౧౧
౧  “ఇశ్రాయేలు పసిప్రాయంలో నేను అతనిపట్ల ప్రేమగలిగి,
నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలోనుండి పిలిచాను.
౨ వారిని ఎంతగా పిలిస్తే బయలు దేవుళ్ళకు వారు అంత ఎక్కువగా బలులు అర్పించారు.
విగ్రహాలకు ధూపం వేశారు.
౩ ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాణ్ణి నేనే.
వారి చేతులు పట్టుకుని పైకి లేపిన వాణ్ణి నేనే.
నేనే వారిని పట్టించుకున్నాను అనే సంగతి వారికి తెలియదు.
౪ మానవత్వపు బంధంతో వారిని నడిపించాను.
స్నేహబంధాలతో తోడుకుపోయాను.
వారి పళ్ళ మధ్య నుంచి కాడిని తీసిన వాడిలా నేను వారికి ఉన్నాను.
వంగి వారికి అన్నం తినిపించాను.
౫ ఐగుప్తు దేశానికి వారు మళ్ళీ తిరిగి పోరా?
నా దగ్గరకి తిరిగి రావడానికి నిరాకరించినందుకు అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయడా?
౬ వారి పథకాలను బట్టి యుద్ధం వారి పట్టణాలను ఆవరిస్తుంది.
అది వారి పట్టణపు గడియలు విరగ్గొడుతుంది. వారిని నాశనం చేస్తుంది.
౭ నా నుండి తిరిగిపోవాలని నా ప్రజలు తీర్మానం చేసుకున్నారు.
మహోన్నతుడినైన నాకు మొర పెట్టినా ఎవడూ నన్ను ఘనపరచడు.
౮ ఎఫ్రాయిమూ, నేనెలా నిన్ను విడిచిపెడతాను?
ఇశ్రాయేలూ, నేను నిన్ను శత్రువులకు ఎలా అప్పగిస్తాను?
అద్మాలాగా నిన్ను నేను ఎలా చేస్తాను?
సెబోయీముకు చేసినట్టు నీకు ఎలా చేస్తాను?
నా మనస్సు మారింది. నా కనికరం రేగింది.
౯ నా ఉగ్రతాగ్నిని మీపై కురిపించను.
నేను మళ్లీ ఎఫ్రాయిమును లయపరచను.
నేను దేవుణ్ణి, మనిషిని కాను. మీ మధ్య ఉన్న పవిత్రుణ్ణి.
నా ఉగ్రతతో బయలు దేరను.
౧౦ వారు యెహోవా వెంట నడుస్తారు.
సింహం గర్జించినట్టు నేను గర్జిస్తాను.
నేను గర్జించగా పశ్చిమ దిక్కున ఉన్న ప్రజలు వణకుతూ వస్తారు.
౧౧ వారు వణకుతూ పక్షులు ఎగిరి వచ్చినట్టు ఐగుప్తు దేశంలో నుండి వస్తారు.
గువ్వల్లాగా అష్షూరు దేశంలోనుండి ఎగిరి వస్తారు.
నేను వారిని వారి నివాసాల్లో కాపురముంచుతాను.” ఇదే యెహోవా వాక్కు.
౧౨ ఎఫ్రాయిము వారు నా చుట్టూ అబద్ధాలు అల్లారు.
ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించారు.
కానీ యూదా వారు ఇంకా నాతోనే ఉన్నారు.
పరిశుద్ధ దేవునికి నమ్మకంగానే ఉన్నారు.