౩౫
౧ యెహోవా నాకీ విషయం తెలియచేశాడు. ౨ నరపుత్రుడా, శేయీరు పర్వతం వైపు నీ ముఖం తిప్పుకుని దాని గురించి ఈ విషయం చెప్పు, ౩  “యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, శేయీరు పర్వతమా! నేను నీకు వ్యతిరేకిని. నా చెయ్యి నీ మీద చాపి నిన్ను పాడుగా నిర్జనంగా చేస్తాను.
౪ నీ పట్టణాలను నాశనం చేస్తాను. నువ్వు నిర్జనంగా ఉంటావు.” అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు. ౫ ఇశ్రాయేలీయుల పట్ల నువ్వు ఎప్పుడూ పగతో ఉన్నావు. వారి విపత్తు సమయంలో, వారి దోష శిక్ష ముగింపు కాలంలో నువ్వు వారిని కత్తి పాలు చేశావు. ౬ కాబట్టి నా జీవం తోడు. నేను నిన్ను రక్తపాతానికి గురి చేస్తాను. రక్తపాతం నిన్ను వెంటాడుతుంది. రక్తపాతాన్ని నువ్వు అసహ్యించుకోలేదు కాబట్టి రక్తపాతం నిన్ను వెంటాడుతుంది. ఇదే యెహోవా ప్రభువు సందేశం.
౭ వచ్చే పోయే వాళ్ళు అక్కడ లేకుండా చేసి, నేను శేయీరు పర్వతాన్ని పాడుగా నిర్జనంగా చేస్తాను. ౮ అక్కడి పర్వతాలను చచ్చిన వాళ్ళతో నింపుతాను. నీ కొండల్లో లోయల్లో నీ వాగులన్నిటిలో వారు కత్తి పాలవుతారు. ౯ నీ పట్టణాలను మళ్ళీ కట్టడం జరగదు. నువ్వు ఎప్పుడూ పాడుగా ఉంటావు. అయితే నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.
౧౦ యెహోవా అక్కడ ఉన్నా, ఆ రెండు రాజ్యాలూ ఆ రెండు ప్రాంతాలూ మనవే. మనం వాటిని స్వాధీనం చేసుకుందాం రండి. అని నీవు అన్నావు. ౧౧ నా జీవం తోడు నువ్వు పగ పట్టి వారి పట్ల చూపిన అసూయకూ కోపానికీ నేను తగిన విధంగా నీ పట్ల వ్యవహరిస్తాను. నిన్ను శిక్షించేటప్పుడు వారికి నన్ను నేనే తెలియపరచుకుంటాను. అయితే నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.
౧౨ అవి పాడైపోయాయి, మనం వాటిని దిగమింగేలా మన వశమయ్యాయి, అని నువ్వు ఇశ్రాయేలు పర్వతాలను గురించి పలికిన దూషణ మాటలన్నీ నేను, యెహోవాను విన్నాను. ౧౩ నోరు పెద్దగా చేసుకుని నువ్వు నాకు విరోధంగా ఎన్నో సంగతులు చెప్పావు. నేను వాటిని విన్నాను.
౧౪ యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, లోకమంతా సంతోషించేటప్పుడు నేను నిన్ను నాశనం చేస్తాను. ౧౫ ఇశ్రాయేలీయుల స్వాస్థ్యం పాడైపోవడం చూసి నువ్వు సంతోషించావు కాబట్టి నీకూ అలాగే చేస్తాను. శేయీరు పర్వతమా! నువ్వు పాడైపోతావు. ఎదోం దేశమంతా పాడైపోతుంది. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు!