౧ అర్తహషస్త చక్రవర్తి పరిపాలనలో బబులోను దేశం నుంచి నాతో కలసి వచ్చిన కుటుంబ నాయకుల వంశావళి ఇది.
౨ ఫీనెహాసు వంశంనుంచి గెర్షోము.
ఈతామారు వంశం నుంచి దానియేలు.
దావీదు వంశం నుంచి హట్టూషు.
౩ పరోషు వంశంలో ఉన్న షెకన్యా వంశంనుంచి జెకర్యా, అతనితో పాటు 150 మంది పురుషులు.
౪ పహత్మోయాబు వంశంలో ఉన్న జెరహ్య కొడుకు ఎల్యోయేనై, అతనితో పాటు 200 మంది పురుషులు.
౫ షెకన్యా వంశంలో ఉన్న యహజీయేలు కొడుకు, అతనితో పాటు 300 మంది పురుషులు.
౬ ఆదీను వంశంలో ఉన్న యోనాతాను కొడుకు ఎబెదు, అతనితో పాటు 50 మంది పురుషులు.
౭ ఏలాము వంశంలో ఉన్న అతల్యా కొడుకు యెషయా, అతనితో పాటు 70 మంది పురుషులు.
౮ షెఫట్య వంశంలో ఉన్న మిఖాయేలు కొడుకు జెబద్యా, అతనితో పాటు 80 మంది పురుషులు.
౯ యోవాబు వంశంలో ఉన్న యెహీయేలు కొడుకు ఓబద్యా, అతనితో పాటు 218 మంది పురుషులు.
౧౦ షెలోమీతు వంశంలో ఉన్న యోసిప్యా కొడుకు, అతనితో పాటు 160 మంది పురుషులు.
౧౧ బేబై వంశంలో ఉన్న బేబై కొడుకు జెకర్యా, అతనితో పాటు 28 మంది పురుషులు.
౧౨ అజ్గాదు వంశంలో ఉన్న హక్కాటా కొడుకు యోహానాను, అతనితో పాటు 110 మంది పురుషులు. ౧౩ అదోనీకాము సంతానంలోని చిన్న కొడుకులు ఎలీపేలెటు, యెహీయేలు, షెమయా, వారితో పాటు 60 మంది పురుషులు.
౧౪ బిగ్వయి వంశంలో ఉన్న ఊతై, జబ్బూదు, వారితో ఉన్న 70 మంది పురుషులు.
౧౫ నేను వీరందరినీ అహవా వైపు ప్రవహించే నది దగ్గర సమకూర్చాను. అక్కడ మేము మూడు రోజులు గుడారాలు వేసుకుని ఉన్నాం. అప్పుడు నేను అక్కడి ప్రజలను, యాజకులను పరిశీలించగా ఒక్క లేవీ గోత్రికుడూ నాకు కనబడలేదు. ౧౬ అప్పుడు నేను పెద్దలైన ఎలీయెజెరు, అరీయేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లం అనే వారిని, ఉపదేశకులైన యోయారీబు ఎల్నాతాను అనే వారిని పిలిపించాను.
౧౭ కాసిప్యా ప్రాంతంలో ఉండే ఇద్దో అనే అధికారి దగ్గరికి వారిని పంపించాను. మా దేవుని మందిరంలో సేవ చేసేందుకు పరిచారకులను మా దగ్గరికి తీసుకు వచ్చేలా కాసిప్యా ప్రాంతంలో ఉండే ఇద్దోతో, అతని బంధువులైన దేవాలయ సేవకులతో చెప్పవలసిన మాటలు వారికి తెలియజేశాను.
౧౮ మన దేవుని కరుణా హస్తం మాకు కాపుదలగా ఉన్నందువల్ల వారు షేరేబ్యాను, అతని కుమారులు, సహోదరులతో కలిపి మొత్తం 18 మందిని వెంటబెట్టుకు వచ్చారు. ఈ షేరేబ్యా గొప్ప మేధావి. ఇతడు ఇశ్రాయేలుకు పుట్టిన లేవి వంశస్థుడైన మహలి కొడుకుల్లో ఒకడు. ౧౯ వారు హషబ్యాను, అతనితో మెరారీ వంశీయుడు యెషయాను అతని బంధువులను, వారి కొడుకులను మొత్తం 20 మందిని తీసుకువచ్చారు. ౨౦ లేవీయులు జరిగించే సేవలో సహాయం చేయడానికి దావీదు, అతని అధిపతులు నియమించిన దేవాలయ సేవకుల్లో 220 మంది వచ్చారు. వీరందరినీ వారి పేరుల ప్రకారం నియమించారు.
౨౧ అప్పుడు దేవుని సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుని మాకూ, మా సంతానానికి, మా ఆస్తిపాస్తులకు క్షేమకరమైన ప్రయాణం జరిగేలా దేవుణ్ణి వేడుకోవడానికి అహవా నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించాలని ప్రకటించాను. ౨౨ ఆయన్ను వేడుకునే వారికి క్షేమం కలిగించడానికి మన దేవుని హస్తం కాపుదలగా ఉంటుంది గానీ, ఆయనను తిరస్కరించే వారి పైకి ఆయన తీవ్రమైన కోపం రగులుకొంటుందని మేము రాజుతో చెప్పాం. అందువల్ల దారి మధ్యలో శత్రువుల బారి నుండి మమ్మల్ని కాపాడడానికి సైనికులను, గుర్రపు రౌతులను సహాయంగా పంపమని రాజును అడిగేందుకు నాకు సిగ్గు అనిపించింది.
౨౩ ఈ విషయాన్ని బట్టి మేము ఉపవాసం ఉండి దేవుని వేడుకొన్నప్పుడు ఆయన మా విన్నపం ఆలకించాడు. ౨౪ నేను యాజకుల్లో ముఖ్యమైన 12 మందిని, షేరేబ్యా, హషబ్యా, వీరి బంధువుల్లో 10 మందిని సిద్ధం చేశాను. ౨౫ మన దేవుని ఆలయం నిలబెట్టడానికి దేశపు రాజు, అతని మంత్రులు, అధిపతులు, ఇంకా అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులంతా సమర్పించిన వెండి బంగారాలను, ఇతర సామగ్రిని బరువు తూచి వారికి అప్పగించాను.
౨౬ 1,300 మణుగుల వెండి, 200 మణుగుల వెండి వస్తువులు, 200 మణుగుల బంగారం, ౨౭ 7,000 తులాల బరువున్న 20 బంగారపు గిన్నెలు, బంగారమంత ఖరీదైన పరిశుద్ధమైన రెండు రాగి పాత్రలు లెక్కబెట్టి ౨౮ వారికి అప్పగించి “మీరు యెహోవాకు ప్రతిష్ట అయినవారు, పాత్రలు కూడా ప్రతిష్ట అయినాయి. ఈ వెండి బంగారాలు మీ పూర్వీకుల దేవుడైన యెహోవా కోసం ఇచ్చిన అర్పణలు.
౨౯ కాబట్టి మీరు యెరూషలేములో ఉన్న యెహోవా ఆలయం ఖజానా గదుల్లో యాజకుల, లేవీయుల, ఇశ్రాయేలు పెద్దల, ప్రధానుల సమక్షంలో వాటి బరువు తూచి లెక్క అప్పగించేదాకా వీటిని జాగ్రత్తగా ఉంచండి” అని వారితో చెప్పాను. ౩౦ యాజకులు, లేవీయులు వాటి లెక్క, బరువు సరిచూసుకుని, యెరూషలేములో ఉన్న మన దేవుని మందిరానికి తీసుకు వెళ్ళడానికి ఆ వెండి బంగారు పాత్రలను, ఇతర సామగ్రిని తీసుకున్నారు.
౩౧ మేము మొదటి నెల 12 వ రోజుకు యెరూషలేము చేరుకోవాలని అహవా నది దగ్గర నుండి బయలుదేరాం. మా దేవుని హస్తం మాకు కావలిగా ఉండి, శత్రువుల బారి నుండి, దారిలో కాపు కాసి ఉన్నవారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందువల్ల ౩౨ మేము యెరూషలేముకు వచ్చి మూడు రోజులు అక్కడ బస చేశాం. ౩౩ నాలుగో రోజు వెండి బంగారు పాత్రలను మన దేవుని మందిరంలో యాజకుడైన ఊరియా కొడుకు మెరేమోతు కాటా వేశాడు. అతనితో పాటు ఫీనెహాసు కొడుకు ఎలియాజరు, లేవీ గోత్రికుడైన యేషూవ కొడుకు యోజాబాదు, బిన్నూయి కొడుకు నోవద్యా కూడా అక్కడ ఉన్నారు.
౩౪ తీసుకువచ్చిన సామగ్రి లెక్క ప్రకారం, బరువు ప్రకారం అన్నిటినీ సరిచూసి వాటి మొత్తం బరువు ఎంతో పుస్తకంలో రాశారు. ౩౫ చెరలోకి వెళ్ళిన వారికి పుట్టి చెర నుండి విడుదలై, తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలు దేవునికి దహన బలులు అర్పించారు. ఇశ్రాయేలీయులందరి పక్షంగా 12 ఎద్దులను, 96 పొట్టేళ్ళను, 77 గొర్రెపిల్లలను అర్పించారు. పాపపరిహారార్థ బలి కోసం 12 మేకపోతులు తెచ్చి అన్నిటినీ దహనబలిగా యెహోవాకు అర్పించారు. ౩౬ చక్రవర్తి ఇచ్చిన ఆజ్ఞలు ఉన్న దస్తావేజులను నది ఇవతల ఉన్న రాజు సేనాధిపతులకు, అధికారులకు అప్పగించారు. అప్పుడు వారు ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని ఆలయం పనికి సహాయం చేశారు.