౧ అప్పుడు ప్రవాసం నుండి తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయం కడుతున్న విషయం యూదా, బెన్యామీను ప్రజల శత్రువులకు తెలిసింది. ౨ వారు జెరుబ్బాబెలును, పూర్వికుల వంశాల పెద్దలను కలుసుకుని “మీరు సేవించే దేవుణ్ణి మేము కూడా సేవిస్తున్నాం. ఇక్కడికి మమ్మల్ని రప్పించిన అష్షూరు రాజు ఏసర్హద్దోను కాలం నుండి మేము యెహోవాకు బలులు అర్పిస్తున్నాము. మేము కూడా మీతో కలిసి ఆలయం కడతాం” అని చెప్పారు.
౩ అందుకు జెరుబ్బాబెలు, యేషూవ, ఇశ్రాయేలు పెద్దల్లో మిగిలినవారు “మీరు మాతో కలిసి మా దేవునికి మందిరం కట్టాల్సిన అవసరం లేదు. పర్షియా దేశపు రాజు కోరెషు మాకిచ్చిన అనుమతి ప్రకారం మేమే పూనుకుని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరం కట్టుకుంటాం” అని వారితో చెప్పారు.
౪ ఆ దేశంలో నివాసం ఉంటున్న ప్రజలు యూదులకి ఇబ్బందులు కల్పించారు, ఆలయం కడుతున్న వారిని ఆటంకపరిచి గాయపరిచారు. ౫ అంతేకాక, పర్షియా దేశపు రాజు కోరెషు కాలమంతటిలో, పర్షియా రాజు దర్యావేషు పాలనా కాలం వరకూ ఆలయం కట్టే వారి ప్రయత్నాలు భగ్నం చేయడానికి మంత్రులకు లంచాలు ఇచ్చారు. ౬ ఇంకా అహష్వేరోషు పాలించడం ప్రారంభించినప్పుడు వారు యూదా, యెరూషలేము నివాసుల గురించి ఉత్తరం రాసి వారిపై తప్పుడు నేరాలు ఆరోపించారు.
౭ పర్షియా దేశం రాజు అర్తహషస్త పాలనలో బిష్లాము, మిత్రిదాతు, టాబెయేలు, వారి పక్షంగా ఉన్న మిగిలినవారు అతనికి ఉత్తరం రాసి పంపారు. ఆ ఉత్తరం అరమేయిక్ భాషలో రాయగా దాన్ని తర్జుమా చేశారు. ౮ నిర్వహణ అధికారి రెహూము, కార్యదర్శి షిమ్షయి యెరూషలేము గురించి ఈ విధంగా ఉత్తరం రాసి అర్తహషస్తకు పంపారు.
౯  “నిర్వహణ అధికారి రెహూము, కార్యదర్శి షిమ్షయి, వారి సహచరులు అంటే దీన్, అఫర్సతాక్, తార్పెల్, అఫరాస్, ఎరుకు, బబులోను, షూషను, దెహా, ఏలాము జాతుల వారూ ౧౦ గతంలో ఘనత వహించిన అషుర్ బనిపాల్ షోమ్రోను పట్టణంలో నది ఇవతల వైపున ఉంచిన మిగిలిన ప్రజలు రాస్తున్న విషయాలు.”
౧౧ వీరంతా అర్తహషస్త రాజుకు రాసి పంపిన ఉత్తరం నకలు. “నది ఇవతల వైపు ఉన్న మీ దాసులమైన మేము రాజైన మీకు విన్నవించేదేమంటే, ౧౨ మీ పాలనలో ఉండి మా ప్రాంతానికి వచ్చిన యూదులు యెరూషలేముకు వచ్చి, తిరుగుబాటు చేసే ఆ చెడ్డ పట్టణాన్ని తిరిగి కడుతున్నారు. వారు దాని గోడలు నిలబెట్టి, పునాదులు బాగు చేస్తున్నారు. ౧౩ కాబట్టి రాజైన మీకు తెలియజేసేదేమిటంటే, ఈ పట్టణం గోడలు నిలబెట్టి, పట్టణం కట్టిన పక్షంలో వారు ఇకపై శిస్తుగానీ, సుంకంగానీ, పన్నుగానీ మీకు చెల్లించరు. అప్పుడు రాజుకు వచ్చే రాబడి తగ్గిపోతుంది.
౧౪ మేము రాజు ఉప్పు తిన్నవారం కాబట్టి రాజుకు నష్టం కలగకుండా చూడాలని ఈ ఉత్తరం పంపి రాజైన మీకు ఈ విషయం తెలియచేస్తున్నాం. ౧౫ తమ పూర్వికులు రాయించిన రాజ్యపు దస్తావేజులు చూస్తే, ఈ పట్టణం ప్రజలు తిరుగుబాటు చేసేవారుగా, రాజులకు, దేశాలకు కీడు తలపెట్టేవారనీ, కలహాలు రేపేవారనీ, ఆ కారణం వల్లనే ఈ పట్టణం నాశనానికి గురయిందనీ మీకు తెలుస్తుంది. ౧౬ కాబట్టి రాజువైన మీకు మేము స్పష్టంగా చెప్పేదేమంటే, ఈ పట్టణ నిర్మాణం పూర్తి అయితే, ఇకపై నది ఇవతలి వైపు మీకు హక్కు, అధికారం ఏమీ ఉండదు.”
౧౭ అప్పుడు రాజు ఇలా జవాబు రాయించాడు. “మంత్రి రెహూముకు, కార్యదర్శి షిమ్షయికి, షోమ్రోనులో నివసించేవారి పక్షంగా ఉన్న మిగిలిన వారికి, నది ఆవతల ఉన్న మిగిలిన వారికి క్షేమం కలుగు గాక. ౧౮ మీరు మాకు పంపిన ఉత్తరం ప్రశాంతంగా చదివించుకొన్నాం. ౧౯ దీని విషయం నేనిచ్చిన ఆజ్ఞను బట్టి పరిశీలించినప్పుడు, పూర్వం నుండి ఆ పట్టణ ప్రజలు రాజద్రోహం చేసి, కలహాలు రేపుతూ తిరుగుబాటు చేసే వారని మాకు నిర్ధారణ అయింది. ౨౦ గతంలో యెరూషలేము పట్టణంలో బలవంతులైన రాజులు పాలన చేశారు. వారు నది అవతల ఉన్న దేశాలన్నిటినీ పాలించినందు వల్ల ఆ దేశాలన్నీ వారికి శిస్తు, సుంకం, పన్నులు చెల్లించారు. ౨౧ కాబట్టి మేము అనుమతి ఇచ్చే వరకూ వాళ్ళు ఆ పట్టణ నిర్మాణ పనులు ఆపివేయాలని ఆజ్ఞాపించండి. ౨౨ పని జరగకుండా ఉండేలా తప్పకుండా జాగ్రత్త పడండి. రాజ్యానికి నష్టం, ద్రోహం కలగకుండా చూడండి.”
౨౩ రాజైన అర్తహషస్త పంపిన ఉత్తరంలోని వివరాలు రెహూముకు, షిమ్షయికి, వారి పక్షం వహించిన మిగిలిన వారికి తెలిసింది. వారు వెంటనే యెరూషలేములో నిర్మాణ పనిలో ఉన్న యూదుల దగ్గరికి వచ్చి బలవంతంగా, అధికార పూర్వకంగా పని ఆపించారు. ౨౪ కాబట్టి యెరూషలేములో దేవుని మందిరం నిర్మాణ పని నిలిచిపోయింది. ఈ విధంగా పర్షియా దేశపు రాజు దర్యావేషు పాలనలో రెండో సంవత్సరం వరకూ ఆ పని నిలిచిపోయింది.