౧౯
౧ ఆ సాయంత్రం ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరుకున్నారు. ఆ సమయంలో లోతు సొదొమ పట్టణ ప్రధాన ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. లోతు దేవదూతలను చూడగానే వారిని కలుసుకోవడానికి వారికి ఎదురు వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ౨ వారితో ఇలా అన్నాడు “నా ప్రభువులారా, దయచేసి మీ దాసుడైన నా ఇంటికి రండి. వచ్చి కాళ్ళు కడుక్కోవాలనీ, ఈ రాత్రి గడపాలనీ వేడుకుంటున్నాను. తిరిగి తెల్లవారే లేచి మీ ప్రయాణం కొనసాగించవచ్చు.” అన్నాడు. అందుకు వాళ్ళు “అలా కాదు. మేము వీధిలోనే ఈ రాత్రి గడుపుతాం.” అన్నారు. ౩ కానీ అతడు వాళ్ళను చాలా బలవంతపెట్టాడు. వారు అతనితో కలసి అతని ఇంటికి వెళ్ళారు. అతడు వారికి విందు చేశాడు. అతడు వారి కోసం పొంగని రొట్టెలు కాల్చి ఇచ్చాడు. వారు భోజనం చేశాడు.
౪ అయితే వాళ్ళు నిద్రపోయే ముందే ఆ పట్టణ మనుషులు అంటే సోదొమలోని యువకులూ, వృద్ధులూ పట్టణం నలుమూలల నుండీ వచ్చిన మనుషులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ౫ వాళ్ళు లోతును పిలిచారు. “ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చిన మనుషులు ఏరీ? మేము వారితో లైంగిక సంబంధం పెట్టుకోవాలి. వాళ్ళను బయటకు తీసుకు రా” అన్నారు.
౬ దాంతో లోతు బయటి ద్వారం దగ్గర ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. తన వెనకే తలుపు మూసివేశాడు. ౭  “సోదరులారా, ఇంత దుర్మార్గమైన పని చేయవద్దు. ౮ చూడండి. పురుష సంబంధం లేని ఇద్దరు కూతుళ్ళు నాకు ఉన్నారు. మీరు ఒప్పుకుంటే వారిని మీ దగ్గరికి తీసుకుని వస్తాను. వారిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కానీ ఈ వ్యక్తులను మాత్రం ఏమీ చేయవద్దు. వాళ్ళు నా ఇంటికి వచ్చిన అతిధులు” అన్నాడు.
౯ కానీ వాళ్ళు “నువ్వు అవతలికి పో” అన్నారు. ఇంకా వాళ్ళు “వీడు మన మధ్యలో పరదేశిగా నివసించాడు. ఇప్పుడు మనకు తీర్పరి అయ్యాడు చూడండి! ఇప్పుడు వాళ్ళపైన కంటే నీపై ఎక్కువ దౌర్జన్యం చేస్తాం” అన్నారు. అలా అని వాళ్ళంతా లోతుపై దొమ్మీగా పడి తలుపు పగలగొట్టడానికి పూనుకున్నారు.
౧౦ అయితే ఆ దూతలు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి లాగేశారు. ఆ వెనుకే తలుపు మూసేశారు. ౧౧ అప్పుడు లోతు అతిథులు పిల్లల నుండి పెద్దల వరకూ ఆ తలుపు దగ్గర ఉన్న వాళ్ళందరికీ గుడ్డితనం కలుగజేశారు. దాంతో వాళ్ళు తలుపు ఎక్కడ ఉందో వెదికీ వెదికీ విసిగిపోయారు.
౧౨ అప్పుడు ఆ దూతలు లోతుతో “ఇక్కడ నీ వారు ఇంకా ఎవరన్నా ఉన్నారా? నీ అల్లుళ్ళూ, కొడుకులూ, కూతుళ్ళూ ఈ ఊరిలో నీకు కలిగినవారందర్నీ బయటకు తీసుకురా. ౧౩ మేము ఈ ప్రాంతాన్నంతా ధ్వంసం చేయడానికి వచ్చాం. ఈ ప్రజలకు వ్యతిరేకంగా గొప్ప మొర యెహోవా సముఖానికి చేరింది. అందుకని వాళ్ళను నాశనం చేయడానికి యెహోవా మమ్మల్ని పంపించాడు” అన్నారు.
౧౪ అప్పుడు లోతు బయటకు వెళ్ళి తన కూతుళ్ళను పెళ్లి చేసుకోబోతున్న తన అల్లుళ్ళతో మాట్లాడాడు. “త్వరగా రండి. ఇక్కడినుండి బయట పడాలి. యెహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు” అని చెప్పాడు. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి హాస్యమాడుతున్నవాడిలా కనిపించాడు. ౧౫ ఉదయం అయినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టారు. “రా, రా, బయల్దేరు. ఈ ఊరికి కలుగబోయే శిక్షలో తుడిచి పెట్టుకుపోకుండా నీ భార్యనూ ఇక్కడే ఉన్న నీ ఇద్దరు కూతుళ్లనూ తీసుకుని బయల్దేరు” అన్నారు.
౧౬ అయితే అతడు ఆలస్యం చేసాడు. యెహోవా అతని పట్ల కనికరం చూపడం వల్ల ఆ మనుషులు అతని చేతినీ, అతని భార్య చేతినీ అతని ఇద్దరు కూతుళ్ళ చేతులనూ పట్టుకున్నారు. వాళ్ళని బయటకు తీసుకువచ్చారు. అలానే పట్టణం బయటకు తీసుకువచ్చారు. ౧౭ ఆ దూతలు వారిని పట్టణం బయటకు తీసుకు వచ్చిన తరువాత వాళ్ళలో ఒకడు “మీ ప్రాణాలు దక్కించుకోవడం కోసం పారిపొండి. వెనక్కు తిరిగి చూడవద్దు. మైదాన ప్రాంతాల్లో ఎక్కడా ఆగవద్దు. మీరు తుడిచి పెట్టుకుపోకుండేలా పర్వతాల్లోకి పారిపోయి తప్పించుకోండి” అని చెప్పాడు.
౧౮ అప్పుడు లోతు “ప్రభువులారా, అలా కాదు. ౧౯ మీ సేవకుడినైన నన్ను దయ చూశారు. నా ప్రాణాన్ని రక్షించి నా పట్ల మీ మహా కనికరాన్ని ప్రదర్శించారు. కానీ నేను ఆ పర్వతాలకు పారిపోయి తప్పించుకోలేను. ఆ పర్వతాలను చేరుకునే లోపుగానే ఏదైనా కీడు నాపైకి వస్తుందేమో. అలా జరిగి నేను ఇక్కడే చనిపోతానేమో. ౨౦ చూడండి, నేను పారిపోవడానికి ఆ కనిపించే ఊరు దగ్గర్లో ఉంది. నన్ను అక్కడికి వెళ్ళనివ్వండి. అది చిన్నది గదా, నేను బతుకుతాను” అన్నాడు.
౨౧ అప్పుడు ఆయన “అలాగే, ఈ మనవి కూడా అంగీకరిస్తున్నాను. నువ్వు చెప్పిన ఈ ఊరిని నేను నాశనం చేయను. ౨౨ నువ్వు త్వరపడి, అక్కడికి వెళ్లి తప్పించుకో. నువ్వు అక్కడకు చేరుకునే వరకూ నేను ఏమీ చేయలేను” అన్నాడు. కాబట్టి ఆ ఊరికి సోయరు అనే పేరు వచ్చింది.
౨౩ లోతు సోయరు చేరేటప్పటికి ఆ దేశంపై సూర్యుడు ఉదయించాడు. ౨౪ అప్పుడు సొదొమ గొమొర్రాల పైన ఆకాశం నుండి యెహోవా గంధకాన్నీ అగ్నినీ కురిపించాడు. ౨౫ ఆయన ఆ పట్టణాలనూ, ఆ మైదానమంతటినీ, ఆ పట్టణాల్లో నివసించేవారందరినీ, నేలపై మొక్కలనూ నాశనం చేశాడు.
౨౬ కానీ లోతు వెనుకే వస్తున్న అతని భార్య వెనక్కి తిరిగి చూసింది. వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది.
౨౭ ఉదయమైంది. అబ్రాహాము లేచి తాను అంతకుముందు యెహోవా సముఖంలో నిలబడిన చోటుకు వచ్చాడు. ౨౮ అక్కడి నుండి సొదొమ, గొమొర్రాల వైపు, ఆ మైదాన ప్రాంతం మొత్తాన్నీ చూశాడు. కొలిమిలోనుండి లేచే పొగ లాగా ఆ ప్రాంతం అంతా పొగలు వస్తూ కనిపించింది.
౨౯ ఆ విధంగా దేవుడు ఆ మైదానపు పట్టణాలను నాశనం చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నాడు. లోతు కాపురమున్న పట్టణాలను ధ్వంసం చేసినప్పుడు ఆ విధ్వంసంలో లోతు నాశనం కాకుండా తప్పించాడు.
౩౦ అయితే లోతు సోయరులో ఉండటానికి భయపడ్డాడు. తన ఇద్దరు కూతుళ్ళనూ తీసుకుని పర్వత ప్రాంతానికి వెళ్లిపోయాడు. అక్కడ తన ఇద్దరు కూతుళ్ళతో కలసి ఒక గుహలో నివసించాడు.
౩౧ ఇలా ఉండగా అతని పెద్ద కూతురు తన చెల్లితో “నాన్న ముసలివాడయ్యాడు. ఈ లోకరీతిగా మనతో శారీరిక సంబంధం పెట్టుకోడానికి ఏ పురుషుడూ లేడు. ౩౨ నాన్నకు ద్రాక్షారసం తాగిద్దాం. తరువాత అతనితో శారీరిక సంబంధం పెట్టుకుందాం. ఆ విధంగా నాన్న ద్వారా మనకు సంతానం కలిగేలా చేసుకుందాం, పద” అని చెప్పింది. ౩౩ ఆ రాత్రి వాళ్ళు తమ తండ్రికి ద్రాక్షారసం తాగించారు. ఆ తరువాత అతని పెద్ద కూతురు లోపలికి వెళ్ళి తన తండ్రితో శారీరక సంబంధం పెట్టుకుంది. కాని ఆమె ఎప్పుడు తన పక్కన పడుకుందో, ఎప్పుడు లేచి వెళ్లిందో అతనికి తెలియలేదు.
౩౪ మరునాడు అక్క తన చెల్లిని చూసి ఇలా అంది. “నిన్న రాత్రి నేను నాన్నతో పడుకున్నాను. ఈ రాత్రి కూడా అతనికి ద్రాక్షారసం తాగిద్దాం. ఆ తరువాత నువ్వు లోపలి వెళ్లి అతనితో కలిసి పండుకో. అలా మనం నాన్న ద్వారా సంతానం పొందుదాం” అంది. ౩౫ ఆ రాత్రి కూడా వాళ్ళు తమ తండ్రికి ద్రాక్షారసం తాగించారు. అప్పుడు అతని చిన్న కూతురు వెళ్ళి తన తండ్రితో పడుకుంది. ఆమె ఎప్పుడు తన పక్కన పడుకుందో, ఎప్పుడు లేచి వెళ్ళిందో అతనికి తెలియలేదు.
౩౬ ఆ విధంగా లోతు ఇద్దరు కూతుళ్ళూ తమ తండ్రి మూలంగా గర్భం ధరించారు. ౩౭ అతని పెద్ద కూతురు ఒక కొడుక్కి జన్మనిచ్చింది. వాడికి మోయాబు అనే పేరు పెట్టింది. అతడే నేటి మోయాబీయులకు మూల పురుషుడు. ౩౮ లోతు రెండో కూతురు కూడా ఒక కొడుకుని కని వాడికి “బెన్ అమ్మి” అనే పేరు పెట్టింది. నేటి అమ్మోనీయులకు అతడే మూలపురుషుడు.