౪౫
౧  “మీరు చీట్లు వేసి దేశాన్ని పంచుకునేటప్పుడు భూమిలో ఒక భాగాన్ని యెహోవాకు అర్పణగా ప్రతిష్ఠించాలి. అది 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల 800 మీటర్ల వెడల్పు ఉండాలి. ఈ సరిహద్దుల్లో ఉన్న భూమి ప్రతిష్ఠితమౌతుంది. ౨ దానిలో పరిశుద్ధ స్థలానికి 270 మీటర్ల నలుచదరమైన స్థలం ఏర్పాటు చేయాలి. దానికి నాలుగు వైపులా 27 మీటర్ల ఖాళీ స్థలం విడిచిపెట్టాలి. ౩ ఈ స్థలం నుండి 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, ఐదు కిలోమీటర్ల 400 మీటర్ల వెడల్పు గల భూమి కొలవాలి. అందులో పవిత్రమైన అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ౪ యెహోవాకు పరిచర్య చేయడానికి ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేసే యాజకులకు కేటాయించిన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలం అవుతుంది. అది వారి ఇళ్ళకోసం ఏర్పాటై, పరిశుద్ధ స్థలానికి ప్రతిష్ఠితంగా ఉంటుంది. మందిరంలో పరిచర్య చేసే లేవీయులు ఇళ్ళు కట్టుకుని నివసించేలా ౫ వారికి స్వాస్థ్యంగా 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు 5 కిలో మీటర్ల 400 మీటర్ల వెడల్పు ఉన్న ఒక ప్రాంతంలో వారి నివాస స్థలాలు ఉంటాయి.
౬ పట్టణం కోసం 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, 2 కిలో మీటర్ల 700 మీటర్ల వెడల్పు ఉన్న ఒక ప్రాంతం ఏర్పాటు చేయాలి. అది ప్రతిష్ఠిత స్థలానికి ఆనుకుని ఉండాలి. ఇశ్రాయేలీయుల్లో ఎవరికైనా అది చెందుతుంది. ౭ ప్రతిష్ఠిత భాగానికి పట్టణానికి ఏర్పాటైన భాగానికి పశ్చిమంగా, తూర్పుగా, రెండు వైపులా రాజు కోసం భూమిని కేటాయించాలి. పశ్చిమం నుండి తూర్పు వరకూ దాన్ని కొలిచినప్పుడు అది ఒక గోత్రస్థానానికి సరిపడిన పొడవు కలిగి ఉండాలి. రాజు నా ప్రజలను బాధింపక వారి గోత్రాల ప్రకారం దేశమంతటినీ ఇశ్రాయేలీయులకు పంచి ఇచ్చేందుకు ౮ అది ఇశ్రాయేలీయుల్లో అతని స్వాస్త్యమైన భూమిగా ఉంటుంది.”
౯ యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు “ఇశ్రాయేలీయుల పాలకులారా, ఇంక చాలు! మీరు జరిగించిన బలాత్కారం, దోపిడి చాలించి నా ప్రజల సొమ్మును దోచుకోక నీతి న్యాయాలను అనుసరించండి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ౧౦ నిక్కచ్చి త్రాసు, నిక్కచ్చి పడి, నిక్కచ్చి తూమును వాడండి. ఒక్కటే కొలత, ఒక్కటే తూము మీరుంచుకోవాలి. ౧౧ తూము పందుంలో పదో పాలుగా ఉండాలి. మీ కొలతకు పందుం ప్రమాణంగా ఉండాలి. ౧౨ ఒక తులానికి 20 చిన్నాలు, ఒక మీనాకు 20 తులాల ఎత్తు, 25 తులాల ఎత్తు, 15 తులాల ఎత్తు ఉండాలి.
౧౩ ప్రతిష్ఠితార్పణలు ఈ ప్రకారంగా చెల్లించాలి. పందుం గోదుమల్లో తూములో ఆరో భాగం, పందుం యవలులో తూములో ఆరో భాగం చెల్లించాలి. ౧౪ తైలం చెల్లించే విధం ఏమిటంటే 180 పళ్ల నూనెలో ఒక పడి, ముప్పాతిక చొప్పున చెల్లించాలి. తూము 180 పళ్లు పడుతుంది. ౧౫ ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి నైవేద్యానికీ దహనబలికీ సమాధానబలికీ బాగా మేపిన గొర్రెల్లో మందకు రెండువందల్లో ఒక గొర్రెను తేవాలి. ౧౬ దేశ ప్రజలందరికీ ఇశ్రాయేలీయుల పాలకునికి చెల్లించాల్సిన ఈ అర్పణ తేవాల్సిన బాధ్యత ఉంది. ౧౭ పండగల్లో, అమావాస్య రోజుల్లో, విశ్రాంతిదినాల్లో, ఇశ్రాయేలీయులు సమావేశమయ్యే నియమిత సమయాల్లో వాడే దహనబలులను, నైవేద్యాలను, పానార్పణలను సరఫరా చేసే బాధ్యత పాలకునిదే. అతడు ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాప పరిహారార్థ బలిపశువులనూ నైవేద్యాలనూ దహనబలులనూ సమాధాన బలిపశువులనూ సిధ్దపరచాలి.”
౧౮ ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే “మొదటి నెల మొదటి రోజున ఏ లోపం లేని కోడెను తెచ్చి పరిశుద్ధ స్థలం కోసం పాప పరిహారార్థబలి అర్పించాలి. ౧౯ ఎలాగంటే యాజకుడు పాప పరిహారార్థబలి పశువు రక్తం కొంచెం తీసి, మందిరపు ద్వారబంధాల మీదా బలిపీఠం చూరు నాలుగు మూలల మీదా లోపటి ఆవరణం వాకిలి ద్వారబంధాల మీదా చల్లాలి. ౨౦ అనుకోకుండా లేక తెలియక పాపం చేసిన ప్రతి ఒక్కరి కోసం మందిరానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రతి నెల ఏడో రోజున ఆ విధంగా చేయాలి.
౨౧ మొదటి నెల 14 వ రోజున పస్కాపండగ ఆచరించాలి. ఏడు రోజులు దాన్ని జరుపుకోవాలి. మీరు పులియని ఆహారం తినాలి. ౨౨ ఆ రోజున పాలకుడు తన కోసం, దేశ ప్రజలందరి కోసం పాప పరిహారార్థబలిగా ఒక ఎద్దును అర్పించాలి. ౨౩ ఏడు రోజులు అతడు ఏ లోపం లేని ఏడు ఎడ్లను, ఏడు పొట్టేళ్ళను తీసుకుని, రోజుకొకటి చొప్పున ఒక ఎద్దును, ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పించాలి. అలాగే ప్రతి రోజూ ఒక్కొక్క మేకపిల్లను పాప పరిహారార్థబలిగా అర్పించాలి. ౨౪ ఒక్కొక్క ఎద్దుకు, పొట్టేలుకు ఒక తూము పిండితో నైవేద్యం చేయాలి. ఒక్క తూముకి మూడు పళ్ల నూనె ఉండాలి. ౨౫ ఏడో నెల 15 వ రోజున పండగ జరుగుతూ ఉండగా యాజకుడు ఏడు రోజులు పాప పరిహారార్థబలి విషయంలో, దహనబలి విషయంలో, నైవేద్యం విషయంలో, నూనె విషయంలో ఆ ప్రకారమే చేయాలి.”