౩౮
౧ ఆ కాలంలో యూదా తన సోదరులను విడిచిపెట్టి హీరా అనే ఒక అదుల్లాము వాడితో నివసించాడు. ౨ అక్కడ షూయ అనే ఒక కనానీ యువతిని చూసి ఆమెను వివాహమాడి ఆమెతో కాపురం చేశాడు. ౩ ఆమె గర్భవతి అయ్యి ఒక కొడుకును కన్నప్పుడు వాడికి ఏరు అని పేరు పెట్టారు. ౪ ఆమె మళ్ళీ గర్భం ధరించి మరొక కొడుకును కని వాడికి ఓనాను అని పేరు పెట్టింది. ౫ ఆమె మళ్ళీ గర్భం ధరించి మూడవ కొడుకును కని వాడికి షేలా అని పేరు పెట్టింది. వారు కజీబులో ఉన్నప్పుడు ఆమె వాణ్ణి కన్నది.
౬ యూదా తన పెద్ద కొడుకు ఏరుకి తామారు అనే యువతిని పెళ్ళి చేశాడు. ౭ యూదా జ్యేష్ఠ కుమారుడు ఏరు యెహోవా దృష్టికి దుష్టుడు కాబట్టి యెహోవా అతణ్ణి చంపాడు. ౮ అప్పుడు యూదా ఓనానుతో “నీ అన్నభార్య దగ్గరికి వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకి సంతానం కలిగించు” అని చెప్పాడు. ౯ ఓనాను ఆ సంతానం తనది కాబోదని తెలిసి ఆమెతో పండుకున్నప్పుడు తన అన్నకి సంతానం కలగకూడదని తన వీర్యాన్ని నేలపై విడిచాడు. ౧౦ అతడు చేసింది యెహోవా దృష్టికి చెడ్డది కాబట్టి ఆయన అతణ్ణి కూడా చంపాడు. ౧౧ అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల్లాగా చనిపోతాడేమో అని భయపడి “నా కుమారుడు షేలా పెద్దవాడయ్యే వరకూ నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు” అని తామారుతో చెప్పాడు. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట్లో నివసించింది.
౧౨ చాలా రోజుల తరువాత యూదా భార్య అయిన షూయ కూతురు చనిపోయింది. తరువాత యూదా దుఃఖనివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అనే తన స్నేహితుడితో కలిసి తిమ్నాతులో తన గొర్రెల బొచ్చు కత్తిరించే వారి దగ్గరికి వెళ్ళాడు. ౧౩ తన మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాతుకు వెళ్తున్నాడని తామారుకు తెలిసింది. ౧౪ షేలా పెద్దవాడైనప్పటికీ తనను అతనికి భార్యగా తీసుకోకుండా ఉండడం చూసి తామారు తన విధవరాలి బట్టలు తీసివేసి, ముసుగు వేసుకుని, శరీరమంతా కప్పుకుని, తిమ్నాతుకు వెళ్ళే మార్గంలో ఏనాయిము అనే ద్వారం దగ్గర కూర్చుంది.
౧౫ యూదా ఆమెను చూసి, ఆమె ముఖం కప్పుకుని ఉండడం వలన ఆమె వేశ్య అనుకుని, ౧౬ ఆమె దగ్గరికి వెళ్ళి, ఆమె తన కోడలని తెలియక “నీతో సుఖిస్తాను, రా” అని పిలిచాడు. అందుకు ఆమె “నువ్వు నాతో సుఖించినందుకు నాకేమిస్తావు?” అని అడిగింది. ౧౭ అందుకు అతడు “నా మందలో నుండి ఒక మేక పిల్లను పంపుతాను” అన్నాడు. ఆమె “అది పంపే వరకూ ఏమైనా తాకట్టు పెడితే సరే” అని అంది. ౧౮ అతడు “ఏమి తాకట్టు పెట్టమంటావ్?” అని ఆమెను అడిగాడు. ఆమె “నీ ముద్ర, దాని దారం, నీ చేతికర్ర” అని చెప్పింది. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో వెళ్ళాడు. ఆమె అతని వలన గర్భవతి అయ్యింది.
౧౯ అప్పుడామె లేచి వెళ్లిపోయి ముసుగు తీసేసి తన విధవరాలి వస్త్రాలు ధరించింది. ౨౦ తరవాత యూదా ఆ స్త్రీ దగ్గర నుండి ఆ తాకట్టు వస్తువులను తీసుకోడానికి తన స్నేహితుడయిన అదుల్లామీయుడి ద్వారా మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు.
౨౧ కాబట్టి అతడు “ఆ మార్గంలో ఏనాయిము దగ్గర కనిపించిన ఆ వేశ్య ఎక్కడ ఉంది?” అని అక్కడి మనుషులను అడిగాడు. అయితే వారు “ఇక్కడ వేశ్య ఎవరూ లేదు” అని అతనికి చెప్పారు. ౨౨ కాబట్టి అతడు యూదా దగ్గరికి తిరిగి వెళ్ళి “ఆమె నాకు కనబడలేదు. అంతేగాక, అక్కడి మనుషులు ఇక్కడికి వేశ్య ఎవరూ రాలేదని చెప్పారు” అన్నాడు. ౨౩ యూదా “మనలను అపహాస్యం చేస్తారేమో, ఆమె వాటిని ఉంచుకోనీ. నేను నీతో ఈ మేక పిల్లను పంపాను, ఆమె నీకు కనబడలేదు” అని అతనితో అన్నాడు.
౨౪ సుమారు మూడు నెలలైన తరువాత “నీ కోడలు తామారు జారత్వం జరిగించింది. అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయ్యింది” అని యూదాకు కబురొచ్చింది. అప్పుడు యూదా “ఆమెను తీసుకు రండి, ఆమెను సజీవ దహనం చెయ్యాలి” అని చెప్పాడు. ౨౫ ఆమెను బయటికి తీసుకు వచ్చినప్పుడు, ఆమె తన మామ దగ్గరికి అతని వస్తువులను పంపి “ఇవి ఎవరివో ఆ మనిషి వలన నేను గర్భవతినయ్యాను. ఈ ముద్ర, ఈ దారం, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తు పట్టండి” అని చెప్పించింది. ౨౬ యూదా వాటిని గుర్తు పట్టి “నేను నా కుమారుడు షేలాను ఆమెకు ఇయ్యలేదు కాబట్టి ఆమె నాకంటే నీతి గలది” అని చెప్పి ఇంకెప్పుడూ ఆమెతో పండుకోలేదు.
౨౭ నెలలు నిండినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు. ౨౮ ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాపాడు. మంత్రసాని ఒక ఎర్ర దారం వాడి చేతికి కట్టి “వీడు మొదట బయటికి వచ్చాడు” అని చెప్పింది. ౨౯ వాడు తన చెయ్యి వెనక్కి తీయగానే అతని సోదరుడు బయటికి వచ్చాడు. అప్పుడామె “నువ్వెందుకురా చొచ్చుకు వచ్చావు?” అంది. అందుచేత వాడికి “పెరెసు” అని పేరు పెట్టారు. ౩౦ ఆ తరువాత చేతికి దారం కట్టి ఉన్న అతని సోదరుడు బయటికి వచ్చాడు. అతనికి “జెరహు” అని పేరు పెట్టారు.