసం, చర్మం, దాని పేడ అంతటినీ శిబిరం బయట కాల్చివెయ్యాలి. అది పాప పరిహారం కోసం అర్పించే బలి. ౧౫ నువ్వు ఆ రెండు పొట్టేళ్లలో ఒకదాన్ని తీసుకోవాలి. అహరోను, అతని కొడుకులు ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచాలి. ౧౬ ఆ పొట్టేలును వధించి దాని రక్తం తీసి బలిపీఠం చుట్టూ రక్తాన్ని చల్లాలి.
౧౭ తరువాత ఆ పొట్టేలును దాని అవయవాలను దేనికి అది విడదీసి దాని పేగులు, కాళ్ళు కడిగి, దాని అవయవాలను, తలను మొత్తంగా పేర్చాలి. ౧౮ పోట్టేలులోని ఆ భాగాలన్నిటినీ బలిపీఠంపై కాల్చివెయ్యాలి. అది యెహోవాకు హోమబలి. అది యెహోవాకు పరిమళం కలిగించే ఇష్టమైన హోమం.
౧౯ తరువాత రెండవ పొట్టేలును తీసుకోవాలి. అహరోను, అతని కొడుకులు ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిన తరువాత ౨౦ ఆ పొట్టేలును వధించి దాని రక్తంలో కొంచెం తీసుకుని అహరోను కుడి చెవి అంచు మీద, అతని కొడుకుల కుడి చెవుల అంచుల మీద, వాళ్ళ కుడి చెయ్యి, కుడి కాలు బొటన వేళ్ళపై చిలకరించి మిగిలిన రక్తం బలిపీఠం మీద చుట్టూ చిలకరించాలి.
౨౧ బలిపీఠంపై ఉన్న రక్తంలో కొంచెం, అభిషేక తైలంలో కొంచెం తీసుకుని అహరోను మీదా, అతని వస్త్రాల మీదా, అతని కొడుకుల మీదా, వాళ్ళ వస్త్రాల మీదా చిలకరించాలి. అప్పుడు అతడూ అతని వస్త్రాలూ, అతని కొడుకులూ వాళ్ళ వస్త్రాలూ పవిత్రం అవుతాయి.
౨౨ ఆ పొట్టేలు సేవ కోసం ప్రతిష్ఠితమైనది గనక దాని కొవ్వునూ, కొవ్విన తోకనూ, పేగులపై ఉన్న కొవ్వునూ, కాలేయం, రెండు మూత్రపిండాల చుట్టూ ఉన్న కొవ్వునూ, కుడి తొడను వేరు చెయ్యాలి. ౨౩ వాటితోపాటు యెహోవా ఎదుట ఉన్న పొంగకుండా కాల్చిన గుండ్రని రొట్టెను, నూనెతో వండిన వంటకాలను, ఒక పలచని అప్పడాన్ని తీసుకోవాలి. ౨౪ అహరోను, అతని కొడుకుల చేతుల్లో వాటినన్నిటినీ ఉంచాలి. కదలించే నైవేద్యంగా యెహోవా సన్నిధిలో వాటిని కదిలించాలి.
౨౫ తరువాత వాళ్ళ చేతుల్లోనుంచి వాటిని తీసుకుని బలిపీఠంపై కాల్చివెయ్యాలి. అది యెహోవాకు హోమబలి. అది యెహోవాకు పరిమళం కలిగించే ఇష్టమైన హోమం.
౨౬ అహరోను సేవా ప్రతిష్ట కోసం నియమించిన ఆ పొట్టేలు బోరను తీసుకుని యెహోవా సన్నిధిలో కదిలించే అర్పణగా దాన్ని కదిలించాలి. ఆ భాగం నీది అవుతుంది. ౨౭ ప్రతిష్టించిన ఆ పొట్టేలులో అంటే అహరోను, అతని కొడుకులకు చెందిన దానిలో కదిలించే బోరను, ప్రతిష్ఠితమైన తొడను నాకు ప్రతిష్ఠించాలి. ౨౮ ఆ ప్రతిష్టార్పణ అహరోనుది, అతని కొడుకులది అవుతుంది. అది ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చిన కానుక. అది నిత్యమూ నిలిచి ఉండే కట్టుబాటు. అది ఇశ్రాయేలు ప్రజలు అర్పించే శాంతి బలుల్లో నుండి యెహోవాకు అర్పించిన కానుక.
౨౯ అహరోను ధరించిన ప్రతిష్ఠిత వస్త్రాలు అతని తరువాత అతని కొడుకులకు చెందుతాయి. వాళ్ళ అభిషేకం, ప్రతిష్ట జరిగే సమయంలో వారు ఆ వస్త్రాలను ధరించాలి. ౩౦ అహరోను కొడుకుల్లో అతనికి బదులుగా యాజక వృత్తి ఎవరు చేపడతాడో అతడు పవిత్ర స్థలం లో సేవ చేయడానికి సన్నిధి గుడారంలోకి వెళ్ళే సమయానికి ముందు ఏడు రోజులపాటు ఆ వస్త్రాలు ధరించాలి.
౩౧ నువ్వు ప్రతిష్ట అయిన పొట్టేలును తీసుకుని పవిత్రమైన చోట దాని మాంసం వండాలి. ౩౨ అహరోను, అతని కొడుకులు సన్నిధి గుడారం గుమ్మం దగ్గర ఆ పొట్టేలు మాంసాన్నీ, గంపలో ఉన్న రొట్టెలనూ తినాలి. ౩౩ వారిని ప్రతిష్ఠ చేయడానికీ, పవిత్రపరచడానికీ వేటి ద్వారా ప్రాయశ్చిత్తం చేయబడిందో వాటిని వాళ్ళు తినాలి. అవి పవిత్రమైనవి కాబట్టి యాజకుడు కానివాడు వాటిని తినకూడదు.
౩౪ సేవ కోసం ప్రతిష్ట అయిన మాంసంలో గానీ, రొట్టెల్లో గానీ ఉదయం దాకా ఏమైనా మిగిలిపోతే వాటిని కాల్చివెయ్యాలి. అది ప్రతిష్ట అయినది గనక దాన్ని తినకూడదు. ౩౫ నేను నీకు ఆజ్ఞాపించిన విషయాలన్నిటి ప్రకారం నువ్వు అహరోనుకు, అతని కొడుకులకూ జరిగించాలి. ఏడు రోజుల పాటు వాళ్ళను సేవా ప్రతిష్ట కోసం సిద్ధపరచాలి.
౩౬ వారి పాపాలను కప్పివేయడానికి ప్రతిరోజూ ఒక కోడెదూడను పరిహార బలిగా అర్పించాలి. బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేయడానికి దానికి పాపపరిహార బలి అర్పించి దానికి అభిషేకం చేసి తిరిగి ప్రతిష్ఠించాలి. ౩౭ ఏడు రోజులపాటు బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం చేస్తూ దాన్ని పవిత్రం చెయ్యాలి. ఆ బలిపీఠం అతి పవిత్రంగా ఉంటుంది. బలిపీఠానికి తగిలేదంతా పవిత్రం అవుతుంది.
౩౮ బలిపీఠం మీద ఎప్పుడూ అర్పణలు జరుగుతూ ఉండాలి. ఒక సంవత్సరం లోపు వయసున్న రెండు గొర్రెపిల్లలను ప్రతి రోజూ అర్పించాలి. ౩౯ ఉదయం ఒక గొర్రెపిల్ల, సాయంత్రం ఒక గొర్రెపిల్ల అర్పించాలి. ౪౦ ఉదయం అర్పించే గొర్రెపిల్లతోబాటు దంచి తీసిన నూనెతో కలిపిన ఒక కిలో పిండిని, పానార్పణగా లీటరు ద్రాక్షరసాన్నీ అర్పించాలి.
౪౧ ఉదయం అర్పించినట్టు సాయంత్రం కూడా చెయ్యాలి. యెహోవాకు అర్పణనూ, పానార్పణనూ అర్పించాలి. అది యెహోవాకు హోమబలి. అది యెహోవాకు పరిమళంగా ఉండే ఇష్టమైన హోమం. ౪౨ ఇది యెహోవా సన్నిధానంలో సన్నిధి గుడారం ద్వారం దగ్గర మీరు తరతరాలకు అర్పించవలసిన హోమబలి. నేను అక్కడకు వచ్చి మిమ్మల్ని కలుసుకుని మీతో మాట్లాడతాను. ౪౩ అక్కడ ఇశ్రాయేలు ప్రజలను కలుసుకుంటాను. ఆ స్థలం నా మహిమా ప్రకాశం వల్ల పవిత్రం అవుతుంది.
౪౪ నేను సన్నిధి గుడారాన్ని, బలిపీఠాన్ని పవిత్రం చేస్తాను. నాకు యాజకులుగా ఉండేందుకు అహరోనును, అతని కొడుకులను పరిశుద్ధ పరుస్తాను. ౪౫ నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించి వారికి దేవుడుగా ఉంటాను. ౪౬ వాళ్ళ మధ్య నివసించడానికి తమను ఐగుప్తు దేశం నుండి బయటకు రప్పించిన దేవుణ్ణి నేనే అని వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ దేవుడైన యెహోవాను నేనే.”