౧౫
౧ మోయాబు గురించి ప్రకటన.
ఒకే రాత్రిలో ఆర్ మోయాబు పాడై నాశనమౌతుంది. ఒక్క రాత్రిలో కీర్ మోయాబు పాడై నాశనమౌతుంది
౨ ఏడవడానికి మోయాబీయులు గుడికీ, మెట్ట మీద ఉన్న దీబోనుకూ వెళ్తున్నారు. నెబో మీద, మేదెబా మీద మోయాబీయులు ప్రలాపిస్తున్నారు. వాళ్ళందరూ తమ తలలు గొరిగించుకున్నారు, గడ్డాలు క్షవరం చేయించుకున్నారు.
౩ తమ సంత వీధుల్లో గోనెపట్ట కట్టుకున్నారు. వాళ్ళ మేడల మీద, వాళ్ళ బహిరంగ ప్రాంగణాల్లో వాళ్ళందరూ ప్రలాపిస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు.
౪ హెష్బోను, ఏలాలే మొర్ర పెడుతున్నాయి. యాహసు వరకూ వాళ్ళ స్వరం వినిపిస్తూ ఉంది. మోయాబీయుల యోధులు బిగ్గరగా ఏడుస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు వాళ్ళల్లో వణుకుతున్నాయి.
౫ మోయాబు కోసం నా హృదయం అరుస్తూ ఉంది. దాని ప్రధానులు సోయరు వరకూ పారిపోతారు. లూహీతు ఎక్కుడు మార్గంలో ఏడుస్తూ ఎక్కుతారు. నాశనమై పోయామే అని పెద్దగా కేకలు వేస్తూ హొరొనయీము మార్గంలో వెళ్తారు.
౬ ఎందుకంటే నిమ్రీములో ఉన్న నీళ్ళు ఎండిపోయాయి. గడ్డి ఎండిపోయింది. కొత్తగా పుట్టిన గడ్డి కూడా ఎండిపోతుంది. పచ్చదనం ఎక్కడా కనిపించదు.
౭ వాళ్ళు సంపాదించిన ఆస్తినీ, వాళ్ళు కూర్చుకున్న పంటనూ నిరవంజి చెట్లున్న నది అవతలకు వాళ్ళు మోసుకు పోతారు.
౮ రోదన మోయాబు సరిహద్దుల్లో వినిపించింది. అంగలార్పు ఎగ్లయీము వరకూ, బెయేరేలీము వరకూ వినిపించింది.
౯ ఎందుకంటే దీమోను నీళ్ళు రక్తంతో నిండి ఉన్నాయి. కాని నేను దీమోను మీదకి మరింత బాధ రప్పిస్తాను. మోయాబులోనుంచి తప్పించుకున్న వాళ్ళ మీద, ఆ దేశంలో మిగిలిన వాళ్ళ మీద ఒక సింహం దాడి చేస్తుంది.