౧౩
౧ బబులోనును గూర్చి ఆమోజు కొడుకు యెషయా స్వీకరించిన ప్రకటన.
౨ చెట్లు లేని కొండ మీద గుర్తు కోసం ఒక జెండా పాతండి. ప్రజలు ప్రధానుల ద్వారాల్లో ప్రవేశించమని కేకపెట్టి వాళ్ళను పిలిచి, చెయ్యి ఊపి సైగ చెయ్యండి.
౩ నాకు ప్రతిష్ఠితులైన వాళ్లకు నేను ఆజ్ఞ ఇచ్చాను. నా కోపం అమలు చెయ్యమని నా శూరులను పిలిచాను. నా ప్రభావాన్నిబట్టి ఆనందించే వాళ్ళను పిలిపించాను.
౪ కొండల్లో ఒక పెద్ద జనసమూహం ఉన్నట్టు వినిపిస్తున్న ఆ శబ్దం వినండి. సమకూడుతున్న రాజ్యాల ప్రజలు చేసే అల్లరి శబ్దం వినండి. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా యుద్ధం కోసం తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాడు.
౫ సర్వలోకాన్ని పాడు చెయ్యడానికి దూర దేశం నుంచీ, ఆకాశపు అంచుల నుంచీ యెహోవా, ఆయన తీర్పు అమలు చేసే సాధనాలు వస్తున్నారు.
౬ బిగ్గరగా అరవండి, ఎందుకంటే, యెహోవా దినం దగ్గరపడింది. అది సర్వశక్తుడైన దేవుని దగ్గర నుండి విధ్వంసం తెస్తుంది.
౭ అందువలన చేతులన్నీ బలహీనమై వేలాడతాయి, ప్రతివాడి గుండె కరిగిపోతుంది.
౮ ప్రజలు భయభ్రాంతులౌతారు. పురిటినొప్పులు పడే స్త్రీలాగా వాళ్లకు వేదనలు, దుఃఖాలు కలుగుతాయి. ఒకరినొకరు విస్తుపోయి చూసుకుంటారు. వాళ్ళ ముఖాలు మండిపోతూ ఉంటాయి.
౯ యెహోవా దినం వస్తోంది. దేశాన్ని పాడు చెయ్యడానికీ, పాపులు దానిలో ఉండకుండా పూర్తిగా నాశనం చెయ్యడానికీ క్రూరమైన ఉగ్రతతో, ప్రచండమైన కోపంతో అది వస్తోంది.
౧౦ ఆకాశ నక్షత్రాలు, నక్షత్రరాసులు తమ వెలుగును ఇయ్యవు. ఉదయం నుంచే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు ప్రకాశించడు.
౧౧ చెడుతనాన్నిబట్టి ఈ లోకాన్నీ, తమ దోషాన్నిబట్టి దుష్టులనూ శిక్షిస్తాను. గర్విష్టుల అహంకారం అంతమొందిస్తాను. క్రూరుల అహంకారం అణిచివేస్తాను.
౧౨ బంగారం కన్నా మనుషులనూ, ఓఫీరు దేశపు సువర్ణం కన్నా మానవజాతినీ అరుదుగా ఉండేలా చేస్తాను.
౧౩ సైన్యాలకు అధిపతి అయిన యెహోవా కోపాగ్ని కురిసే రోజున, ఆయన ఉగ్రతకు ఆకాశం వణికేలా, భూమి తన స్థానం తప్పేలా నేను చేస్తాను.
౧౪ అప్పుడు వేటకు గురైన జింకలాగా, పోగుచెయ్యని గొర్రెల్లాగా ప్రజలు తమ తమ స్వజాతి వైపు తిరుగుతారు. తమ స్వదేశాలకు పారిపోతారు.
౧౫ దొరికిన ప్రతివాడూ కత్తివాత కూలుతాడు. బందీగా దొరికిన ప్రతివాడూ ఖడ్గంతో చనిపోతాడు.
౧౬ వాళ్ళు చూస్తూ ఉండగా వాళ్ళ పసిపిల్లలను విసిరి కొట్టినప్పుడు ముక్కలౌతారు. వాళ్ళ ఇళ్ళు దోపిడీ అవుతాయి. వాళ్ళ భార్యలు అత్యాచారానికి గురౌతారు.
౧౭ చూడు, వాళ్ళ మీద దాడి చెయ్యడానికి నేను మాదీయులను రేపడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు వెండిని పట్టించుకోరు. బంగారం కూడా వాళ్ళకు ఆనందం కలిగించదు.
౧౮ వాళ్ళ బాణాలు యువకులను చీలుస్తాయి. దూసుకుపోతాయి. వాళ్ళు పిల్లలను విడిచిపెట్టరు, పసిపిల్లల మీద దయ చూపించరు.
౧౯ అప్పుడు రాజ్యాల్లో గొప్పదిగా, కల్దీయుల శోభకూ, అతిశయానికీ కారణమైన బబులోను, దేవుడు పాడుచేసిన సొదొమ గొమొర్రాల్లాగా అవుతుంది.
౨౦ అది ఇంకెన్నడూ నివాసస్థలంగా ఉండదు. తరతరాల్లో ఇంక దానిలో ఎవడూ కాపురం ఉండడు. అరబీయుడు అక్కడ తన గుడారం వెయ్యడు. గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ విశ్రాంతి తీసుకోనివ్వరు.
౨౧ ఎడారి మృగాలు అక్కడ ఉంటాయి. వాళ్ళ ఇళ్ళ నిండా గుడ్లగూబలు, నిప్పుకోళ్ళూ ఉంటాయి. కొండమేకలు అక్కడ గంతులు వేస్తాయి.
౨౨ వాళ్ళ కోటల్లో అడవి కుక్కలూ, వాళ్ళ అందమైన రాజమందిరాల్లో నక్కలూ అరుస్తాయి. దాని కాలం దగ్గరపడింది. దాని రోజులు ఇక ఆలస్యం కావు.