౪౩
౧ తరువాత అతడు తూర్పువైపు తిరిగి ఉన్న గుమ్మానికి నన్ను తోడుకుని వచ్చాడు.
౨ అప్పుడు నాకు ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావం తూర్పు దిక్కున కనబడింది. దానినుండి పుట్టిన ధ్వని విస్తారమైన జలాల ధ్వనిలాగా వినబడింది. ఆయన మహిమ వలన భూమి ధగధగా మెరిసిపోయింది. ౩ నాకు కనబడిన ఆ దర్శనం, ఆయన పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు నేను చూసిన దర్శనం లాగా ఉంది. కెబారు నది దగ్గర నాకు కనబడిన లాంటి దర్శనాలు చూసి నేను సాగిలపడ్డాను.
౪ తూర్పు వైపు తిరిగి ఉన్న గుమ్మం లోనుండి యెహోవా మహిమ తేజస్సు మందిరంలోకి ప్రవేశించింది. ౫ ఆత్మ నన్ను ఎత్తి లోపలి ఆవరణలోకి తెచ్చినప్పుడు యెహోవా మహిమ తేజస్సుతో మందిరం నిండి ఉంది. ౬ మందిరంలో నుండి ఒకరు నాతో మాటలాడినట్టు నాకు వినబడింది. అప్పుడు నాదగ్గర నిలిచి ఉన్న వ్యక్తి నాతో ఇలా అన్నాడు.
౭  “నరపుత్రుడా, ఇది నా సింహాసన స్థలం, నా పాదపీఠం. ఇక్కడ నేను ఇశ్రాయేలీయుల మధ్య ఎల్లప్పుడూ నివసిస్తాను. ఇకమీదట వారు తమ అపనమ్మకత్వం వలనా తమ రాజుల కళేబరాలకు ఉన్నత స్థలాలను కట్టి పూజలు చేయడం వలనా వారు గాని, వారి రాజులు గాని నా పవిత్రమైన పేరును అపవిత్రం చేయరు. ౮ నాకు, వారికి మధ్య ఒక్క గోడ మాత్రం ఉంచి నా గుమ్మాల పక్కనే వారి గుమ్మాలు, నా ద్వారబంధాల పక్కనే వారి ద్వారబంధాలు నిలబెట్టి, నా పవిత్రమైన పేరుకు ఇక ముందు అవమానం కలిగించరు. వారు చేసిన అకృత్యాల చేత నా పవిత్రమైన పేరును దూషణపాలు చేశారు కాబట్టి నేను ఆగ్రహంతో వారిని నాశనం చేశాను.
౯ ఇకనుండి వారు అపనమ్మకత్వం మాని, తమ రాజుల విగ్రహాలను నా ఎదుట నుండి దూరంగా తొలగిస్తే వారి మధ్యలో నేను ఎల్లకాలం నివసిస్తాను. ౧౦ కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషాలను బట్టి సిగ్గుపడేలా ఈ మందిరం గురించి వారికి వివరించు. వారు దాని నిర్మాణాన్ని జాగ్రత్తగా గమనించాలి. ౧౧ తాము చేసినవాటిని బట్టి వారు పశ్చాత్తాపపడితే, మందిర నిర్మాణాన్ని, దాని వివరాలను, ప్రవేశ, నిర్గమ మార్గాలను, వాటి మర్యాదలను, విధులను, దాని ఆచారాలను, పద్ధతులను వారికి వివరించి, వారు ఆ ఆచారవిధులన్నిటికి లోబడి ఆచరించేలా వారు చూస్తూ ఉండగా వాటిని రాయించు.”
౧౨ ఆ మందిరం గూర్చిన పద్ధతి ఏమంటే, పర్వతం మీద దానితో చేరి ఉన్న స్థలమంతా అతి పవిత్రం. ఇదే మందిరం గూర్చిన విధి. ౧౩ మందిర ఆవరణం కొలతల ప్రకారం బలిపీఠం కొలతలు ఇవి. దాని అడుగుభాగం ఎత్తు అర మీటరు. దాని డొలుపు అర మీటరు ఎత్తు, అర మీటరు వెడల్పు. దాని చుట్టూ దాని అంచు ఎనిమిది సెంటిమీటర్ల వెడల్పుతో విచిత్రమైన పనితో ఉండాలి. ౧౪ నేల మీద బలిపీఠం అడుగుభాగం నుండి కింది చూరుదాకా దాని ఎత్తు ఒక మీటరు. వెడల్పు అర మీటరు. ఈ చిన్న చూరు నుండి పెద్ద చూరు వరకూ 2 మీటర్ల 10 సెంటి మీటర్లు. దాని వెడల్పు అర మీటరు.
౧౫ బలిపీఠం పొయ్యి ఎత్తు 2 మీటర్ల 10 సెంటి మీటర్లు. ఆ అగ్నిగుండం నుండి పైకి నాలుగు కొమ్ములున్నాయి. ౧౬ అది నలు చదరంగాఆరు మీటర్ల 50 సెంటి మీటర్లు కొలత కలిగి ఉంది. ౧౭ పై చూరు పొడవు, వెడల్పు అన్ని వైపులా ఏడు మీటర్ల 60 సెంటి మీటర్లు. దాని చుట్టూ ఉన్న అంచు ఎనిమిది సెంటిమీటర్లు. దాని చుట్టూ కొలత అర మీటరు. దానికి తూర్పు వైపున మెట్లు ఉన్నాయి. ౧౮ అతడు నాతో ఇంకా ఇలా అన్నాడు “నరపుత్రుడా, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఈ బలిపీఠం కట్టిన తరవాత దాని మీద రక్తం చల్లి, దహనబలులు అర్పించడానికి జరిగించ వలసిన పద్ధతులు ఇవి.
౧౯ ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, పరిచర్య చేయడానికి నా సన్నిధికి వచ్చే సాదోకు సంతానమైన యాజకులకు పాప పరిహారార్థబలి అర్పించడానికి ఒక కోడెను ఇవ్వాలి. ౨౦ వారు దాన్ని పాప పరిహారార్థబలిగా అర్పించి, బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేయడానికి దాని రక్తంలో కొంచెం తీసి దాని నాలుగు కొమ్ముల మీదా దాని చూరు నాలుగు మూలల మీదా చుట్టూ ఉన్న అంచు మీదా పూయాలి. ౨౧ తరవాత పాప పరిహారార్థ బలి అయిన ఎద్దును తీసి పరిశుద్ధ స్థలం అవతల మందిరంలోని నియమిత స్థలంలో దాన్ని దహించాలి.
౨౨ రెండో రోజు పాప పరిహారార్థబలిగా ఏ లోపం లేని ఒక మేకపిల్లను అర్పించాలి. కోడెను అర్పించినప్పుడు చేసినట్టే మేకపిల్ల రక్తంతో కూడా బలిపీఠానికి పాపపరిహారం చేయాలి. ౨౩ ఆ విధంగా పాప పరిహారం చేసిన తరవాత ఏ లోపం లేని కోడెను, ఏ లోపం లేని పొట్టేలును అర్పించాలి. ౨౪ వాటిని యెహోవా సన్నిధికి తెచ్చి యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహనబలిగా యెహోవాకు అర్పించాలి.
౨౫ వారు వరసగా ఏడు రోజులు పాప పరిహారార్ధబలిగా ఒక మేకపిల్లను, ఏ లోపం లేని ఒక కోడెను, ఏ లోపం లేని ఒక పొట్టేలును సిద్ధపరచాలి. ౨౬ ఏడు రోజులు యాజకులు బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేస్తూ, దాన్ని శుద్ధి చేస్తూ ప్రతిష్ఠించాలి. ౨౭ ఆ రోజులు అయిన తరవాత ఎనిమిదో రోజు నుండి యాజకులు బలిపీఠం మీద మీ దహనబలులు, సమాధానబలులు అర్పించినప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.