౩౭
౧ యెహోవా తన చెయ్యి నా మీద ఉంచాడు. యెహోవా ఆత్మతో ఆయన నన్ను తీసుకుపోయి ఒక లోయలో దింపాడు. అది ఎముకలతో నిండి ఉంది. ఆయన వాటి మధ్య నన్ను ఇటూ అటూ నడిపించాడు. ౨ ఆ లోయలో చాలా ఎముకలు కనిపించాయి. అవి బాగా ఎండిపోయినవి. ౩ ఆయన “నరపుత్రుడా, ఎండిపోయిన యీ ఎముకలు బతుకుతాయా?” అని నన్నడిగితే “ప్రభూ, యెహోవా, అది నీకే తెలుసు” అన్నాను.
౪ అందుకాయన ప్రవచనాత్మకంగా ఎండిపోయిన ఈ ఎముకలతో ఇలా చెప్పు. “ఎండిపోయిన ఎముకలారా! యెహోవా మాట వినండి. ౫ ఈ ఎముకలకు యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, మీరు బతికేలా నేను మీలోనికి జీవాత్మ రప్పిస్తున్నాను. ౬ మీకు నరాలిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పోస్తే మీరు బతుకుతారు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.”
౭ ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారం నేను ప్రవచిస్తూ ఉంటే గలగలమనే శబ్దం వచ్చింది. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. ౮ నేను చూస్తూ ఉంటే నరాలూ మాంసం వాటిమీదికి వచ్చాయి. వాటిమీద చర్మం కప్పుకుంది. అయితే వాటిలో ప్రాణం లేదు.
౯ అప్పడు యెహోవా నాతో “నరపుత్రుడా! ప్రాణం వచ్చేలా ప్రవచించి ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఊపిరీ! నలుదిక్కుల నుంచి వచ్చి, చచ్చిన వీళ్ళు బతికేలా వీరి మీదికి రా” ౧౦ ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచిస్తే, వాళ్ళకి ప్రాణం వచ్చింది. వాళ్ళు సజీవులై గొప్ప సేనగా నిలబడ్డారు.
౧౧ అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచిస్తున్నాయి. మన ఎముకలు ఎండిపోయినవి. ఆశాభావం అంటూ మనకు లేదు. మనం నాశనమయ్యాం, అని అనుకుంటున్నారు. ౧౨ కాబట్టి ప్రవచనాత్మకంగా వాళ్ళతో ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నా ప్రజలారా, మీ సమాధులను నేను తెరుస్తాను. సమాధుల్లో నుంచి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశానికి తీసుకు వస్తాను.
౧౩ నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పిస్తే ౧౪ నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. మీరు బతికేలా నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేస్తాను. యెహోవానైన నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తానని మీరు తెలుసుకుంటారు. ఇదే యెహోవా ప్రభువు సందేశం.
౧౫ యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు. ౧౬ నరపుత్రుడా, నువ్వు ఒక కర్ర తీసుకుని దాని మీద, యూదావాళ్ళదీ, వాళ్ళ తోటివాళ్ళు ఇశ్రాయేలీయులదీ అని పేర్లు రాయి. మరో కర్ర తీసుకుని దాని మీద, ఎఫ్రాయిము కొమ్మ, అంటే యోసేపు వంశస్థులదీ, వాళ్ళ తోటి వాళ్ళు ఇశ్రాయేలీయులందరిదీ, అని రాయి. ౧౭ అప్పుడు ఆ రెండూ నీ చేతిలో ఒక్కటయ్యేలా ఒక దానితో ఒకటి జోడించు.
౧౮ వీటి అర్థం ఏంటి? అని నీ ప్రజలు నిన్నడిగితే, వాళ్ళకిలా చెప్పు. ౧౯ యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఎఫ్రాయిము చేతిలో ఉన్న కొమ్మ, అంటే ఏ కొమ్మ మీద ఇశ్రాయేలువారందరి పేర్లు, వాళ్ళ తోటివాళ్ళ పేర్లు, నేను ఉంచానో, ఆ యోసేపు అనే ఆ కొమ్మను యూదావాళ్ళ కొమ్మను నేను పట్టుకుని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన కొమ్మగా చేస్తాను. ౨౦ ఆ రెండు కొమ్మలను వాళ్ళ ఎదుట నువ్వు చేతిలో పట్టుకో.
౨౧ వాళ్ళతో ఇలా చెప్పు. యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఇశ్రాయేలీయులు చెదరిపోయిన రాజ్యాలనుంచి నేను వాళ్ళను తెస్తాను. చుట్టుపక్కల ప్రాంతాలనుంచి నేను వాళ్ళను తెస్తాను. వాళ్ళ సొంత దేశంలోకి నేను వాళ్ళను తెస్తాను. ౨౨ వాళ్ళిక మీదట ఎన్నటికీ రెండు రాజ్యాలుగా రెండు జనాలుగా ఉండకుండాా చేస్తాను. ఆ ప్రాంతంలో ఇశ్రాయేలీయుల పర్వతాల మీద వాళ్ళను ఒకే రాజ్యంగా చేసి, వాళ్ళందరికీ ఒక్క రాజునే నియమిస్తాను. ౨౩ తమ విగ్రహాల వలన గానీ తాము చేసిన నీచకార్యాల వలన గానీ ఎలాంటి పాపాల వలన గానీ తమను అపవిత్రం చేసుకోరు. వాళ్ళు పాపాలు చేస్తూ వచ్చిన ప్రతి చోటు నుంచి నేను వాళ్ళను విడిపించి శుద్ధి చేస్తాను. అప్పుడు వాళ్ళు నా ప్రజలవుతారు, నేను వాళ్ళ దేవుడుగా ఉంటాను.
౨౪ నా సేవకుడు, దావీదు వాళ్ళకి రాజుగా ఉంటాడు. వాళ్ళందరికీ ఒకే ఒక కాపరి ఉంటాడు. వాళ్ళు నా విధుల ప్రకారం నడుస్తారు. నా కట్టడలను పాటించి ఆచరిస్తారు. ౨౫ నేను నా సేవకుడు, యాకోబుకు ఇచ్చిన దేశంలో మీ పూర్వీకులు నివసించిన దేశంలో వాళ్ళు నివసిస్తారు. వాళ్ళ పిల్లలూ వాళ్ళ పిల్లల పిల్లలూ అక్కడ ఎప్పుడూ నివసిస్తారు. నా సేవకుడు దావీదు ఎప్పటికీ వాళ్ళకి అధిపతిగా ఉంటాడు.
౨౬ నేను వాళ్ళతో శాంతి ఒడంబడిక చేస్తాను. అది వాళ్ళతో నా నిత్య నిబంధనగా ఉంటుంది. వాళ్ళ సంఖ్య పెరిగేలా చేస్తాను. వాళ్ళ మధ్య నా పవిత్ర స్థలాన్ని ఎప్పటికీ ఉండేలా చేస్తాను. ౨౭ నా నివాసం వాళ్ళతో ఉంటుంది. వాళ్ళు నా ప్రజలవుతారు, నేను వాళ్ళ దేవుడుగా ఉంటాను. ౨౮ వాళ్ళ మధ్య నా పరిశుద్ధస్థలం ఎప్పటికీ ఉంటుంది కాబట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడినని ఇతర రాజ్యాలు తెలుసుకుంటారు.